29, ఏప్రిల్ 2025, మంగళవారం

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా

ఉ॥

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా 

కామిత కార్యదక్షులు నకారణ వత్సలపూర్ణచిత్తులై 

ప్రేముడి నీడనిచ్చి పెనువేసవిఁ బండ్ల నొసంగు వృక్షముల్ 

భూమిని నిల్చునట్లు సురభూజములౌగద! యుత్తముల్ మహిన్ 

*~శ్రీశర్మద*

తెలుగు భాషావిర్భావము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏

             మొదటి భాగము 

తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు తెలుగుకు పాత రూపాలు తెనుంగు తెలింగా, తెనుగు అనునవి.

తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

శాసనాలను పరిశీలించిన అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనుమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞా,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,,స,హ,ళ.వర్ణములు వాడుకయందుండెను. కాగా అందుశకట రేఫము ఒకటి.ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవు చున్నది.సుమారు క్రీస్తు పదవశతాబ్ది అంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాసించువఱకు శాసనములందు 'ఱ'అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ'గాను,కొన్ని చోట్ల 'ళ'గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లు న్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగా శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఱ' 'పదములలో(ఱలో లోపలి గీత తొలగించగా మిగిలిన అక్షరము దాన్ని డ్జ గా పలికే వారు ఈ వ్యాసములో ఎక్కడ ఱ వ్రాసినను బండి ర గా పలక కూడదు డ్జ గా పలకాలి పూర్తి సంయుక్తము గా కాకుండా కొంచెం తేలికగా పలకాలి ఈ విషయం మరచిపోవద్దు ) 'చోఱ ( చోడ్జ గా పలకాలి కన్నడిగుల వల్లనే డ్జ అని పలకాలని ఉచ్చారణ తెలిసింది ఈ అక్షరం కన్నడం లో ఎక్కువ కాలము ఉంది.) అనే పదం చోడ' లేక 'చోళ' అనియు;'నోఱంబ' పదములో 'నోళంబ' అనియు,ఱెందలూరు అనుచోట దెందులూరు గాను, క్టిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'ఱ' క్ఱొచె'అనుపదము 'క్రొచ్చె';వ్ర్ ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించారు.తెలుగు శాసనములలో చొఱ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక 'ఱ' ( బండి ర కాదు డ్జ) అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

 అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని చరిత్రకారులు పేర్కొన్నారు . పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది అని తెలుస్తోంది

                          సశేషం .

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ