17, సెప్టెంబర్ 2018, సోమవారం

మోసం (చిన్న కధ )

అది ఒక చిన్న పల్లెటూరు. చిన్న చిన్న గుడిసెలు మాత్రమే వున్నాయి. ఏ వస్తువు కావాలన్న దాదాపు పది పదిహేను కిలోమీటలు నడిచి వెళ్ళాలసిందే.  అరవై పైన వున్నా వాడు వీరయ్య .వీరయ్యకు  ఇంకా సంపాదించాలనే కోరికఉన్నవాడు.  పొలం పనులు చేయలేని వాడు కావటంతో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు.  ఆ దుకాణంలో చాకిలెట్లు, పిప్పరమెంట్లు చిన్నపిల్లల గోళీలు, మెదలైనవి ఉంటాయి.  రోజు రెండు మూడు వందల వరకు అమ్మకం జరుగుతుంది.  ఆ ఊరిలోని పిల్లలందరూ వీరయ్య ని కొట్టు  తాత అని పిలుస్తారు.  ఒక రోజు సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో ఒక చిన్న పిల్లవాడు దాదాపు 10 సంవస్సరాల వయస్సు ఉండొచ్చు వాడు విరిగాడి దుకాణానికి వచ్చి ఐదు రూపాయల పిప్పరమెంట్లు కొని పది రూపాయలు ఇచ్చాడు.  వీరయ్య వాడి దగ్గర డబ్బులు తీసుకొని తన దగ్గర చిల్లర లేదు రేపు వచ్చి ఐదు రూపాయలు తీసుకోమని చెప్పాడు.  వాడు సరేనని వెళ్ళాడు.  మరుసటి రోజు ఆ పిల్లవాడు తిరిగి రాలేదు.  అంతేకాదు మరొక రెండు రోజుల వరకు కూడా రాలేదు.  దానితో ఆ పిల్లవాడి ఐదు రూపాయలు మిగిలినందుకు సంతోషించాడు.  నిజానికి తన దగ్గర చిల్లర వున్నా ఇవ్వనందుకు వాడిని మోసం చేసానని ఆనంద పడ్డాడు.  నాలుగైదు రోజుల తరువాత సరకు తీసుకోరావటానికి  ప్రక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ తానూ ఇన్నాళ్లు సంపాదించిన ఒక్కొక్క రూపాయే కలిపి ఒక వేయి రూపాయలతో సరుకు కొన్నాడు. ఆ దుకాణదారుడు వీరయ్య ఇచ్చిన రూపాయలు లెక్కచూసుకొని ఒక పది రూపాయల నోటు తిరిగి ఇచ్చి ఇది చెల్లదు పిల్లలు ఆడుకొనే నోటు అని తిరిగి ఇచ్చాడు.  దానితో వీరయ్య మొఖం పాలి పోయింది.  వీరయ్య ఎంత ఆలోచించిన ఆ నోటు ఎవ్వరు ఇచ్చారో జ్ఞాపకం రాలేదు.   అది ఆ పిల్లవాడు ఇచ్చాడని వాడే వీరయ్య ను మోసం చేసాడని పాపం వీరయ్య కి తెలియదు.