16, జులై 2023, ఆదివారం

Janpriya


 

Swamiji


 

భగవద్గీత, బొగ్గులబస్తా

 భగవద్గీత,  బొగ్గులబస్తా 


          తాతయ్య పొద్దున్నే లేచి భగవద్గీత చదువుతుండేవాడు. అది భగవద్గీత అని చాలా రోజులకుగానీ మనవడికి తెలియలేదు. అయితే ఎన్నిసార్లు విన్నా ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. ఆ సంగతి తెలిసి తాతయ్య చెప్పాడు. 'ఇదిగో ఈ ఖాళీ బొగ్గుల బస్తా తీసుకు వెళ్లి  మన ఇంటి దగ్గర వాగులో నుంచి ఓ  బస్తాడు నీళ్ళు పట్రా'

మనమడు వెళ్ళాడు. బస్తాను నీళ్ళల్లో ముంచి తీసాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా  మొత్తం నీళ్ళు  కారిపోయాయి. మనుమడు మళ్ళీ ముంచి తీసాడు. మళ్ళీ తీసాడు. ఎన్ని సార్లు ముంచి తీసినా చారెడు నీళ్ళు కూడా బస్తాలో మిగిలేవి కావు. ఇలా కాదనుకుని ఈసారి బస్తాను  నీటిలో ముంచి క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరేసరికల్లా మళ్ళీ బస్తా ఖాళీ. 'తాతయ్యకు కావాల్సింది నీళ్ళే  అయినప్పుడు బస్తా ఎందుకు బకెట్టు తీసుకువెడితే సరి' అని అది చేత్తో పట్టుకున్నాడు. తాతయ్య ససేమిరా వల్లకదన్నాడు. బస్తాతోటే నీళ్ళు తెమ్మన్నాడు. మనుమడి మళ్ళీ వాగు దగ్గరికి  వెళ్ళాడు. బస్తాను నీటిలో ముంచి తీసి మెరుపు వేగంతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయాసమే మిగిలింది కాని బస్తాలో చేరెడు నీళ్ళు కూడా లేవు. అన్నీ దోవలోనే కారి పోయాయి. 'ఏమిటి తాతయ్యా ఇదంతా' అని అడిగాడు. తాతయ్య మందహాసం చేసాడు.

'ఒకసారి ఆ బస్తా వంక  చూడు మనవడా' అన్నాడు. మనుమడు చూసాడు. నల్లటి బొగ్గుల బస్తా కాస్తా  ఇప్పుడు మసంతా కొట్టుకు పోయి శుభ్రంగా వుంది.

తాతయ్య చెప్పాడు. 'చూసావా. నాలుగు సార్లు నీళ్ళల్లో ముంచితేనే బస్తాకు పట్టుకున్న  బొగ్గుమసి కొట్టుకు పోయింది. నీళ్ళల్లోముంచి తీస్తుంటే మసి పోతుందని కూడా తెలవకుండా నువ్వు ఇదంతా చేసావు. భగవద్గీత  కూడా అంతే! అర్ధం అయిందా లేదా అనికాదు. చదువుతూ పోతుంటే అది మన మనసుల్లోని కల్మషాన్ని తొలగిస్తుంది. అంతే అంటూ మనవడికి తెలియజేసాడు.

దక్షిణాయణ పుణ్యకాలం.

 మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయణం అంతా ఉపాసనా కాలం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండే కాలం అంతా కూడా చాలా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది. నైమిత్తిక తిథుల యందు చేసినటువంటి కర్మాచరణం వలన కలిగిన ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిగా చెప్పబడే కైవల్యము/మోక్షమునకు కారణం అవుతుంది. విహిత కర్మాచరణం చేయడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ విశేషమైన సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయణ పుణ్యకాలం.

సూర్య పహాడ్ ( సూర్యపహార్)

 🕉 మన గుడి : 






⚜ అస్సాం : సూర్య పహాడ్ ( సూర్యపహార్)


⚜ శ్రీ సూర్యదేవాలయం


💠 ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా 99,999శివలింగాలు.

శ్రీ_సూర్య_పహార్ (సూర్య భగవానుని పవిత్ర కొండ) 

ఇది భారతదేశంలోని అస్సాంలో ఒక ముఖ్యమైన కానీ సాపేక్షంగా తెలియని పురావస్తు ప్రదేశం . 


💠 శ్రీ సూర్య పహార్ యొక్క మరొక ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది ఒకప్పుడు మూడు మతాల సంగమం.

హిందూ మతం, బౌద్ధమతం మరియు జైన మతాలకు చెందిన అసంఖ్యాక శిల్పాలు మరియు ఇతర అవశేషాల నుండి స్పష్టంగా తెలుస్తుంది .


💠 ఇచ్చట ఉన్న కొండపైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఉన్నది. 

కాళికా పురాణంలో ఈ కొండ ప్రసక్తి, ఈ సూర్య దేవాలయం సూర్యుని స్థిర నివాసంగా వర్ణించబడినది. 


💠 ఇక్కడ గుండ్రని శిలా ఫలకం మిద ద్వాదాశాదిత్యుల మూర్తులు ఉన్నాయి. 

వాటి మధ్యన కశ్యప ప్రజాపతి మూర్తి మలచబడి ఉన్నది. 

ఈ పర్వతం పై మానసాదేవి ఆలయం కుడా ఉన్నది. ఈ ఆలయంలో మానసాదేవి తన 12 హస్తాలతో ఆయుధాలను ధరించి, తామర పద్మముపై నిల్చున్న భంగిమలో అమ్మవారు దర్శనమిస్తారు. తలపై ఏడు శిరస్సులు కలిగిన నాగ పడగను కల్గి భక్తులకు దర్శనమిస్తుంది.


💠 సూర్య పహార్ వద్ద శిథిలాలు

'శ్రీ సూర్య పహార్' పేరు సూర్యుని (సూర్య) ఆరాధనతో ఈ ప్రదేశం ముడిపడి ఉండవచ్చని సూచిస్తుంది


💠 గమనించదగ్గ విషయం ఏమిటంటే, స్థానిక ప్రజలు పూజించే అనేక లింగాలు నిజానికి బౌద్ధ స్థూపాలు అని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు. చాలా స్పష్టంగా లేని కొన్ని ఇతర విగ్రహాలు జైన తీర్థంకరుల ప్రసిద్ధ శిల్పాలతో అద్భుతమైన పోలికను కలిగి ఉన్నాయి. 

కాబట్టి, మొత్తంమీద, హిందువులు, బౌద్ధులు మరియు జైనులు దీనిని ఒక ముఖ్యమైన ప్రదేశంగా భావిస్తారు, అయితే దీని చరిత్ర గురించి ఎవరికీ స్పష్టంగా తెలియదు. 

దీని పురాతనత్వం గురించి ఎటువంటి సందేహం లేదు మరియు ఇది మనకు తెలియని యుగానికి చెందిన పురాతన పురావస్తు ప్రదేశం కావచ్చు. 


💠 అస్సాంలో కూడా చాలా మంది దీని గురించి విని ఉండరు కానీ వాస్తవానికి ఇది అస్సాంలో అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశం.

ఇక్కడి త్రవ్వకాల్లో ఒకదానిలో కొంతవరకు సూర్యుడిలా కనిపించే ఒక కళాఖండం లభించింది. 

అసలు కళాఖండాన్ని ఇప్పుడు సమీపంలో ఉన్న మ్యూజియం లోపలికి తరలించారు, కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిరూపాన్ని ఉంచారు


💠 అస్సాం రాష్ట్రములోని గోల్పారా జిల్లా కేంద్రము నుండి 12 కి.మీ. దూరంలో సూర్య పహాడ్ అనే క్షేత్రము ఉన్నది.

ఈ క్షేత్రానికి ‘గౌహతి’ నుండి బస్సు సౌకర్యము కలదు. గౌహతికి వాయువ్యంగా 132 కిమీ దూరంలో ఉంది.

 



ॐ ప్రదోష సమయాన మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని ఆలయానికి పక్షులు ప్రదక్షిణలు చేస్తాయి. 

    ఈ ప్రదక్షిణ నిర్ణీత పద్ధతిలో జరుగుతుంది. దీనిలో పక్షుల సమూహం మూడు ముందుకు మరియు నాల్గవది రివర్స్ కక్ష్యలను చేస్తుంది. 

    ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూడవచ్చు. 🙏🏻

నలుగురు భార్యలు

 ....... మన నలుగురు భార్యలు.......            మనందరికీ నలుగురు భార్యలు వున్నారు.            మన 4 వ భార్య మన శరీరం..దాన్ని ఎంత ప్రేమించినా అది వెంటరాదు. మన 3 వ భార్య  మన ఆస్తిపాస్తులు,ధనం,స్టేటస్ లు.మనం మరణించాక అవి ఇతరులను ఆశ్రయిస్తాయి.. ఇక 2 వ భార్య  మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు..వారు కేవలం స్మశానం లో మన శవం కాలేదాకానే మనతో  ఉంటారు.. ఆఖరుగా మన ఆత్మే  మన మొదటి భార్య..శరీర పోషణ, ఐశ్వర్యం,కీర్తి,పదవి  లాంటి వాటిని సంపాదించడం,బంధు మిత్రులతో కులాసాగా  కాలక్షేపం చేయడం లాంటి  వాటిలో పడి మనం మన ఆత్మను పట్టించుకోకుండా జీవించేస్తున్నాము..   అయినప్పటికీ మనల్ని మరణానంతరం కూడా అనుసరిస్తుంది ఆత్మ..దాని ఉన్నతి కోసం బ్రతికి ఉండగా చేయాల్సింది చేయడం ప్రతి మనిషి విద్యుక్త ధర్మం.....

అల్లసాని పెద్దన

 💠💠💠💠💠💠💠💠💠💠💠

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక  ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన స్వారోచిష మనుసంభవము లేదా మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు బళ్లారి కడప జిల్లాల ప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామంలో శాలివాహన శకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థాన పండితులు ఎనిమిది మందిలో ఈయన ఒక్కరు. ఈయన గురువు శఠగోపయతి.


అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. కడప జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.


మను చరిత్ర:


మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 


ఇతివృత్తము:


మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.


రచనా వైభవం

మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే.


పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం.


రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు.


అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు.


కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట.



 మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము.


 అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.


విశేషాలు

ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.


మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్


భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు

 అటన్+చని = అక్కడికి వెళ్ళి

 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న 

 శిరస్ = శిఖరాల నుండి

 సరత్ = జారుతున్న

 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో

 ముహుః + ముహుః = మాటి మాటికి

 లుఠత్ = దొర్లుతున్న

 అభంగ = ఎడతెగని

 తరంగ = అలలు అనే

 మృదంగ = మద్దెలల యొక్క

 నిస్వన = ధ్వనుల చేత

 స్ఫుట = స్పష్టమైన

 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా

 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన

 కలాప = పురులుగల

 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని

 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే

 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత

 కంపిత = కదిలించబడిన

 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని

 శీతశైలమున్ = మంచుకొండను

 కాంచెన్ = చూశాడు


మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి. ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.


ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె) తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.


కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల" 

మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు కనబడుతుంది.


మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల మోత వినిపించాడు కవి.

 "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు) వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన 

 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.


"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి, సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత భ్రాంతిమదలంకారం అవుతుంది.


 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.


సేకరణ

💠💠💠💠💠💠💠💠💠💠💠

 అజీర్ణే భేషజం వారి

జీర్ణే వారి బలప్రదమ్

భోజనె చామృతం వారి

భోజనాంతె విషప్రదమ్

(ఆచార్య చాణక్య)


 అజీర్ణానికి మందు,నీరు తాగడం. ఆహారం జీర్ణమయ్యాకా నీరుతాగితే బలంకలిగిస్తుంది. భోజనం తో పాటుగా నీరు అమృత సమానం. భోజనానంతరం తాగే నీరు విషంతో సమానం.


 నీరు ఎప్పుడెప్పుడు తాగితే ఏమి ఫలితం అన్నది ఒక చోటికి చేర్చారనుకుంటాను.


వృద్ధకాలే మృతా భార్యా

బంధుహస్త గతం ధనం

భోజనం చ పరాధీనమ్

తిస్రః పుంసాం విడమ్బనాః

(ఆచార్య చాణక్య)


పెద్దవయసులో భార్యగతించడం,తన డబ్బు బంధువుల చేత చిక్కడం, భోజనానికి ఇతరులపై అధారపడటం అనే మూడు అనుభవించేవాడు దురదృష్టవంతుడు.


సూర్యదేవాలయం_ఉరవకొండ

 సూర్యదేవాలయం_ఉరవకొండ


ఉరవకొండ మండలంలో అరుదైన సూర్య దేవాలయం

    -చోళుల కాలంలో 800 ఏళ్ల క్రితం నిర్మితం అయినట్లు చెబుతున్న చరిత్ర కారులు.


-సప్త అశ్వాలతో సూర్య భగవానుడి ఏక శిలా విగ్రహం


-శివకేశవులుతో కలసిఉన్న ఏకైక దేవలయం


"అన్ని దేవాలయాలలో కన్నా సూర్యభగవానుని దేవాలయాలు చాలా అరుదైనదని చెప్పాలి. అయితే అనంతపురం జిల్లాలో సూర్యభగవానుని దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బూదగవి సూర్యదేవాలయం.అయితే ఉరవకొండ మండలంలోనే మరో సూర్య దేవాలయానికి కూడా ఎంతో చరిత్ర వుంది. అదే ఆమిద్యాల గ్రామంలోని పురాతన శ్రీసూర్యదేవాలయం. ఈఅరుదైన ఆలయం గూర్చి విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం."


అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో ఉన్న చారిత్రాత్మకత, పురాతన చరిత్ర కల్గిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కల్గిన పురాతన దేవాలయాలు ఒకే చోట నెలవై ఉన్నాయి. అందులో సప్త అశ్వవాహనంపై కొలువైన అరుదైన శ్రీసూర్యదేవాలయం ఇక్కడే ఉండడం విశేషంగా చెప్పవచ్చు.ఇదే ఆలయంలో వైష్ణవ, శైవ దేవాలయాలుండడం మరో అరుదైన విషయం


ఆలయ చరిత్ర..

శిలాససనాలు ఉన్నప్పటికీ వాటిని తర్జుమా చేసేవారు లేకపోవడంతో గ్రామస్తులు, అర్చకులు తెలిసిన వివరాల ప్రకారం క్రీ.శ 1200-1300 కాలంలో చోళ రాజుల వంశానికి చెందిన రాజు ఆమిద్యాల గ్రామంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయంగా పిలవబడుతున్న ఈఆలయంలో శివ -కేశవులు విగ్రహాలతో పాటు అరుదైన శ్రీసూర్య నారాయణుడి విగ్రహం కూడా ఉంది. గతంలో ఈ దేవాలయం ఎంతో ఆదరణ పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆలన పాలన లేక అవి శిథిలావస్థకు చేరింది. అయితే గ్రామస్తుల ఉమ్మడి కృషి ఫలితంగా 2017 నుండి తిరిగి అన్ని పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మరింత అభివృద్ధి చేయాలని తలంపుతో గ్రామ పెద్దలు కమిటిగా ఏర్పడి కృషి చేస్తున్నారు.


పశ్చిమాభి ముఖంగా సూర్య భగవానుడు


ఏక్కడైన సూర్య భగవానుడు తూర్పు అభిముఖంగా కొలువు దీరి వుంటారు.మన దేశంలో కోణార్క్ కానీ,మన రాష్ట్రంలో అరసవెల్లి లో కానీ అలాగే కొలువు దీరాడు. కానీ ఆమిద్యాల గ్రామంలో సూర్య నారాయణుడు పచ్ఛిమ దిశగా కొలువై ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పచ్చిమాభి ముఖంగా ఉన్న సూర్య భగవానుడి ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతున్నారు.


ఆరోగ్య ప్రదాత


ఇక్కడి సూర్య భగవానుడిని దర్శించుకుంటే ఎటువంటి అనారోగ్యలైన నయమవుతావని గ్రామస్తుల నమ్మకం.అంతే కాక ఉద్యోగ ప్రదాత కూడా అని అంటున్నారు.


ఎలా చేరుకోవాలి..!


ఆమిద్యాల గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం అనంతపురం నుండి 50 కిలోమీటర్లు, ఉరవకొండ పట్టణం నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.బస్సుల సౌకర్యం ఉంది.

తత్త్వం

 🌷తత్త్వం' అనే మాటకి అసలు అర్థం ఏమిటి? 'శరీర తత్త్వం', 'మనస్తత్వం', 'పరతత్త్వం' లాంటి మాటలు వింటుంటాం. వాటికి భేదాలున్నాయా? అని అడిగే వారికి ఈ పోస్ట్...


జవాబు; 'తత్త్వం యథార్ధ్యే బ్రహ్మణి' అని అర్ధాన్ని చెప్పాయి శాస్త్రాలు. ఒక వస్తువు యొక్క యథార్ధ (ఉన్నదున్నట్టు) స్వరూపాన్నీ, లేదా-పరబ్రహ్మని 'తత్త్వం' అనే మాటతో చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్టు అంటే 'స్వభావం'. కనుక 'స్వభావాన్ని కూడా తత్త్వం అనవచ్చు. శరీర స్వభావం - 'శరీర తత్త్వం'. మనస్స్వభావం 'మనస్తత్త్వం'.


ఆయుర్వేద ప్రకారం- వాతపిత్త కఫాలు శరీరతత్త్వాలు. సత్త్వరజస్తమోగుణాలు మనస్తత్వాలు. ఈ రెంటికీ అతీతమై, అన్నిటా చైతన్యంగా ఉన్న పరమాత్మయే 'పరతత్త్వం'., ఇదే 'బ్రహ్మణి' (పర బ్రహ్మగా) అని చెప్పబడినది.

యెకాక్షరి నిఘంటువు

 https://drive.google.com/file/d/1BLSWaE_T_V1H_farI8iEFMyUiUlx-xiF/view?usp=drivesdk

బాధించబడుతూనే ఉన్నాడు.

 .


                     _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ద్విషద్భిః శత్రుభిః కశ్చిత్* 

*కదాచిత్ పీడ్యతే న వా।*

*ఇన్ద్రియైర్బాధ్యతే సర్వః* 

*సర్వత్ర చ సదైవ చ॥*



తా|| 

"ద్వేషపూరితుడైన శత్రువుచేత ఎవడైనా ఎప్పుడైనా బాధించబడవచ్చు. బాధించబడకపోవచ్చు. కానీ ఇంద్రియములచేత ప్రతి ఒక్కడు అన్నిచోట్లా అన్నివేళలా బాధించబడుతూనే ఉన్నాడు.

షోడచోపచార పూజ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

   *🌷షోడచోపచార పూజ🌷* భగవంతుడిని ఒక అతిధిగా భావించి పదహారు రకాలుగా సేవలు చేయటాన్ని షోడశోపచార పూజ అంటారు.  ఎప్పుడైతే భగవంతుని నిశ్చల భక్తితో ఆరాధిస్తాడో అప్పుడు భక్తుడు భగవద్ కైంకర్యంలో నిమగ్నుడైతాడు. కండ్లతో విగ్రహాన్ని చూస్తాడు.  అక్కడ వెలిగించి సుగంధ పరిమళ ఊదుబత్తుల సుగంధాన్ని ఆస్వాదిస్తాడు, స్వామికి అర్పించిన రంగు రంగుల పుష్పాల అలంకరణతో తాదాప్యం చెందుతాడు. మనస్సు తానూ చేస్తున్న అర్చన మీద ఉంచుతాడు, చెవులు మంత్రాలపై, దృష్టి స్వామిపై, చేతులు అర్చనపై వుంచు పూర్తిగా తాన పంచేంద్రియాలతో  భగవంతుడికి స్వాధీనుడు అవుతాడు. తన్ములంగా మనస్సుని భగవంతునిపై ఏకాగ్రత చేయగలుగుతాడు.  కానీ నిజానికి విగ్రహారాధనే అంతిమ గమ్యం కాదు. నిర్గుణోపాసనే కైవల్య ప్రధం అని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన ఎందుకు చేయాలో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. బాల్యంలో గురువుగారు విద్యార్థికి గణితం బోధించటానికి చేతి వేళ్ళని గణించమని చెపుతారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. వ్రేళ్ళని గణించటంతో చిన్న పిల్లవాడు కూడికలు, తీసివేతలు నేర్చుకుంటాడు.  మరి వాడు పెద్దయిన తరువాత వాడికి చేతి వేళ్ళు లెక్కించటం అవసరమా కాదు. కానీ బాల్యంలో చేతిమీద లెక్కలు నేర్చుకోటంతోనే నేడు గణితం అర్ధం చేసుకో గలుగుతున్నారు.  అదే విధంగా విగ్రహారాధన కుడా.  ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం వున్నది.   


ఇంతమంది దేముళ్ళు ఎందుకు.  విగ్రహారాధన ఎందుకో తెలుసుకున్నాము. మరి ఇంతమంది దేముళ్ళు అవసరమా అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మొదలవుతుంది. మన ఋషులు వారి మేధా శక్తితో మనకు అందించిన సంప్రదాయమే నేడు మనం ఆచరించే ఆచారాలు, ఆరాధనలు, పండుగలు మొదలైనవి. ఇంత మంది దేముళ్ళు ఎందుకు అవసరమో  ఒక చిన్న ఉదాహరణతో గమనిద్దాము. నీకు ఒక కలెక్టర్ ఆఫీసులో పని వుంది అనుకుందాము.  మనకు తెలిసి కలెక్టర్ గారే ఆ ఆఫీసుకి ముక్క్యులు.  నీకు కావలసిన పని కేవలము ఒక చిన్న సమాచారం అనుకుందాము.  అది ఫలనా రికార్డులో ఫలానా పేరు వున్నదో లేదో తెలుసు కోవాలి.  నీవు ఏమి చేస్తావు.  నేరుగా ఆ శాఖకు సంబందించిన గుమస్తా దగ్గరకి వెళ్లి సదరు విషయం తెలుసుకుంటావు.  కానీ నీకు కలెక్టర్ గారితో ఎలాంటి పని లేదు.  నీవు కలెక్టర్ గారిని కాలవ వలసిన అవసరంకూడా లేదు.  నీ పని అయిపోతుంది.  అదే మాదిరిగా నీకు ఏ శాఖకు చెందిన పని ఉంటే ఆ శాఖకు చెందిన గుమస్తా లేక శాఖా అధికారిని కలుసుకొని నీ పని చేసుకొంటావు.  అదే విధంగా కేవలం కలెక్టర్ గారితోనే అయ్యే పని అయితే అప్పుడు కానీ కలెక్టర్ గారిని కలవవు.  అదే మాదిరిగా మనకు దేముడికి సంబందించిన శాఖలు ఏర్పాటు చేసారు.  అవి ధనానికోసం లక్ష్మి దేవి, చదువుకి సరస్వతి దీవి. ధుర్యానికి దుర్గా దేవి.  అలానే విజ్ఞలను తొలగించటానికి గణపతిని.  ఈ విధంగా మనకు వేరు వేరు కోరికలను తీర్చటానికి వేరువేరు దేవతలు వున్నారు.  అదే నీకు కైవల్యం కావాలంటే ఆ పరబ్రహ్మయే శరణ్యం. 


పూజించేటప్పుడు శుచిగా ఉండటం  ఎందుకు.  : పూజ అనేది మానసిక ప్రక్రియ అంటే మనస్సుతో మాత్రమే మనం దేవి దేవతలను ఆరాధిస్తాము.  అలా ఆరాధించాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి.  ఎప్పుడైతే శరీరం పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు మనస్సుకూడ పరిశుభ్రంగా ఉంటుంది.  కాబట్టి పూజించే వారు విధిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలని ధరించి పూజకు కూర్చోవాలి. హిండవ సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన అనేది 16 ఉపచారాలతో ఉంటుంది.  అందుకే షోడచోపచార పూజ అంటారు. 16 రకాలుగా దేవతారాధన చేయటం అని అర్ధం.  పూజ చేసేటప్పుడు చేతులు పుష్పాలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో వినియోగించి అర్చిస్తుంటే, కళ్ళు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని (రూపాన్ని) చూస్తూవుంటే చెవులు మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనస్సు అన్ని విధాల ఆ దివ్య మంగళ మూర్తిని స్మరిస్తూ ఉంటుంది.  అంటే పూజ చేసే భక్తుడు తన పంచేంద్రియాలను దేముడి మీదనే లగ్నాత చేసి అర్చిస్తాడు.  తద్వార త్రికరణ శుద్ధి సాధిస్తాడు.  ఈ రకమైన ఆరాధన ఏ ఇతర మతాలలో మనం చూడలేం.  


హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది, ప్రశస్తమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి. మోక్షమార్గాన్నిచూపెట్టిన ఏకైక దర్మం హిందూ ధర్మం. దేముడిని సహేతువుగా చెప్పింది హిదూత్వం. దేముడు ఒక నమ్మకం కాదు ఒక నిజం.


ఓం శాంతి శాంతి శాంతిః

దాచబడిన చరిత్ర*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*మన నుంచి దాచబడిన చరిత్ర* 

                   🌷🌷🌷


గురుకుల్ ఘోరండాకు చెందిన ఆచార్య ఒకరు జనసంఘ (పూర్వ బిజెపి) టికెట్‌పై ఎంపీ అయ్యాడు, అతను ప్రభుత్వ వసతి తీసుకోలేదు..  

ఢీల్లీ-6 మార్కెట్‌లోని సీతారామ్‌కు చెందిన ఆర్య సమాజ్ మందిరంలో నివసించారు.  అక్కడ నుండి పార్లమెంటుకు నడచి వెళ్ళేవారు. తన జీతం మొత్తాన్ని రక్షణ శాఖకు విరాళంగా ఇచ్చారు..


ఇప్రతి ప్రశ్న  జవాబు చెప్పడానికి ముందు పార్లమెంటులో  వేదమంత్రాన్ని పఠించే మొదటి ఎంపీ ఆయనే మాత్రమే.  

ఆ వేదమంత్రాలన్నీ పార్లమెంటు కార్యకలాపాల రికార్డులో నేటికీ చూడవచ్చు.  గోవు వధను ఆపాలని ఆయన ఒకసారి పార్లమెంటుకు ఘెరావ్ చేశారు..


ఒకసారి ఇందిరా గాంధీ ఆ స్వామిజిని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు ఒక సమావేశానికి పిలిచారు.  అక్కడ భోజనం ప్రారంభించినప్పుడు, అందరూ బఫే కౌంటర్ వైపు నడవడం ప్రారంభించారు. స్వామి అక్కడికి వెళ్ళలేదు. అతను తన జేబులో నుండి రెండు  ఎండు రోటీలను తీసి బఫే కౌంటర్ నుండి నేలమీద కూర్చోవడం ప్రారంభించాడు..

ఇందిరా జి - "మీరు ఏమి చేస్తున్నారు  మీకు ఇక్కడ ఆహారం లేదా? ఈ ఫైవ్ స్టార్ ఏర్పాట్లన్నీ   ఎంపీల కోసం మాత్రమే చేయబడ్డాయి. మీరు ఇవి సేవించ కుండా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారు.."

దానికి అతను ఇలా అన్నాడు "నేను సన్యాసిని, ఎవరో ఈ రోటీలను ఉదయం భిక్షలో ఇచ్చారు. ప్రభుత్వ డబ్బుతో రొట్టె ఎలా తినగలను.."

ఇందిరాకు కృతజ్ఞతలు తెలుపుతూ, హోటల్‌  నుండి ఒక గ్లాసు నీరు మరియు మామిడి ఊరగాయ ముక్కను తీసుకున్నాడు. ఇందిరా జి నిరాకరించినప్పటికీ తాను తీసుకున్న వాటికి కూడా డబ్బు కూడా చెల్లించాడు..!


ఈ గొప్ప పార్లమెంటు సభ్యుడు మరియు సన్యాసి ఎవరో  మీకు తెలుసా?

సన్యాసి స్వామి రామేశ్వరానంద్ జీ.  హార్డ్కోర్ ఆర్య సమాజ్.  గోవు అంటే ప్రాణం గోప్ప గోమాత  భక్తుడు..


స్వామీజీ హర్యానాలోని కర్నాల్ నుండి ఎంపి గా ఎన్నికయ్యారు..

ఇలాంటి గొప్ప వాళ్ళు  భారతదేశంలో చాలా మందే ఉన్నారు, కాని మేము నెహ్రూ-గాంధీ తప్ప ఇలాంటి వారి గురించి చదవలేకపోయాము.  బహుశా మాకు ఎవరు కూడా బోధించబడలేదు..

మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే, అలాంటి వ్యక్తిత్వా లను కూడా మీరు తెలుసుకోవాలి.

ఇలాంటి యోగులు, మునులు నడిచిన దేశం నాది..

గొప్ప బిడ్డలను కన్నది నా తల్లి భారత మాత....

చిట్టికథ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

...నేటి చిట్టికథ


----మహాభారతం నుండి...


ధర్మరాజు చేసే అశ్వమేధయాగం లోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు 

శ్రీ కృష్ణుని పరమ భక్తుడు.


 యాగాశ్వం విడిపించుటకై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీ కృష్ణార్జునులు. శ్రీ కృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. “ఈతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా” అని అడిగిన అర్జునునితో శ్రీ కృష్ణుడు “ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. ఈతని ధర్మబుద్ధి నీకెఱిగించెద” అని అన్నాడు.


మఱునాడు శ్రీ కృష్ణార్జునులు విప్రవేషం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. 

అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మాఱువేషంలో ఉన్న పరంధాముడిలా అన్నాడు “రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తరువాతే మేము ఇతరములు ఆలోచిస్తాము”. “అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను” అని మయూరధ్వజుడు వేడినాడు. 


“రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది “మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని శౌరి బదులిచ్చాడు.


“ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. దీని కన్నా నేను కోర తగ్గది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి” అని అర్థించాడు మయూరధ్వజుడు. 


వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. 

ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకోని మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులై చూస్తున్న శ్రీ కృష్ణార్జునులకు ఓ వింత కనబడింది.


మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్ళు కారుతున్నాయి. సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు “రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషముగా మనస్ఫూర్తిగా చాస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”.


“అయ్యా! నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం నివియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ” అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు.


 ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు.


 మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు.


మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషముగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు.

సేకరణ:- అయితు రాజేశ్వరి గారి   వాట్సాప్ పోస్ట్.

ముందు జాగ్రత్త


ముందు జాగ్రత్త

సమజంలో మనం రోజు ముందు జాగ్రత్త పరులను అనేకులను చూస్తూ ఉంటాంనిజానికి నీవు నేను కూడా ముందు జాగ్రత్త పరులమే అవునా కాదాఒక విద్యార్థి సెలవుల తర్వాత పాఠశాల/కళాశాల తెరవగానే పరీక్షలకు చదవడం మొదలు పెడతారు ఎందుకు అంటే ఇప్పటినుంచి చదివితే కానీ నేను పూర్తి సిలబస్ సంపూర్ణంగా చదివి అర్ధం చేసుకోగలను. మొత్తం పాఠాలు నాకు క్షుణ్ణంగా వచ్చి ఉంటే ప్రశ్న పరీక్ష లో అడిగిన నేను సమాధానం చేయగలను అంటారు

ఒక గృహస్తు పంట రాగానే కొత్త బియ్యాన్ని ఒక యేటికి సరిపడా ఎక్కువ మొత్తంలో అంటే రెండు లేక మూడు క్వింటాళ్ల బియ్యం, ఒక 50 కిలోల కందిపప్పు  కొనుక్కొని ఉంటారు ఎందుకయ్యా ఇలా కొన్నావు అంటే ఏం చేద్దాం సమయం ఎలావుంటుందో ఇంట్లో బియ్యం పప్పు ఉంటే చాలు ఏమున్నా లేకున్నా రోజులు గడిపేయవచ్చు అంటాడునీకు తెలుసా మొన్న కరోనా సమయంలో నా అలవాటే నన్ను కాపాడింది ఇంట్లో నుంచి కాలు బైట పెట్టకుండా మొత్తం కరోనా కష్టకాలాన్ని అవలీలగా ఎదుర్కున్నాను అని అంటాడు మాట అన్నప్పుడు అతని ముఖంలో ఆత్మవిస్వాసం స్పష్టంగా గోచరిస్తుంది

ఒక వ్యవసాయదారుడు ఇంకా వర్షాకాలం రాకముందే భూమి దున్నుకొని పంట గింజలు నాటడానికి సిద్ధం చేసుకుంటారుఎందుకయ్యా ఇలా చేసావు అంటే వర్షం పడినప్పుడు దున్నడం అంటే కుదరని పని అదే ముందు భూమి దున్నుకొని ఉంచుకుంటే వర్షం పడగానే గింజలు చల్లవచ్చు అని అంటారు.

వేసవిలో కరెంట్ కోత ప్రతి వారు అనుభవించేదే అదే ముందు జాగ్రత్త పరుడు ఒక ఇన్వర్టర్ కొనుక్కొని వుంచుకుంటారు ఎందుకు అయ్యా ఇప్పుడు కరెంటు పోవడం లేదు అని అంటే ఎవరికి తెలుసు రేపు వేసవిలో కరెంట్ పోదని ముందుగా  ఇన్వర్టర్ కొనుక్కొని ఉంటే రేపు కరెంటు పోతే అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అని అంటారు

తన కూతురు ఎదుగుతుంటే ఒక తల్లిదండ్రులు ముందు పెండ్లికి కావలసిన ద్రవ్యన్ని   సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మంచి వరుడి కోసం అందరికీ చెప్పి ప్రయత్నం మొదలుపెడతారు. ఎందుకు అంటే ముందు ఒక మంచి సంబంధం చూసుకొని ఉంటే తమ కుమార్తె జీవితం సుఖమయంగా సాగుతుందని చెపుతారు

 

రేపు ఏదైనా ఉరుకు ప్రయాణం అయి పోవాలంటే ముందుగా రైలు లేక బస్సు టికెట్ రిజర్వ్ చేసుకొని ఒక రోజు ముందు తను తీసుకుని పోవలసిన సామాన్లన్నీ ఒక బ్యాగ్ లో, సూట్కేసులో సర్దుకొని సిద్ధంగా ఉంటారు. రైలు తెల్లవారుజామున 6 గంటలకు అయితే 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక అరగంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్లి ఉంటారు. ఇదంతా ముందు జాగ్రత్త కదా.  

 ఇలా  వ్రాసుకుంటూ పోతే అనేకానేక విషయాలు మనకు నిత్యజీవితంలో బోధపడుతూవుంటాయి. నిజానికి ముందు జాగ్రత్త అనేది ఒక సమర్థవంతమైన మనిషి చేయాల్సిన పనే అదే ముందు జాగ్రత్త లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఒక విజయవంతమైన జీవితం గడుపుతున్న వాడు తన జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుతూ ముందు జాగ్రత్తలతో వుండి అనేక విజయాలను పొందగలుగుతారు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి మనిషి ముందు జాగ్రత్త కలిగి ఉండాలి అని. పరిస్థితి రకంగా వస్తుందో ముందుగా ఊహించి తదనుగుణంగా ముందు జాగ్రత్త పడటం అవసరం.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే మానవుడు ఒక్క విషయం తెలిసి కూడా జాగ్రత్త పడడు ఎందుకోగానీ విషయం మీద ఎంతో అజాగ్రత్తగా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఏమిటి విషయం, ఏమిటి అజాగ్రత్త అంటే ఇంకా ఏమిటండి ప్రతి మనిషి ఆఖరు గమ్యం అంటే అర్థం కాలేదా అదే మరణంప్రతి మనిషి తన జీవిత అంతిమ ప్రయాణం మరణం అని తెలుసు అయినా దానికి సంబంధించిన ముందు జాగ్రత్త మాత్రం పడడు .  తాత్కాలికంగా ఒకరోజు లేక్ ఒక వారమో వెళ్లే ప్రయాణికులు వారం రోజులనుండి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ శాశ్వితమైన  ప్రయాణానికి మాత్రం ఏమాత్రం ముందు జాగ్రత్త పడకుండా పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ వుంటారు.

 

సాధక మిత్రమా భగవంతుడు మనకు ఇచ్చిన అపూర్వ అవకాశమే రోజు మనం పొందిన ఈ మానవ జన్మ జన్మను మనం సార్ధకం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయకపోతే మరల మనకు మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో ఏదైనా ఒక జీవిగా మళ్ళీ పుట్ట వచ్చు  జన్మలన్ని అజ్ఞాన జీవనాన్ని గడిపేవి మాత్రమే. బుద్ధి జీవి గా వున్న మానవ జన్మ ఒక్కటే నీకు మోక్షసాధనకు పనికి వచ్చే జన్మ జన్మను మనం వృధా చేసుకుంటే మోక్ష సిద్ది పొందటం దుర్లభం.

తెలివయిన వారు ఎప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటాడునీవు కూడా తెలివైన వాడిగా ప్రవర్తించు మానవ జన్మ ఉండగా జన్మ లక్ష్యం అయిన మోక్షాన్ని పొందుఇప్పటినుండి ప్రారంభిస్తే తప్పకుండా మనకు మోక్ష సిద్ధి కలుగుతుందిఅధవా కలగక పోయిన దైవానుగ్రహం వలన మరల మానవుడిగా నయినా జన్మించవచ్చు. కృష్ణ భగవానులు గీతలో స్పష్టంగా చెప్పారు యోగ భ్రష్టుడు తిరిగి తర్వాత జన్మలో తానూ జన్మలో ఎక్కడ సాధన నిలిపివేసారో అక్కడినుంచి మొదలుపెట్టి తన గమ్యాన్ని చేరుకుంటారని. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీ సాధనను ప్రారంభించుమోక్షాన్ని సిద్దించుకో.

ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇల్టు

మీ భార్గవ శర్మ