🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌞ఆదివారం 8 జూన్ 2025🌞*
`` *రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది…
``
*వాల్మీకి రామాయణం*
*62 వ భాగం*
*తీక్ష్ణ కామాః తు గంధర్వాః తీక్ష్ణ కోపా భుజంగమాః।*
*మృగాణాం తు భయం తీక్ష్ణం తతః తీక్ష్ణ క్షుధా వయం॥*```
గంధర్వులకి కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని నాకు ఆకలి ఎక్కువగా ఉండేది, కాని వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు. నా కొడుకైన సుపార్షుడు రోజూ వెళ్ళి ఆహారం తీసుకోచ్చేవాడు. కాని ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికీ వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడుతూ నేను ఎదురుచూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులతో నా కొడుకు వచ్చాడు, అది చూసిన నాకు కోపంవచ్చి నా కొడుకుని నిందించాను.
అప్పుడు సుపార్షుడు అన్నాడు…
'నాన్నగారూ! నా దోషంలేదు, నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను, ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను. కాని ఇంతలో ఆకాశంలో, నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు, మెడలో తెల్లటి ముత్యాల హారం వేసుకొని, తెల్లటి బట్ట కట్టుకొని వెళుతున్నాడు. మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో, అలా ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటోంది. “హా రామా, హా లక్ష్మణా” అని అరుస్తోంది. నేను వాడిని చూసి మంచి ఆహారం దొరికింది అనుకున్నాను. కాని వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి…
'మహానుభావా! నాకు దారి విడిచిపెట్టవయ్యా' అన్నాడు. ఎంతటివాడైనా అలా బతిమాలుతూ సామంతో మాట్లాడితే, ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటివాడిని దిక్కరించకూడదు కదా, అందుకని నేను వాడిని వదిలిపెట్టేశాను. కాని వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు, ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి' అదృష్టవంతుడివిరా బతికిపోయావు, వాడు దుర్మార్గుడు, వాడి పేరు రావణాసురుడు. వాడు చాలా బలవంతుడు, వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి' అని చెప్పి వెళ్ళారు.
ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల నాకు సీతమ్మ గురించి తెలిసింది. సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు.
నేను వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. 6 రోజుల తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు, నాకేమో రెక్కలు కాలిపోయాయి, అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అనుకున్నాను, కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను,నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకి నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదాము అనుకొని మెల్లగా డేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్టు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి.. 'నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వు, నీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా. నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి' అని అడిగారు.
అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను.
అప్పుడాయన అన్నారు 'సంపాతీ! బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు. ఈ సీతమ్మని అన్వేషిస్తూ వానరులు వస్తారు. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను, అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళి వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది, కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాము అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు.
నీకు ఇంకొక విషయం చెబుతాను, సీతమ్మని అపహరించిన తరువాత ఆమెని వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు, దివ్యమైన భోజనము పెడతాడు. కాని ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మెతుకు ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు ప్రతి రోజూ దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కాని సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె, పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలని విడిచిపెట్టి ఉంటె, ఊర్ధలోకములలో ఉన్నవాళ్ళకి ఈ పాయసం చెందుగాక, అని భూమి మీద పైన ఉన్న పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు' అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుండి ఇలా బతికి ఉన్నాను.
```
*తస్య తు ఏవం బ్రువాణస్య సంహతైః వానరైః సహ।*
*ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వన చారిణాం॥*```
సంపాతి ఈ మాటలను వానరాలకి చెప్పగానే కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళి పుట్టాయి.
అప్పుడాయన తన ఎర్రటి రెక్కలని అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో ఆ సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.```
*రేపు…63వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏