19, డిసెంబర్ 2020, శనివారం

మాయ

 మా అమ్మ మాయ తో కలది. మాయ కంటికి కనబడని అగ్ని తత్వం. సూక్మమైనది సత్యమైనది అనంత మైనది. దీనికి మూలమైన శక్తి రాహు కేతు తత్వం. నీడలా వుండే స్వభావం. నీడకు కూడా కదలిక వున్నది. నీడకు రూపు లేదు. అది కాంతి కనుక. కాంతి వస్తు లక్షణమే. వస్తువు ధాతు లక్షణము. ధాతువు వాసన పర మైనది. వాసన తవ్యాప్తం కలది. వ్యాప్తి అనగా చైతన్యం. చైతన్యం శరీర ధర్మం. లేనియెడల చైతన్యలక్షణమైన అగ్ని తత్వం తెలియదు. అగినికినమూలం కిరణం. కిరణ మునకు మూలం ఆత్మ ఆటమ్. మానవ నిర్మాణ క్రమం వక విచిత్రమైన లక్షణము కలది. ఏదైనా వస్తువు అన్నీ వక లాగే ఆకారము కాల్చును. కాని అన్నీ మనం సృష్టించినవాడు. సృష్టించింది మాయ లయం అగుట మానవ ధర్మం. మానవ నిర్మిత ములు లయమగుటయే వాటి ధర్మం. మాయకు శక్తిగల అమ్మ కూడా బధ్దురాలై యుండును. న అన్య పంథా వేరు మార్గం లేదు. అమృత తత్వము తప్ప వేరు మార్గము జీవమునకు లేదు. విద్య వలననే అమృతత్వం. అవిద్యగా నాశన హేతువు. అది భూమిపై మాత్రమే జీవ రూప మార్గమే తప్ప వేరు మార్గం లేదు. అమృతమస్తు. సర్వం అమృతమగుగాక. జీవుడు మృగమును తెలియుట అమృతము. దేహమును విడుచు స్వభావం తెలియుట అమృతము. దేవుడు కూడా దేహమును విడువవలెను. వేరు మార్గం లేదు.

మొగలిచెర్ల

 *స్వస్థత..సంతానం..*


"స్వామీ దత్తాత్రేయా మా ఆయనకు ఆరోగ్యం బాగు చేయి తండ్రీ..ఈ మాయదారి రోగాన్ని తగ్గించు.." అంటూ ఆ యువతి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం యొక్క ముందున్న పందిరి కింద కూర్చుని పరి పరి విధాలా వేడుకుంటున్నది..ఆమెతో పాటు ఎనిమిదేళ్ల వయసున్న ఆమె కుమారుడు బేల చూపులు చూస్తూ ప్రక్కనే కూర్చుని వున్నాడు..ఆమె భర్త ఆ ప్రక్కనే పడుకొని వున్నాడు..


ఆమె పేరు చంద్రమ్మ..భర్త పేరు మాలకొండయ్య..వాళ్ళది నెల్లూరు జిల్లా లోని సిద్దనకొండూరు గ్రామం ప్రక్కనే ఉన్న చిన్న పల్లెటూరు పరికోట..వాళ్లకు పెళ్లి జరిగి అప్పటికి సుమారు పది సంవత్సరాలు..ఒక కుమారుడు కలిగాడు..వ్యవసాయాధారిత కుటుంబం..అయినా లక్షణంగానే వున్నారు..అంతా బాగుంది అని సంతోషం గా ఉన్న సమయం లో మాలకొండయ్యకు హఠాత్తుగా మూర్ఛ వ్యాధి సోకింది..ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి పడిపోతున్నాడు..చంద్రమ్మ కు భయం పట్టుకుంది..ఆరోజుల్లో అంటే 1978, 79 నాటికి నెల్లూరు లో ఉన్న పెద్ద పెద్ద వైద్యులకు చూపించారు..కానీ ఫలితం దక్కలేదు..


సిద్దనకొండూరు లో ఉన్న చంద్రమ్మ బంధువులు.."నీ భర్తను తీసుకొని మొగిలిచెర్ల వెళ్ళు..అక్కడ దత్తాత్రేయ స్వామి సిద్ధిపొందిన ఆశ్రమం ఉంది..ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకో..నీ భర్త బాగుపడతాడు.." అని సలహా ఇచ్చారు..ఆ సలహా ఇవ్వటానికి కూడా ఒక కారణం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సుకు వెళ్లేముందు..ఈ సిద్దనకొండూరు గ్రామం లో కొన్నాళ్ళు వున్నారు..శ్రీ స్వామివారు సిద్ధపురుషుడని ఆ గ్రామస్థులకు ఒక నమ్మకం ఆనాడే కలిగింది..ఆ నమ్మకం తోనే వాళ్ళు చంద్రమ్మకు సలహా ఇచ్చారు..


ఆ సలహా ను నమ్మి, చంద్రమ్మ తన భర్తను, కుమారుడిని తీసుకొని మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చింది..శ్రీ స్వామివారి తల్లిగారైన సుబ్బమ్మ గారు కూడా అప్పుడు మందిరం వద్దే ఒక గదిలో నివాసం ఉండేవారు..సుబ్బమ్మ గారు కూడా చంద్రమ్మ కు ధైర్యం చెప్పారు..చంద్రమ్మకు మానసికంగా కొంత ఊరట కలిగింది..కానీ భర్త పరిస్థితి మరికొంత క్షీణించింది..


రెండురోజులు గడిచాయి..చంద్రమ్మ ప్రార్ధన ఫలితమో..మరే కారణమో తెలీదు కానీ..మాలకొండయ్య కు తరచూ వస్తున్న  మూర్చలు కొద్దిగా తగ్గాయి..మనిషి కొద్దీ కొద్దిగా కోలుకుంటున్నాడు..ఆరోజు మధ్యాహ్నం భర్తకు ఆహారం పెట్టి..చంద్రమ్మ తన కుమారుడితో సహా శ్రీ స్వామివారి మందిరం లోకి వచ్చి, ఆ పందిరి కింద పడుకుంది..వెంటనే నిద్ర పట్టింది..నిద్రలో..ఒక యోగి నడుచుకుంటూ వచ్చి.."అమ్మా..నీకు సంతాన యోగం ఉంది..పొత్తిగుడ్డలు నీ దగ్గర ఉంచుకో..నీ భర్త బాగుపడతాడు..ముగ్గురు బిడ్డల్ని కంటావు.." అని చెప్పినట్లు కల వచ్చింది..ఉలిక్కిపడి లేచిన చంద్రమ్మ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, "స్వామీ నాకు కుమారుడు వున్నాడు..ఇప్పుడు నేను నా భర్త ఆరోగ్యం గురించి వచ్చాను..నా భర్త బాగుంటే అదే పదివేలు..నాకు ఒక కుమారుడు ఉన్నాడు..మళ్లీ సంతానం కలుగక పోయినా పర్వాలేదు.." అని ప్రార్ధించింది..


మరో మూడురోజుల్లోనే మాలకొండయ్యకు మూర్చలు తగ్గిపోయాయి..వారం లోపలే మాలకొండయ్య మామూలు మనిషిగా మారిపోయాడు..చంద్రమ్మ కు పట్టరాని సంతోషం వేసింది..స్వామివారికి పరి పరి విధాల నమస్కారం చేసుకొని..భర్తనూ, కుమారుడిని తీసుకొని పరికోటకు వెళ్ళింది..సరిగ్గా మూడు నెలలకు చంద్రమ్మ గర్భవతి అయింది..ఆరోజు చంద్రమ్మ కు తనకు వచ్చిన కల గుర్తుకొచ్చి, భర్తతో వివరంగా చెప్పింది.."స్వామివారి ప్రసాదం అనుకుందాము..ఆయన దయ " అన్నాడు మాలకొండయ్య..


చంద్రమ్మ కు మొదటి కుమారుడు పుట్టిన తొమ్మిది ఏళ్లకు మళ్లీ రెండో సంతానం గా కుమారుడే పుట్టాడు..చిత్ర మేమిటంటే..ఆ తరువాత మరో కుమారుడు..మళ్లీ కుమారుడు..ఇలా ముగ్గురు కొడుకులు ఐదేళ్ల వ్యవధిలో పుట్టారు..శ్రీ స్వామివారు కలలో చెప్పిన మాట సత్యమై పోయింది..


"అయ్యా..ఆ తరువాత మా సంసారం లో ఏ ఇబ్బందులూ లేవు..నా నలుగురు కొడుకులూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ లక్షణంగా వున్నారు..ఏటా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళుతుంటాము..నా పసుపుకుంకుమలు స్వామి కాపాడి, సంతానాన్ని కూడా ఇచ్చాడు.." అంటూ నాలుగురోజుల క్రితం మందిరానికి వచ్చిన చంద్రమ్మ నాతో చెప్పుకొచ్చింది..ఆ సమయం లో ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.."స్వామిని నమ్ముకుంటే చాలయ్యా..అన్నీ ఆయనే చూసుకుంటాడు.." అన్నది..ఇప్పుడు చంద్రమ్మ కు వయసు మీద పడింది..కానీ శ్రీ స్వామివారి మీద భక్తి కొంచెం కూడ తగ్గలేదు..తాను శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..తన అనుభవాలను నాతో చెప్పుకోవడం ఒక అలవాటు..


"పొద్దస్టం స్వామి దగ్గర ఉంటావు కదయ్యా..నీకు చెప్పుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.." అంటూ వుంటుంది..స్వామి వద్దనే ఉంటున్న మాట వాస్తవమే కానీ..చంద్రమ్మకున్నంత భక్తి ప్రపత్తులు ఉన్నాయా అన్నదే ప్రశ్న..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

యుగాలు

 మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది? ఎలా ముగిసింది?


వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి  అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. కృతయుగం:

నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు.

ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.

ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది.  సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.

శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే  ఇటువంటి  అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున  త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున  సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.


2. త్రేతాయుగము:

త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.

ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.

రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము  చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు.  రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము  చేత ధనుర్ విద్యా పారంగతులు  అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.


3. ద్వాపరయుగం:

ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో  ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.

బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.

బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు. ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.

చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు  ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.


4. కలియుగము:

మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు.  సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.

ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.  ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు.  దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు.  ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే  కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.

ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు.