23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

చదువు,మిత్రుల కోసం

 (నాన్న నేర్పిన చదువు,మిత్రుల కోసం)


[[తండ్రి]]

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ, పద్మము - అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


{{కొడుకు}}

కమలము, నళినము, తామరపూవు


[[తండ్రి]]

అంతేనా?


{{కొడుకు}}

నాకంతే తెలుసు.


[[తండ్రి]]

నేను చెబుతాను చూడు - వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

నాన్నా, నాన్నా, ఆగు.


[[తండ్రి]]

చెప్పు.


{{కొడుకు}}

వీటన్నిటికీ అర్థం పద్మం అనేనా?


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

మరి #డిక్షనరీ వెదికితే ఇవన్నీ దొరుకుతాయా?


[[తండ్రి]]

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


{{కొడుకు}}

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి?


[[తండ్రి]]

నేను #అమరకోశం చదువుకున్నాను. అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


{{కొడుకు}}

అదెలా?


[[తండ్రి]]

#అమరం లో కొన్ని పర్యాయపదాలను #అమరసింహుడు ఉపదేశించాడు. వాటికి కొన్ని ప్రత్యయాలు జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


{{కొడుకు}}

ఎలా?


[[తండ్రి]]

చెబుతా చూడు - 1 వారి, 2 నీరమ్, 3 జలమ్, 4 సలిలమ్, 5 కమ్, 6 తోయమ్, 7 ఉదకమ్, 8 పుష్కరమ్, 9 పయః, 10 అంభః, 11 అంబు ... ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు నీరు అనే అర్థంలో చెప్పాడు.


{{కొడుకు}}

అయితే?


[[తండ్రి]]

పద్మము పుట్టేది ఎక్కడ? నీటిలో కదా? అందువల్ల పైన చెప్పిన పదాలకు 'జ' అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - పద్మము అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి. మళ్లీ చెప్పనా? వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము..


{{కొడుకు}}

చివరలో 'జ' - అని ఎందుకు చేర్చాలి?


[[తండ్రి]]

'జ' - అంటే జాతము, జన్మించినది అని అర్థం వస్తుంది. జలజ అంటే జలములో జన్మించినది అని అర్థం. అలాగే నీరజ అంటే నీటిలో జన్మించినది అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


{{కొడుకు}}

జ అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా?


[[తండ్రి]]

జాతము అనవచ్చు.


{{కొడుకు}}

అయితే నేను చెబుతాను చూడు. వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము..


[[తండ్రి]]

బలే. నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


{{కొడుకు}}

జ, జాత మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా?


[[తండ్రి]]

భవ, ఉద్భవ, సంభవ అనే పదాలను చేరిస్తే పుట్టినది లేదా పుట్టినవాడు అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు జలభవము, జలోద్భవము, జలసంభవము అంటే జలంలో పుట్టినది అని అర్థం. అలాగే నీరభవము, నీరోద్భవము, నీరసంభవము అని చెప్పవచ్చు.


అలాగే రుహ అనే ప్రత్యయం చేర్చవచ్చు. రుహము అంటే పెరిగేది. 


{{కొడుకు}}

అయితే నేను చెబుతా దానితో పేర్లు - వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము..


[[తండ్రి]]

బాగా చెప్పావు. ఏక సంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా పద్మము అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా?


{{కొడుకు}}

నీటికి 11 పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి జ అనే ప్రత్యయం చేర్చి, పద్మం అనే అర్థంలో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. జాత అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. రుహ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు సృష్టించగలను. భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, ఉద్భవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను, సంభవ అనే ప్రత్యయం చేర్చి మరో 11 పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి పద్మము అనే అర్థంలో ఇప్పటికిప్పుడు 66 పదాలను చెప్పగలను.


[[తండ్రి]]

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు? ఇప్పుడేమో ఏకంగా అరవై ఆరు పదాలు చెప్పగలనంటున్నావు?


{{కొడుకు}}

నువు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను?


[[తండ్రి]]

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


{{కొడుకు}}

అదెలా నాన్నా?


[[తండ్రి]]

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు?


{{కొడుకు}}

పద్మాన్ని హస్తంలో ధరించే విష్ణువు ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే విష్ణువు ఉన్నాడు. పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు ఉన్నాడు. క్షీరసాగరమధ్యంలో పద్మంలో జన్మించిన లక్ష్మీదేవి ఉన్నది. 


[[తండ్రి]]

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు? సరే, ఇప్పుడు చూడు. పద్మం అనే అర్థంలో నీవు 66 పదాలు చెప్పగలవు కదా? వాటికి చివర హస్తుడు అని చేర్చు. వాటన్నిటికీ పద్మాన్ని చేతిలో ధరించినవాడు అనే భావంలో విష్ణువు అనే అర్థం వస్తుంది. అంటే ఈ క్షణంలో నీవు విష్ణువు అనే పదానికి పర్యాయవాచకాలు 66 చెప్పగలవు.


{{కొడుకు}}

ఓహో. బలే. అర్థమైంది. వారిజహస్తుడు, నీరజహస్తుడు ఇలా అన్నమాట.  


[[తండ్రి]]

అవును.


{{కొడుకు}}

అయితే నాన్నా, హస్తం అనే పదంతో పాటు కరము, పాణి అనే పదాలను కూడా చేయి అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా, వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా?  


[[తండ్రి]]

హాయిగా ఉపయోగించవచ్చు. ఆవిధంగా హస్తుడు అనే ప్రత్యయాన్ని చేర్చి 66, కరుడు అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66, పాణి అనే ప్రత్యయాన్ని చేర్చి మరో 66 మొత్తం 198 పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


{{కొడుకు}}

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే?


[[తండ్రి]]

నీటికి ఇంకా కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము - ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో పద్మం అనే అర్థం సాధించి, మరలా ఆ పద్మాన్ని చేత ధరించినవాడనే అర్థంలో ఇంకెన్ని విష్ణుపర్యాయవాచకాలను సృష్టించవచ్చో చూడు. 


{{కొడుకు}}

బలే నాన్నా, బలే. అలాగే పద్మంలో పుట్టిన బ్రహ్మ అనే అర్థంలో - పద్మం యొక్క 66 పర్యాయవాచకాలకు జ, జాత, భవ, సంభవ, ఉద్భవ, రుహ అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం 396 (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


[[తండ్రి]]

ఓహో, సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా? పద్మజుడు, పద్మసంభవుడు అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే బ్రహ్మ అనే అర్థం వస్తుంది.  


వాటిని పద్మజ, పద్మసంభవ అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే లక్ష్మి అనే అర్థం వస్తుంది.


మరి ఆ బ్రహ్మకు తండ్రి విష్ణువు అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు? 

 

{{కొడుకు}}

పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, తండ్రి అనే అర్థాన్నిచ్చే జనక, గురు, పితా, జన్మద అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ 396 పదాలకు చేరిస్తే (396x4) 1584 పదాలను విష్ణువు అనే అర్థంలో సృష్టించగలను.


[[తండ్రి]]

మరి లక్ష్మీదేవికి భర్త విష్ణువు అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు?


{{కొడుకు}}

పద్మంలో పుట్టినది లక్ష్మి అనే అర్థంలో 396 పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా, వాటికి పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ వంటి నాకు తెలిసిన ఓ 6 ప్రత్యయాలను చేర్చి (396x6) 2376 పదాలను సృష్టించగలను. 


[[తండ్రి]]

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం 3960 నామాలను సృష్టించావు. (1584+2376)


{{కొడుకు}}

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


[[తండ్రి]]

పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు అంటే విష్ణువు కదా, పద్మానికి 66 పర్యాయపదాలు నీకు తెలుసు కదా, వాటికి చివర నాభుడు అనే ప్రత్యయం తగిలించు. వారిజనాభుడు, జలజనాభుడు అంటూ. కాబట్టి, 3960+66=4026 నామాలు వచ్చాయి. మొత్తానికి ఇలా విష్ణుచతుస్సహస్రనామాలు సృష్టించగలవు.


{{కొడుకు}}

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా.


[[తండ్రి]]

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు. ఇన్నేసి పదాలను #డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ అంటూ ఉంటారు.  


{{కొడుకు}}

అవును నాన్నా, ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


[[తండ్రి]]

సరే, నళినదళేక్షణ అనే పదం విన్నావా?


{{కొడుకు}}

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా?


[[తండ్రి]]

నళినదళేక్షణుడు అంటే అర్థం ఏమిటి?


{{కొడుకు}}

రాముడు.


[[తండ్రి]]

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి రాముడు అంటూ రూఢి-అర్థాన్ని గ్రహించావు. మరి #యౌగికార్థం చెప్పు?


{{కొడుకు}}

అదేమిటి?


[[తండ్రి]]

నళినము అంటే పద్మము. నళినదళము అంటే పద్మదళము, ఈక్షణము అంటే చూపు లేదా కన్ను. కాబట్టి నళినదళేక్షణుడు అంటే పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


{{కొడుకు}}

ఓహో.


[[తండ్రి]]

ఓహో అని ఆశ్చర్యపోవడం కాదు. నళినదళేక్షణుడు అంటే యౌగికార్థం తెలిసింది కదా? మరి ఇప్పుడు సమానార్థకాలైన ఇంకెన్ని పదాలను సృష్టించగలవు?


{{కొడుకు}}

నళినము అంటే పద్మము అనే అర్థంలో మునుపు 66 పదాలను సృష్టించివున్నాము కదా, వాటికి చివర కన్ను అనే అర్థంలో ఈక్షణ, నేత్ర, నయన, లోచన, చక్షు, అక్ష అని నాకు తెలిసిన ఆరు ప్రత్యయాలను ఉపయోగించి పద్మేక్షణుడు, పద్మనేత్రుడు, పద్మనయనుడు, పద్మలోచనుడు, పద్మచక్షువు, పద్మాక్షుడు ఇలా 396 పదాలను (66x6) సృష్టించగలను. ఇలా పుంలింగంలో ఉపయోగిస్తే 396 పదాలతో రాముడు వస్తాడు. అలాగే పద్మేక్షణ, పద్మనేత్ర, పద్మనయన, పద్మలోచన, పద్మచక్షువు, పద్మాక్షి అంటూ మరో 396 పదాలను స్త్రీలింగంలో ఉపయోగిస్తే సీతమ్మవారు. అంతేనా?


[[తండ్రి]]

అవును. ఆ పదాలకు రాముడు, సీతమ్మ అని మాత్రమే అర్థాలను గ్రహిస్తే అవి నీకు రూఢార్థాలు. అలా కాదు, పద్మం వంటి కన్నులు కలిగిన ఎవరైనా పద్మాక్షుడు లేదా పద్మాక్షి కావచ్చును అనే అర్థంలో గ్రహిస్తే అవి యౌగికార్థాలు.




{{కొడుకు}}

ఓహో, మరి అకాయుడు అనే పదాన్ని మనం రూఢార్థంలో గ్రహించాలా లేక యౌగికార్థంలో గ్రహించాలా?


[[తండ్రి]]

ఎలాగైనా గ్రహించవచ్చు.


{{కొడుకు}}

అర్థమైంది నాన్నా.


[[తండ్రి]]

శుభమస్తు.


{{కొడుకు}}

సర్వం శ్రీ నళినదళేక్షణార్పణమస్తు.  

అంటే #శ్రీరామార్పణమస్తు.


[[తండ్రి]]

తథాస్తు.


Note: ఈ సందర్భంలో ప్రత్యయం అనే పదం ఆంగ్లంలోని Suffix అనే పదానికి సమానార్థకంగా వాడబడింది.  



"నాన్న నేర్పిన చదువు" 



మాఘశుక్లచతుర్దశీ, శోభకృత్, శుక్రవాసరః

రచన :- శ్రీ శ్రీనివాసకృష్ణ గారు

Rice recepy


 

Homam in kasi


 

పంచాంగం

 *శుభోదయం*పంచాంగం *

ఫిబ్రవరి-23  శుక్రవారం     

*స్వస్తిశ్రీ  శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు*   

*మాఘ మాసం, శుక్లపక్షం* 

తిథి:  ☀చతుర్దశి 03:01 PM పౌర్ణమి ప్రారం||

భృగువాసరే

నక్షత్రం:  ☀ఆశ్లేష 07:03 PM మఖ ప్రారం||

వర్జ్యం: 08:53 AM – 10:40 AM

దుర్ముహుర్తం: ఉ. 08-24ల 09-12

ప. 12-28ల 01-12

రాహుకాలం: ఉ. 10-30ల 12-00

సూర్యోదయం   : 06:40am

సూర్యాస్తమయం : 06:21pm

కోపం తననే నశింపచేస్తుంది

నీతిశాస్త్రం॥ ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః ॥ భావము॥ తనను తాను అదుపులో ఉంచుకొనలేనివాని కోపం తననే నశింపచేస్తుంది॥ వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు। నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాదసిధ్ధిరస్తు॥

పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పెద్దిశెట్టి గారు...పాలరాతి విగ్రహం..*


"శ్రీధరరావు గారూ..స్వామివారి సమాధి వద్ద స్వామివారిది పాలరాతి విగ్రహం ప్రతిష్ట చేస్తే ఎలావుంటుందీ?..మా ఇద్దరికీ ఆలోచన కలిగింది..మిమ్మల్ని సలహా అడిగి ఆపైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము.." అన్నారు శ్రీ చక్కా కేశవులు గారు, శ్రీ మీరాశెట్టిగారు..నాన్నగారు కొంచెం సేపు ఆలోచించారు.."స్వామివారి సమాధి మందిరం చాలా చిన్నది కదా..అందులో విగ్రహం ఎలా పెట్టాలి?.."అన్నారు..


"పడమర వైపు గోడ ను కొద్దిగా తొలగించి ఆ ప్రదేశం స్వామివారి విగ్రహాన్ని పెడదాము..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా శ్రీ స్వామివారి విగ్రహం చక్కగా కనబడుతుంది..ఏమంటారు?.." అన్నారు కేశవులు గారు..


ఈ ఆలోచన అందరికీ నచ్చింది..కానీ ఎంత పరిమాణం లో విగ్రహం చేయించాలో ఎవరికీ తోచలేదు..శ్రీ స్వామివారి సమాధి గది చాలా చిన్నది..అందులో ఎటుచూసినా మూడు అడుగుల వెడల్పుతో సమాధి నిర్మాణం జరిగింది..సమాధికి, గది గోడకు మధ్య రెండు అడుగుల ఖాళీ స్థలమే ఉన్నది..మంటపం లో ఉన్న భక్తులకు కూడా స్పష్టంగా కనబడేలా..సమాధి వద్ద ప్రదక్షిణాలకు ఇబ్బంది లేకుండా ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి..ఇది కొంచెం కష్టం తో కూడుకున్న పని..రెండు మూడు రోజుల పాటు ఈ విషయమై ఆలోచన చేశారు..


ఆ సమయం లోనే గోనుగుంట పెద్దిశెట్టి గారు తాను శ్రీ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని..అందుకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తాననీ తెలిపారు..శ్రీ కేశవులు గారు, మీరాశెట్టి గారు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు..శ్రీధరరావు గారితో చెప్పారు..వారూ సరే నన్నారు..రెండు మూడు రోజుల పాటు తర్జన భర్జన చేసిన తరువాత కూడా..విగ్రహం ఎత్తు ఎంతవుండాలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు..మరో రోజు గడిచింది..అందరూ కూడా ఇక స్వామివారే ఈ సమస్య ను తీర్చాలి అని ఒక నిశ్చయానికి వచ్చారు..ఎప్పుడైతే వీళ్ళందరూ శ్రీ స్వామివారిని శరణు వేడారో.. ఆరోజే పెద్దిశెట్టి గారికి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో మనసులో తట్టింది..తనకు వచ్చిన ఆలోచనను అందరికీ చెప్పారు పెద్దిశెట్టి గారు..అదే ఖరారు చేశారు..


శ్రీ స్వామివారి విగ్రహాన్ని పాలరాతి తో చేయించారు..ముందు అనుకున్న విధంగానే..శ్రీ స్వామివారి సమాధి గది లో పడమర వైపు ఉన్న గోడలో..విగ్రహం పట్టే విధంగా కొంతమేర తొలగించి..శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు..ప్రతిష్ట కార్యక్రమం మాత్రం పెద్దిశెట్టి గారి కుమారుడు సుబ్బారావు దంపతుల చేతుల మీదుగా జరిగింది..మళ్లీ కొన్నాళ్ల తరువాత..శ్రీ స్వామివారి విగ్రహానికి వెండితో కవచం చేయించాలని ఒక ప్రతిపాదన చేశారు గానీ..కార్యరూపం దాల్చలేదు..శ్రీ స్వామివారు దిగంబరి గానే వుండేవారు కనుక..కవచం తో విగ్రహాన్ని కప్పివేయడం సరికాదు అనే భావన తో ఆ ఆలోచనను విరమించుకున్నారు..


శ్రీ స్వామివారి విగ్రహం ప్రతిష్ట జరిగిన సంవత్సరం నుండీ..శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవం లో భాగంగా..శ్రీ స్వామివారి విగ్రహానికి, మరియు శ్రీ స్వామివారి సమాధి కి గంధాన్ని అద్ది..తరువాత ఆ గంధాన్ని దత్తదీక్షాపరులకు పంచడం జరుగుతున్నది..ప్రతిరోజూ శ్రీ స్వామివారి సమాధిని దర్శించే భక్తులు..ఈ పాలరాతి విగ్రహానికి మ్రొక్కుకుంటూ వుంటారు..అదొక ఆనవాయితీగా మారిపోయింది..


ఆనాడు శ్రీ పెద్దిశెట్టి గారికి మనసులో తట్టిన ఆలోచన కార్యరూపం దాల్చి..ఈనాడు ఎందరో భక్తుల ఆరాధ్య హేతువుగా మారిపోయింది.."నాదేముంది..? స్వామివారే తన విగ్రహం ఎంత పరిమాణం లో ఉండాలో నిర్ణయించి..నా ద్వారా పలికించారు.." అనేవారు వినయంగా పెద్దిశెట్టి గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మవారితోనే పాచికలాడి *

 🍁 అమ్మవారితోనే పాచికలాడి *శ్రీచక్రంలో* అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం  🍁


🍁🍁🍁🍁🍁


*మధుర మీనాక్షి* అమ్మవారి ఆలయంలో *శ్రీ ఆదిశంకరులు*  *శ్రీచక్రం*  ప్రతిష్ఠించిన ఉదంతం


🍁 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.

🍁 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.

🍁 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!

🍁 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.

🍁 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

🍁 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 

🍁 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 

🍁 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.

🍁  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 


🍁 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.

🍁 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో  చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.  

🍁 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.

🍁  ఎదురుగా విశాలమైన మండపములో


ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.

🍁 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. 

🍁  ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

🍁 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

🍁 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.

🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. 

🍁 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!"  ఆనుకుంది అమ్మవారు.

🍁 "ఎవరు నాయనా నీవు ?  నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.

🍁 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. 

🍁 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి"  మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగిన వారు శ్రీచక్రార్చన చేసినటిఫలం పొందుతారు". 

🍁 " నీకు ఏవరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. 

🍁 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"

🍁 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా


నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.

🍁 పసితనపు  అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" 

🍁  "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". 

🍁 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.  

🍁  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమి కోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివుని నుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరీశ్వరునికి కూడా తెలియచేయాలి" అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.


మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు , పురాణ కథల కోసం 

*సనాతన హిందూ ధర్మం*  పేజీని  లైక్ చేసి ఫాలో  చేయండి.


🍁  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"  

🍁  "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై  ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.  

🍁 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాట ప్రకారాం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగా ఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహార కార్యక్రమం కొనసాగించాలని  ఆలోచించింది. 

🍁  ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.

🍁 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది.  మరి మీఇష్టము!" అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

🍁 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.

🍁 నీ లలితాసహస్రనామం లోని  కొన్ని నామాలు, వాటి అర్ధాలు ఆలోచిస్తూ  ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురా


లైనది ఆతల్లి.

🍁 సంఖ్యాశాస్త్రప్రకారము  పావులు కదులుతూ ఉన్నాయి.  సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. 

🍁 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా 

కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. 

🍁 "విజయం నాదయినా, నీదయినా రెండూ ఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి  చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.

🍁 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది.  ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవం యొక్క పాదాలను పట్టుకొనేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. 


🍁 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.

🍁 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాలవద్దున్న పుష్పాలను తన పావులు గాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యే వరకు  "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. 

🍁 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము  మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈ ఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. 

🍁 వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. 

🍁 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటుసాకు


తో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.

🍁  "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. 

🍁 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్ట సమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. 

🍁 "నాయనా! చివరి పందెం నాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో  యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష  ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారి ముందు పెడుతూ.

🍁 "నేను గెలిచాను. మరిమన ఒప్పందం ప్రకారం నా సంహార కార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.


🍁 *"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!"* అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. 


🍁 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందు త్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. 

🍁 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్ద నుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ  విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్క అక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను  చూడుతల్లీ!"


🍁 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయం వరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి.

 

🍁 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చన గదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను".

🍁  "ఆ కార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్ర పరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీ ముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదనతో  బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈ యువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. 

🍁 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణ వేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. 

🍁 ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. 

 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.  

మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. 


🍁 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపు చేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధము చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏమలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.

🍁 అందుకే ఆ సమయంకోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలా చేసింది. అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెల్సు. 

🍁 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. 

🍁 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరుని రంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య బలై ఉంటాడని

 భయబ్రాంతుడయ్యాడు.

🍁  రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులు తీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికి సిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్విక రూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. 

🍁 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

🍁 *ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది*. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". 

🍁 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.


*మూలమ్: శ్రీ లలితా స

హస్రనామ సర్వస్వం 📙*

ఆత్మానమేవ

 నీతిశాస్త్రం॥ ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః ॥ భావము॥ తనను తాను అదుపులో ఉంచుకొనలేనివాని కోపం తననే నశింపచేస్తుంది॥ వేదపురుషానుగ్రహసిధ్ధిరస్తు। నిరంతరం దేవబ్రాహ్మణ ప్రసాదసిధ్ధిరస్తు॥

వాత్సల్య

 



*"18 " సంవత్సరాలలోపు, పిల్లలకు,వారి "తల్లి" గాని, "తండ్రి" గాని చనిపోయిన, వారికి నెలకు 4,000/- రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే,"వాత్సల్య స్కీం" గురించి ముఖ్య విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకొని, లబ్ధి పొందే ప్రయత్నం చేయండి. దయచేసి మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూప్ లకు పంపండి ఎవరికైనా ఉపయోగ పడుతుంది🙏*

113 కోర్సులు

 *ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే...*


001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్

002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్

003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్

005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్

006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్

007. బయో మెడికల్ ఇంజనీరింగ్

008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్

009. సెరామిక్స్ ఇంజనీరింగ్

010. కెమికల్ ఇంజనీరింగ్

011. సివిల్ ఇంజనీరింగ్

012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్

016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్

017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

019. మెరైన్ ఇంజనీరింగ్

020. మెకానికల్ ఇంజనీరింగ్

021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

022. మెటాలర్జీ

023. మెటరాలజీ

024. మైనింగ్ ఇంజనీరింగ్

025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్

026. ఫిజికల్ సైన్సెస్

027. పాలీమర్ ఇంజనీరింగ్

028. రోబోటిక్స్

029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్

030. అగ్రికల్చర్ సైన్స్

031. బయోలాజికల్ సైన్స్

032. బయోటెక్నాలజీ

033. కంప్యూటర్ అప్లికేషన్స్

034. కంప్యూటర్ సైన్స్

035. సైబర్ సెక్యూరిటీ

036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ

037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్

038. ఫిషరీస్

039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్

040. ఫుడ్ టెక్నాలజీ

041. ఫారెస్ట్రీ

042. ఓషియనోగ్రఫీ

043. స్టాటిస్టికల్ సైన్స్

044. వెటర్నరీ సైన్సెస్

045. వైల్డ్ లైఫ్ బయాలజీ

046. జువాలజీ

047. ఆయుర్వేద బీఏఎంఎస్

048. డెంటల్ బీడీఎస్

049. హోమియోపతి

050. న్యాచురోపతి

051. ఫార్మసీ

052. సిద్ధ

053. యునానీ

054. ఆంత్రోపాలజీ

055. ఆర్కియాలజీ

056. ఆర్ట్ రిస్టోరేషన్

057. క్యూరేషన్

058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్

059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్

060. మ్యూసియాలజీ

061. ఫిజియోథెరపీ

062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ

063. రిహ్యాబిలిటేషన్ థెరపీ

064. సోషల్ వర్క్

065. స్పెషల్ ఎడ్యుకేటర్

066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్

067. లా

068. అడ్వర్టైజింగ్

069. జర్నలిజం

070. మాస్ కమ్యూనికేషన్

071. పబ్లిక్ రిలేషన్స్

072. ఆర్ట్ డైరెక్షన్

073. కొరియోగ్రఫీ

074. డైరెక్షన్

075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్

076. ఫైన్ ఆర్ట్స్

077. పర్ఫామింగ్ ఆర్ట్స్

078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్

079. యానిమేషన్

080. సినిమాటోగ్రఫీ

081. కమ్యూనికేషన్ డిజైన్

082. డిజైన్

083. గ్రాఫిక్ డిజైనింగ్

084. ఫోటోగ్రఫీ

85. యాక్చురియల్ సైన్సెస్

086. బ్యాంక్ మేనేజ్‌మెంట్

087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

088. బిజినెస్ మేనేజ్‌మెంట్

089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్

090. చార్టర్డ్ అకౌంటెన్సీ

091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్

092. ఈవెంట్ మేనేజ్‌మెంట్

093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్

094. హోటల్ మేనేజ్‌మెంట్

095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్

096. ఇన్స్యూరెన్స్

097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్

098. మేనేజ్‌మెంట్

099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్

101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్

102. డిటెక్టీవ్

103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్

104. ఫారిన్ లాంగ్వేజెస్

105. హోమ్ సైన్స్

106. ఇంటీరియర్ డిజైనింగ్

107. లిబరల్ స్టడీస్

108. లైబ్రరీ సైన్సెస్

109. మాంటెస్సరీ టీచింగ్

110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్

111. ఫిజికల్ ఎడ్యుకేషన్

112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్

113. టూరిజం అండ్ ట్రావెల్.


విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌ లెట్‌ లో సీ.బీ.ఎస్.ఈ(CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.


ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.


అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సలు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.