15, ఆగస్టు 2020, శనివారం

సర్వ శాస్త్రవేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు:

గురువులకు గురువు, సర్వ శాస్త్రవేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు:
--------------------------------------
ప్రముఖ సంస్కృత పండితులు.  సంఘ సంస్కర్త, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.  రచయిత, సాహితీ కారులు.

దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను  తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు.   అంతటి విఖ్యాతి వారిది. విజయనగరానికి సమీపం లో ఒంటి తాడి అగ్రహారం లో 25, జనవరి 1867 న తాతా సూర్యనారాయణావధాని, సోమి దేవమ్మ దంపతులకు సుబ్బరాయ శాస్త్రి గారు జన్మించారు.  కొడుకును శాస్త్ర పండితుడిని చేయాలనే బలీయమైన కోరిక ఉన్న వీరి తల్లిగారు కొడుకును చంకన ఎత్తుకొని దాదాపు రెండు కిలో మీటర్లు నడిచి విజయనగరం లో గురువు గారి వద్ద దింపి వచ్చేది.  అంత పట్టుదల చూపింది ఆ మహా ఇల్లాలు కుమారుని విద్యకోసం.  ఆ శ్రమ ఊరికే పోలేదు ఫలించింది.  తల్లి ఋణం తీర్చుకొన్నారు శాస్త్రి గారు.   పెరిగి పెద్ద వారైన శాస్త్రి గారు విజయనగరం లో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద చేరి సంస్కృత సాహిత్యం అభ్యసించి ప్రావీణ్యం సాధించారు.

శాస్త్రి గారిది పాదరసం లాంటి చురుకైన బుద్ధి.  మేధావిగా పరిగణన చెందారు.  వీరి శ్రద్ధాసక్తులు, వినయం, మేధావితనం కర్ణాకర్ణీగా విన్న రుద్రాభట్ల రామశాస్త్రి, లక్ష్మణ శాస్త్రి సోదరులు సుబ్బరాయ శాస్త్రిగారిని ఆహ్వానించి, చేరదీసి, వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి అసామాన్య పండితునిగా తీర్చి దిద్దారు. గొప్ప శిష్యునికోసం వెదికిన ఆ గురు సోదరులు ధన్యులు.   వారు నేర్పిన విద్య నేర్చి ఈ శిష్యుడూ గురువు గార్ల ఋణం తీర్చుకొన్నారు.

*బహు శాస్త్ర పరిజ్ఞానం* :
ధర్మ శాస్త్రం నేర్వాలన్న కోరిక కలిగి గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులై ఆసాంతం అభ్యసించారు.  కొల్లూరు కామశాస్త్రి గారిని చేరి వేదాంతం అంతం చూశారు. సంగీతం మీద మోజు కలిగి కట్టు సూర్య నారాయణ గారి వద్ద సంగీత గుట్టు మట్టులన్నీ  గ్రహించారు.  ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం దేశమంతా వ్యాపించి గొప్ప గుర్తింపు నిచ్చింది.  ఆంధ్ర దేశం లో ఏ శాస్త్రం లో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాలిసిందే.  వీరి తీర్పే తుది తీర్పు, శిరోదార్యమూ అయింది.  అంతటి నిష్పాక్షపాతం గా శాస్త్రబద్ధం గా ధర్మ,  న్యాయబద్ధం గా వ్యవహరించే వారు.  గంభీర హృదయులు.  తొట్రుపాటు లేని ప్రశాంత మూర్తి శాస్త్రి గారు.

*సుదీర్ఘ విద్యాదానం –అరుదైన రికార్డు* :

ఆ నాటి మేటి పండితులలో సుబ్బరాయ శాస్త్రి గారు నాగరికులు అనిపించు కొన్నారు.  లౌకిక జ్ఞానంలోనూ అసాధారణ ప్రజ్ఞ ఉండేది.  వీటి వలననే విజయ నగర పురపాలక సంఘం లోను, సహకార సంఘం లోను సభ్యులై స్థానిక సంస్థలలో ప్రధాన సభ్యులుగా అనేక మార్లు ఎన్నుకోబడ్డారు.   అంతటి విశేష మైన మూర్తిమత్వం వారిది.  విజయనగరం రాజా వారి సంస్కృత కళాశాలలో శాస్త్రిగారు నలభై ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానాచార్యులుగా పని చేసి శాస్త్రాధ్యాపనం చేశారు.  ఒక రకంగా ఇదొక రికార్డే .

*గ్రంధ రచన లో మేటి:*

 భారత దేశం లో ఉత్తమ వ్యాకరణ గ్రంధంగా పరిగణింపబడుతున్న నాగశ భట్టు రచించిన ‘’శబ్దెందు శేఖరం‘’ ను ఉత్తర దేశ పండితులు ఖండించటం మొదలు పెట్టి గ్రంథాలు కూడా రాశారు.  శాస్త్రి గారు వారి వాదాలనన్నిటిని గడ్డి పోచల్లాగా తేలిగ్గా తీసి పారేసి, ఖండనలకు ప్రతి ఖండనలు చేసి నాగశ భట్టు హృదయాన్ని ఆవిష్కరిస్తూ ‘’ *గురు ప్రసాదం* " అనే మహా ఉద్గ్రంథం రాసి, నోరు మూయించారు.  ఈ గ్రంథాన్ని  ఆంధ్ర  విశ్వావిద్యాలయం గౌరవం గా ముద్రించి లోకానికి అందించింది.  దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండితీ గరిమ తెలిసి శిష్యులై విద్య నేర్చుకొన్నారు.  అంతటి ప్రభావం చూపింది.  ఆ గురుప్రసాదం శిష్యుల పాలిటి వరమే అయింది.  శాస్త్రిగారు ఈ గ్రంధాన్ని ‘’స్వర సంధి" వరకు రాశారు.  శిష్యులు పేరి వెంకటేశ్వర శాస్త్రి ‘’గురు ప్రసాద శేషం ‘’ పేరిట ‘’కారకాంతం" వరకు రాసి పూర్తి చేశారు.  అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు తాతా వారు శాస్త్రి గారి అమోఘ పాండిత్యానికి వారసులుగా వీరు ఉన్నారు అనటానికి ఇది  ఒక ప్రత్యక్ష సాక్ష్యం.  దీనినీ ఆంధ్రా యూని వర్సిటీ యే ముద్రించింది. సుబ్బరాయ శాస్త్రి గారు, హరి శాస్త్రి రాసిన ‘’శ్శబ్ద రత్న‘’ వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే ఆంద్ర విశ్వ కళాపరిషత్ ప్రచురించింది .

*పురస్కార గౌరవ రికార్డ్:*

1912లో ‘’మహా మహోపాధ్యాయ" బిరుదం శాస్త్రి గారిని వరించింది.  ఆ బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారే.  ఇదీ ఒక  రికార్డే.  ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు శాస్త్రిగారిని సగౌరవం గా మద్రాస్ కు ఆహ్వానించి, తనపేరు చెక్కబడిన ‘’సువర్ణ కంకణాన్ని" స్వయం గా శాస్త్రిగారి చేతికి తొడిగి అలంకరించాడు.  ఇది ఒక భారతీయ అందునా ఆంధ్ర  దేశానికి చెందిన శాస్త్ర పండితునికి లభించిన అరుదైన గౌరవం.  ఇది మూడవ రికార్డు. విజయనగరం లోనే కాక ఉర్లాం, పిఠాపురం సంస్థాన పండిత పరీక్షలకు శాస్త్రి గారు ఎప్పుడూ ప్రధాన  పరీక్షకులుగా ఉండేవారు. ఇంతటి శాస్త్ర పండితునికి సంఘ సంస్కరణ పై మిక్కిలి అభిమానం ఉండటం ఆ రోజుల్లో ఆశ్చర్య పడే విషయం.  దురాచారాలను కాలాన్ని బట్టి మార్చుకొని సంస్కరించుకొని శాస్త్ర సమ్మతాలైన వానిని అనుసరించాలని ఎప్పుడూ ప్రబోధించేవారు.  మహాత్ముని ఖద్దరు వస్త్ర ధారణ, వీరిపై ప్రభావం చూపింది.  నిత్యం సన్నని పొందూరు ఖద్దరు వస్త్రాలే జీవితాంతం ధరించే వారు .

 *శాస్త్ర వాద తీర్పరి* :

ఆంధ్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒకసారి అధ్యక్ష స్థానంలో ఉండి ఆంధ్ర భాష ఔన్నత్యం కోసం మార్గ నిర్దేశం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది.  రాజమండ్రి శ్రోత్రియ మహాసభ, విశాఖ జ్యోతిశ్శాస్త్ర సభలలో పండితులు చేసిన చర్చోప చర్చలకు శాస్త్రి గారినే ఉభయ పక్షాల వారు  "తీర్పరిగా" ఉండమని వేడుకోవటం, శాస్త్రి గారి సర్వతోముఖ ప్రతిభకు, నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనం.  శాస్త్రిగారు కాశీ, దర్భంగా, పుదుక్కోట వగైరా సంస్థానాల ను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి "జయపత్రాలు"  అందుకొన్నారు.  శాస్త్రవాదాల లో అగ్రగణ్యులని గుర్తింపు పొందిన కాశీ పండితుడైన ‘’జయ దేవ మిశ్రా పండితుడు" సుబ్బరాయ శాస్త్రి గారి పేరు విన్నంతనే, అమాంతం ‘’రెండు చేతులు జోడించి’’ నమస్కరించే వారట.  అంతటి మహోన్నత పండితులు మన సుబ్బరాయ శాస్త్రి గారు.

శాస్త్రి గారి 63 వ జన్మదినోత్సవం నాడు శిష్య, ప్రశిష్య బృందం  ఆత్మయ పండిత సాహితీ బృందం అందరూ కలిసి మహా వైభవంగా గురు పూజోత్సవం  జరిపి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఘనంగా సన్మానించి గౌరవించి చిరకీర్తిని  ఆర్జించారు.

ఆయన వితంతు పునర్వివాహాలను సమర్థించారు. అంటరానితనాన్ని వ్యతిరేకించారు.

మహా మహోపాధ్యాయ గురువులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహులుగా, ఓటమి ఎరుగని పండితులుగా, బహు గ్రంధకర్తగా జీవించి 1944 లో కీర్తిశేషులు అయ్యారు.

రసజ్ఙభారతి సౌజన్యంతో-
చిర్రావూరి శివరామకృష్ణశర్మగారు.
*********************

కామెంట్‌లు లేవు: