23, అక్టోబర్ 2025, గురువారం

తిరుఉత్తర_కోసమాంగై

 #తమిళనాడులో రామేశ్వరం నుండి 75 కి.మి. దూరంలో "#తిరుఉత్తర_కోసమాంగై" అని ఊరు ఉంది. 

మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి సొంత ఊరు ఇది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. 

శివభక్తురాలైన #మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన #రావణబ్రహ్మను_మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. 

ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని #మొగలి_పువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన #రేగిపండు_చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. 

ఇక్కడ శివుడు #శివలింగరూపంలో, #మరకతరూపంలో, #స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. 

ఆ మరకతం నుండి వచ్చే #కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం #ఆరుద్ర_నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. 

అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. 

ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు #వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా #రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి.🙏

అందరికీ కార్తీక్ మాస ప్రారంభ శుభాకాంక్షలు

కృతజ్ఞతాభావం

 ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు: కష్టపడకుండా ఎందుకు అడుక్కుంటున్నావు? దానికి ఆ బిచ్చగాడు: "సార్… నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది.


గత ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఏదీ దొరకలేదు. మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు. మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను".


"నీకు తప్పకుండా సహాయం చేయాలని అనిపిస్తోంది. కానీ, నీకు ఉద్యోగం ఇప్పించాలని నా ఆలోచన కాదు. నేను మరొకటి ఆలోచించాను".


"మరోకటా…? ఏదైనా సరే, నా సమస్య తీరితే చాలు" అన్నాడు బిచ్చగాడు.


"నిన్ను నా వ్యాపార భాగస్వామిని చేయబోతున్నాను".


"ఏంటి వ్యాపార భాగస్వామినా…?"


"అవును… నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. నీకు దుకాణం పెట్టడానికి స్థలం, ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే. ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి. అంతే!"


'పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా? దేవుడు కన్ను తెరిచేశాడురా బాబూ' అని బిచ్చగాడు మనసులో సంతోషపడ్డాడు.


"సార్… అది… లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి…? మీకు 90% నాకు 10% ఆ? లేక మీకు 95% నాకు 5% ఆ? ఎలా??" ఆసక్తిగా అడిగాడు.


"కాదు… నువ్వు 90% తీసుకుని నాకు 10% ఇస్తే చాలు".


అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట రాలేదు. "ఏం చెబుతున్నారు సార్?" నమ్మలేకపోయి అడిగాడు.


"అవును నాన్నా… నీకు 90% నాకు కేవలం 10% చాలు. నాకు డబ్బు అవసరం లేదు. నువ్వు అనుకున్నదాని కంటే నా దగ్గర చాలా ఉంది. ఈ 10% కూడా నేను అడగడం నా అవసరం కోసం కాదు. నీకు కృతజ్ఞతాభావం ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే".


"నాకు జీవితాన్నే బిచ్చంగా ఇచ్చిన దేవుడా… నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" తర్వాతి క్షణం ఆ బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి కాళ్ళపై పడిపోయాడు.


వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైంది. బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది. మొదట వేలల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోనే లక్షలకు చేరుకుంది.


కానీ ఒక దశలో బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడిని మర్చిపోయాడు.


కొత్త బట్టలు ధరించడం మొదలుపెట్టి, దుకాణానికి వచ్చి వెళ్ళడానికి ఒక వాహనం కొన్నాడు. మెడలో సన్నని గొలుసు వేసుకున్నాడు. రాత్రింబవళ్ళు లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు. ధాన్యాల నాణ్యత బాగా ఉండటంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజురోజుకు పెరిగాయి. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా 10% వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకున్నాడు…


"నేను నా భాగస్వామికి ఎందుకు 10% ఇవ్వాలి? అతను దుకాణానికి రావడం లేదు కదా. కష్టం అంతా నాదే. రాత్రింబవళ్ళు నేను మాత్రమే పని చేస్తున్నాను… ఇకపై లాభం 100% నాకే సొంతం" అని నిర్ణయించుకున్నాడు.


కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి, కొత్తగా డబ్బు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరకు తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు.


"కష్టం అంతా నాదే. అలాంటప్పుడు నేను మీకు 10% ఎందుకు ఇవ్వాలి? లాభం అంతా నాకే సొంతం!" అని వాదించాడు.


ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చెబుతారు? ఒక క్షణం ఆలోచించండి…


ఇదే మనందరి జీవితంలో జరుగుతుంది. దేవుడే మన వ్యాపార భాగస్వామి. మనం ఆ కొత్తగా డబ్బున్న వ్యక్తి. దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని… ప్రతి క్షణాన్ని… మనం పీల్చే ప్రతి గాలిని… ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి, వాటిలో ప్రతి దానికి ప్రత్యేక శక్తులను ఇచ్చాడు దేవుడు. అది మాత్రమేనా?


ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు, కాళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇచ్చాడు. ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలుపెడితే… అది ఎప్పటికీ అంతం కాకుండానే ఉంటుంది. ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం 10% సమయాన్ని మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు. అది కూడా అతని అవసరం కోసం కాదు. అతనికి ఏ అవసరాలు లేవు. మన కృతజ్ఞతాభావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు. మనపై మనకు ఉన్న ప్రేమ కోసం.


ఒక వ్యక్తికి కృతజ్ఞతాభావం ఉంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా?


దేవుడిని పూజించడం, వేదాలను చదవడం, దేవాలయానికి వెళ్లడం, సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం లేదా తోటి మనుషులకు సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం, మన మంచి కోసం అయినప్పటికీ, దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం, శరీరం, అవయవాలను అతను చెప్పిన మార్గంలో, అతను కోరుకున్న మార్గంలో నడుపుతున్నాము, అనే తృప్తితో, ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికే. అంతే తప్ప దేవుడికి అది అవసరం కాబట్టి కాదు...