12, డిసెంబర్ 2023, మంగళవారం

Drones in agriculture


 

శ్రీదేవీ భాగవతము

 శ్రీదేవీ భాగవతము


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


* హరిశ్చంద్రుడి పుత్రవ్యామోహం

దైవజ్ఞా! నువ్వు మంత్రవిద్యా విశారదుడవు. మాకు సంతానం కలిగే ఉపాయం ఏదైనా

ఆలోచించు. ధర్మజ్ఞుడివి. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. నా దుఃఖం తెలిసి, కులపురోహితుడవైయుండి,

శక్తిమంతుడవైయుండి ఇలా ఉపేక్ష చెయ్యడం నీకు భావ్యమేనా ! ఈ పిచుకలు చూడు. ఎంత ధన్యమో

వాటి జీవితం ! పిల్లల్ని లాలించి ఆనందిస్తున్నాయి. మేమే మందభాగ్యులం. రేయింబవళ్ళు దిగులు

పడుతున్నాం.

కలవింకాస్త్విమే ధన్యా యే శిశుం లాలయంతి హి |

మందభాగ్యోఽహమనిశం చింతయామి దివానిశమ్ (14 - 31)

హరిశ్చంద్రుడి అభ్యర్ధనలో ధ్వనిస్తున్న నిర్వేదాన్ని అర్ధం చేసుకున్నాడు వసిష్ఠుడు. మహారాజా!

నువ్వన్నది ముమ్మాటికీ నిజం. ఈ సంసారంలో దంపతులకి పిల్లలు లేకపోవడాన్ని మించిన దుఃఖం లేదు.

దీనికి ఒక మార్గంఉంది. వరుణుడిని ఉపాసించు. అతడు సంతానదాయకుడైన దేవత. నీ కోరిక

నెరవేరుతుంది. దైవమూ పురుషకారమూ రెండూ సమానప్రతిపత్తి కలవే. ప్రయత్నం లేకుండా ఏ

కార్యమూ సిద్ధించదు. నిజానికి తత్త్వదర్శులై మానవులు గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అదే కార్యసాధకం.

మరోదారి లేదు.

దైవం పురుషకారశ్చ మాననీయావిమౌ నృభిః ॥

ఉద్యమేన వినా కార్యసిద్ధిస్సంజాయతే కరమ్

న్యాయతస్తు నరైః కార్యం ఉద్యమస్తత్త్వదర్శిభిః |

కృతే తస్మిన్ భవేత్సిద్ధి: నాన్యథా నృపసత్తమ

ఈ ఉపాయానికి హరిశ్చంద్రుడు సంతృప్తిచెందాడు. మరోసారి గురువుగారికి నమస్కరించి

తపస్సుకి వెళ్ళిపోయాడు. గంగాతీరం చేరుకుని ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో పద్మాసనం వేసుకుని

కూర్చుని వరుణుడిని ధ్యానించాడు. చాలా ఏళ్ళకు వరుణుడు కరుణించి ప్రత్యక్షమయ్యాడు. వరం

కోరుకోమన్నాడు. ఋణత్రయ విముక్తికోసం సుఖప్రదుడైన పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరాడు

హరిశ్చంద్రుడు

పోలిని స్వర్గానికి పంపే రోజు*

* పోలిని స్వర్గానికి పంపే రోజు*



*పోలి స్వర్గం కథ*

  కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ_.

_అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట_. _వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి_. _కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది_. _తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం_. _అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది_. _అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది_. _ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు_.

_కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి_. _దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి_. _చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది_. _కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది_.

_ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది_. _అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు_. _ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది_. _విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు_.

_ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు_. _ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది_. _ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంరు_.

_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.....

_ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది_. _అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... *పోలిస్వర్గం* కథ వినిపిస్తూనే ఉంటుంది_.

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

.           ప్రథమ సంపుటము

 

.             *ఉపోద్ఘాతము -2*         

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


71-106 అధ్యాయలలో శివలింగ-దుర్గా-గణశాది పూజావిధానం చెప్పబడింది. ఇక్కడ చెప్పిన వివిద మంత్రాలకు సంబంధించిన విషయాలకూ, శారదాతిలక-మంత్రమహోదధులలో విషయాలకూ చాలా పోలిక లున్నాయి. 107-116 అధ్యాయాలలో స్వాయంభువసృష్టి, భువనకోశ వర్ణనమూ, వివిధ తీర్థాలమాహాత్మ్య వర్ణనమూ ఉన్నాయి. 


118-120 అధ్యాయాలలో భారతదేశము, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల ఆయామ వైశాల్యాదులు వర్ణింపబడ్డాయి. 121-149 అధ్యాయలలో ఖగోళశాస్త్రము, జ్యోతిః శాస్త్రము (ఫలిత భాగము), సాముద్రిక శాస్త్రము మొదలైన విషయాలు ప్రతిపాదింపబడినవి. 


150-167 వివిధ వర్ణాశ్రమాదులకు సంబంధించిన ధర్మాలు, 168-174 అధ్యాయాలలో పాపాలు, వాటికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడినవి. 175-207 అధ్యాయాలలో వివిధ వ్రతాల చర్చ ఉన్నది. 208-217 అధ్యాయాలలో ఉపవాసాది వివిధ పుణ్యకార్యాల వర్ణన ఉన్నది. 


218-258 అధ్యాయాలలో రాజధర్మాలు, రాజ్యాపాలనా విధానము, శస్త్రవిద్య, వ్యవహారనిర్ణయము మొదలైన విషయాలు అతి విస్తృతంగా చెప్పబడ్డాయి. 259-271 అధ్యాయాలలో వివిధవైదిక కర్మకలాపాల చర్చ చేయబడింది. 


272వ అధ్యాయంలో పూరాణవాఙ్మయాన్ని గూర్చిన వివరణ ఉన్నది. 273-278 అద్యాయాలలో సూర్యచంద్రవంశరాజులు వర్ణన చేయబడింది. 279-300 అధ్యాయాలలోను, 369, 370 అధ్యాయాలలోను, మనుష్యాయుర్వేదమే కాకుండా, గజాశ్వవృక్షాద్యాయుర్వేదం కూడా చెప్పబడింది. 


301-326 అధ్యాయాలలో వివిధ దేవతల పూజా విధానాలు, వారికి సంబంధించిన మంత్రాలు, తత్సాధన విధానాదులు చెప్పబడినవి. 327వ అధ్యాయంలో దేవాలయప్రాశస్త్యాన్ని వర్ణింపబడింది. 328-336 అధ్యాయాలలో 'చందస్సు', 336 వ అధ్యాయంలో 'శిక్ష', 337-348 అధ్యాయాలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన వివిధ విషయాలు, 349-359 అధ్యాయాలలో వ్యాకరణశాస్త్ర విషయాలు, 360-367 అధ్యాయాలలో నిఘంటువు ఉన్నాయి. 


నిఘంటు భాగంలో అమర సింహుని నామలింగాను శాసనంలోని శ్లోకాలు యథా తథంగా చేర్చబడ్డాయి. 369-370 అధ్యాయాలలో మానవుని శరీరానికి సంబంధించిన వివిధ భాగాల వర్ణన ఉన్నది. 371వ అధ్యాయంలో అనేక విధాలైన నరకాల వర్ణన ఉన్నది. 


372-376 అధ్యాయాలలో యోగశాస్త్ర విషయాలు చెప్పబడినవి. 377-380 అధ్యాయాలలో అద్వైతసిద్దాంతం ప్రతిపాదించబడినది. చివరి మూడు అధ్యాయాలలో (381-383) భగవద్గీతసారము, యమగీత, అగ్నిపురాణ మాహాత్మ్యము ఉన్నాయి.


"అగ్నేయేహి పురాణాస్మిన్‌ సర్వావిద్యాః ప్రదర్శితాః" (అ.పు. 383-51) అని చెప్పినట్లు, మధ్యయుగానికి చెందిన భారతదేశంలో ప్రచారంలో ఉన్న అన్ని శాస్త్రీయవిషయాలూ ఈ పురాణంలో పొందుపరచబడి ఉన్నాయి.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కార్తీక పురాణం

 *కార్తీక పురాణం - 30వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*చివరి రోజు*


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*


నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సరదా కధ

 పెళ్లి అయి పాతికేళ్లు అయిన సందర్భంగా బెంగుళూరులో ఒక జంట పెద్ద విందు ఏర్పాటు చేసింది. జాతీయ మీడియా ప్రతినిధులు కూడా దానికి హాజరయ్యారు. ప్రెస్‌ వాళ్లు రావాల్సిన అంత విశేషం ఏముంది అంటే, వారిరువురు పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఘర్షణ పడలేదు. జాతీయ మీడియాను కూడా ఈ పాయింటు ఆకర్షించింది. మొత్తానికి విందుకు వచ్చిన విలేకరులు ఆ భర్తను పదేపదే ప్రశ్నలు అడిగారు.. "ఒక్కసారైనా గొడవ పడకుండా ఎలా ఉండగలిగారు? ఆ రహస్యం ఏదో ప్రజలకు చెబితే సుఖసంతోషాలతో వర్థిల్లుతారు కదా"!? అని అడిగారు. మొదట చెప్పటానికి నిరాకరించిన భర్త మొత్తం మీద ఒక ఛానెల్‌ విలేకరి ఒత్తిడిని భరించలేక పక్కకి తీసుకెళ్లి రహస్యం ఏంటో చెప్పసాగాడు..

......

పాతికేళ్ల క్రితం, మా పెళ్లయిన కొత్తలో.. హనీమూన్‌కు ఒక హిల్‌ సెంటర్‌కి వెళ్లాము.

నా భార్య "గుర్రం ఎక్కుతా" అని ముచ్చటపడింది. ఇద్దరం చెరో గుర్రం ఎక్కాం. మా ఆవిడ ఎక్కిన గుర్రం ఎందుకో భయపడి కొద్ది దూరం వెళ్లాక ఆమెను కిందపడేసింది!

ఖంగుతిన్న నా భార్య గుర్రంకేసి వేలు పెట్టి చూపిస్తూ "ఫస్ట్‌ టైమ్‌" అంది. నా గుర్రం సాఫీగానే వెళ్తోంది.

ఓ ఫర్లాంగు వెళ్లగానే మళ్లీ ఆ పెంకి గుర్రం నా శ్రీమతిని ఒక్క ఉదుటున కిందకి తోసేసింది.

కోపంతో ఆమె గుర్రం కేసి చూపుడు వేలు చూపిస్తూ "సెకండ్‌ టైమ్‌" అంది. ఇంక హోటల్‌కి కిలోమీటరు దూరంలో ఉన్నాం.. 10నిముషాల్లో వెళ్లిపోతాం అనగా, మరోమారు ఒక్క గెంతు గెంత ఆ గుర్రం మా ఆవిడ్ని కిందకి విసిరేసింది. ఆవేశంతో ఊగిపోయిన నా భార్య "థర్డ్‌ టైమ్‌" అంటూ పర్సులో నుంచి తుపాకీ తీసి దానిపై బులెట్ల వర్షం కురిపించి చంపేసింది.

అది చూసి నా మతిపోయింది. ఎంతైనా మూగజీవం కదా! దానికేం తెలుస్తుంది. కోపం వచ్చి నా భార్యను "నీకేమైనా మెంటలా? సైకోవా నువ్వేమైనా? కొద్దిగ కూడా కనికరం లేదా నీకు? యూ ఫూల్‌"!! అని తిట్టేశాను.

వెంటనే నా భార్య తన చూపుడు వేలు నాకేసి తిప్పి "ఫస్ట్‌ టైమ్‌" అంది.

అంతే ఇక నా వైవాహిక జీవితంలో ఇప్పటిదాకా గొడవల్లేవన్నాడా ఆదర్శ భర్త. 😝😝😝😝😜😜😜😜😜😝😝😝

*శ్రీ స్వామివారి బోధ..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి బోధ..ఊరట చెందిన దంపతులు..*


*(యాభై ఐదవ రోజు)*


సత్యనారాయణమ్మ గారిని కనిగిరి లో వదిలిపెట్టి వచ్చిన తరువాత శ్రీ స్వామివారిని శ్రీధరరావు దంపతులు కలిసారనీ..మాట్లాడదాము రమ్మని ఆ దంపతులను ఆశ్రమం లోకి తీసుకువెళ్లారు శ్రీ స్వామివారు..శ్రీ స్వామివారి కెదురుగా కూర్చున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


"అమ్మా..ఏదో దుష్ట శక్తి మీ బంధువు రూపంలో వచ్చి మీ అత్తగారి మనసంతా విరిచేసి..ఆవిడను మీకు కాకుండా చేసిందని మీరు భావిస్తున్నారు కదా..ఎంత వెఱ్ఱి తల్లివమ్మా!..ఆ వచ్చినావిడ మీ పాలిట దుష్ట శక్తి కాదు..మీకు అయాచితంగా.. పరోక్షంగా మేలు చేయడానికి వచ్చిన దేవత అని భావించండి..శ్రీధరరావు గారూ నేను మొదటిసారి మొగలిచెర్ల లోని మీ ఇంటికి వచ్చిన రోజే మీతో ఒక మాట చెప్పాను గుర్తుందా..మీ అమ్మగారికి మృత్యువు పొంచివుంది..ఆమెను రామనామం విడవకుండా చేసుకోమని చెప్పండి అన్నాను..నేను కూడా ఆమెతో మీ ఇంటిలో ఉన్న కాలంలో చెప్పి వున్నాను..ఆమె బాధ్యతను మీనుంచి తొలగించడానికే దైవం ఆ "బంధువు" ను   ఇక్కడికి పంపాడు..ఈ అవసాన కాలంలో మీ తల్లిగారు పడే బాధను మీరు చూడలేరు..పడలేరు..ఎక్కువ సమయం లేదామెకు..కొద్దిరోజుల్లోనే వైద్యులు కూడా ఇదే నిర్ధారిస్తారు..


"ఇక మీరిద్దరూ ఆమెకు చేసిన సేవ ఫలితం ఎక్కడికీ పోదు..మిమ్మల్ని ఇప్పుడు విమర్శించిన వ్యక్తులందరూ..మళ్లీ మిమ్మల్ని కీర్తించే రోజు వస్తుంది..ఇక్కడి నుంచి మీ బంధాలన్నీ ఒకటొకటిగా విడిపోతూ ఉంటాయి..ఇది మీకు మరో జన్మ గా అనుకోండి!..మీకు  దైవం కొన్ని బృహత్తర బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడు..అవి మీరు నెరవేర్చాలి..అందుకు ముందుగా ఈ ప్రతిబంధకాలు తొలగి పోవాలి..ఆ ఏర్పాట్లలో భాగమే ఆ బంధువు మీ వద్దకు రావడం..ఒక కష్టం..ఒక సుఖం..ఒక దుఃఖం..ఒక సంతోషం..వీటన్నింటినీ తట్టుకొని ఒక స్థిరచిత్తం మీకు కలగాలి..వీటన్నిటి కి ప్రేరణే ఈనాడు ఆ  భగవంతుడు చేసిన ఏర్పాటు.."


"మరో ముఖ్య విషయం..త్వరలో నా పరంగా మీమీద పెద్ద భారం పడబోతోంది..అందుకూ మీరు సన్నద్ధులు కావాల్సిన అవసరం ఉంది..ఇక మనసు గట్టి చేసుకోండి..నిశ్చింతగా వుండండి.. ఏ బాధా.. ఏ సంతోషం..మీ మార్గం నుంచి వేరు చేయలేవు..ఈ ఆశ్రమం కూడా క్షేత్రంగా మారుతుంది..అప్పుడు అందరూ మీ గురించి ముచ్చటించుకుంటారు.." 


"అమ్మా..నువ్వు రచయిత్రివి..నా చరిత్ర వ్రాసే రోజులు వస్తాయి..ఇక ఎక్కువ ఆలోచించకండి..శుభం జరుగుతుంది.." అన్నారు..


శ్రీ స్వామివారి బోధ ఆ దంపతులకు ఎనలేని మానసిక స్తైర్యాన్ని ఇచ్చింది..మన వంతు కర్తవ్యం మనం చక్కగా నెరవేర్చాలి..ఫలితాన్ని ఆ దైవానికి వదిలేద్దాము..అనే భావనలోకి వచ్చేసారు..ఆరోజు నుంచి వారి జీవితంలో పెను మార్పు తీసుకొచ్చింది..పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు వారి జీవనయానం సాగడానికి తోడ్పడింది..శ్రీ స్వామివారి సేవ అనేది తమ జీవితంలో ముఖ్యమైన విషయంగా మారిపోయింది..


ఎందరో సాధకులు..ముముక్షువులు..పండితులు..శ్రీ స్వామివారిని దర్శించడానికి మొగలిచెర్ల రా సాగారు..వారిని ఆదరించడం..సత్సంగ గోష్ఠులు..ఇలా నిత్యం ఒక దైవిక వాతావరణం ఆ దంపతుల చుట్టూ ఏర్పడిపోయింది..వారూ అందులో ఇమిడిపోయారు.


ప్రభావతి గారిని తేలు కుట్టటం..అహంకార నిర్మూలనం..రేపు.. 


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

దాన విశిష్ఠత

 శు భో ద యం🙏

దాన  విశిష్ఠత !


             ఉ:  దాన కళా కలాప  సముదంచిత  సార వివేక  సంపదన్


                   మానిత  యాచమాన  జనమానస  వృత్సభిపూర్తి బుధ్ధి  యె


                   వ్వానికి  లేదొకింతయును  వాడొకరుండు  భరంబు ధాత్రికిన్,


                  కానలుగారు , వృక్షములుగారు  నగంబులు  గారు  భారముల్; 


శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.


భావము:  దానంచేయటం ఒక  కళ.  దాని విశిష్ఠతను  తెలిసికొని  ,మాన నీయులైన  యాచకజన  మనోరథములను  తీర్చెడి

కుతూహలము  యెవనికి లేదో  ఈపుడమికి  వాడొక్కడే  భారము.


                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు  గానీ , భారములుగావు.


      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే  దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది  కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని  సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని  గౌరవనీయులుగా భావించాలి. వారి  మనసెరిగి  దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి  ఉత్తముడే దాత అతడు పుడమికి  అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని  భావము.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అన్నమయ్య అక్షరవేదం

 🌺🍃 *----------------* 🍃🌺


*అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 356*


*( అందరిలోనా ఎక్కుడు హనుమంతుడు ... )*


🌺🍃 *----------------* 🍃🌺


ఓం నమో వేంకటేశాయ. 🙏

 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 356 కి శుభ స్వాగతం ..🙏 


*ప్రార్థన ః--*🌹🙏


*అధికుండందరిలోనన్*

*బ్రధాన పూజ్యుండు హనుమ బంటుతనములో !*

*బుధుడితడె దాస భక్తికి ,*

*మధురముగా రాముని దన మదిలో నిలిపెన్ !*


🌹🙏🌹


✍️ *--స్వీయపద్యము ( కందము )*


🌹🌹

(  ఎవ్వరూ ఇతనికి సాటిలేని రీతిలో అధికుడైన వాడు ,

ప్రధానముగా  రామునికి బంట్లలో  సర్వశ్రేష్టుడని పేరు గాంచినవాడు ఈ *హముమంతుడు .*🙏


*శ్రీ రామునికి* దాసులమని చెప్పుకునేవారికందరికీ , ఇతడే గురువు .🙏


ఎంతో మధురముగా సతతము ఆ రామ నామమునే జపించుచూ , శ్రీ రామచంద్ర మూర్తిని తన మనస్సులో స్థిరముగా నిలుపుకున్న వాడు ఈ *హనుమంతుడు .*🙏


అటువంటి హనుమంతునకు సదా మంగళములు )🙏


🌹🙏🌹


🌺🍃 *----------------* 🍃🌺


అన్నమాచార్యుల వారు అనేకమైన సంకీర్తనలను హనుమంతుని వైభవాన్ని , అతని దాస్య గరిమనూ , పరాక్రమాలనూ అతి సుందరముగా కీర్తించుచూ రచించినారు .🙏


అటువంటి ఒక చక్కని హనుమ సంకీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇


🌺🍃 *----------------* 🍃🌺


🌹🌹

ఇదిగో ఇతడే అందరిలోకెల్లా గొప్పవాడు .ఇతడే *హనుమంతుడు .*🙏


గురుతుగా అదిగో ఆ మతంగ పర్వతము వద్ద తన ఉనికిని చక్కగా చాటి ప్రకాశిస్తున్నాడు ఈ *హనుమంతుడు .*🙏


🌹🌹


పుట్టుకతోనే మహిమాన్వితమైన కవచకుండలాలతో ,

అతి పవిత్రమగు అంగవస్త్రమును కవచముగా పొంది జన్మించాడు ఈ *హముమంతుడు .*🙏


అమితమైన పరాక్రమ శాలియై ,

బలిష్టమైన పిడికిలి గల చేతులతో ,భుజాలతో ,

తన పెద్దదైన తోకను విశేషముగా పైకి ఎత్తి అలరియున్నాడు ఈ *హనుమంతుడు .*🙏


🌹🌹


కావాలని తానే యత్నించి ఆ సముద్రమును దాటి మరీ ఆ లంకకు చేరి నిప్పుపెట్టి , ఆ లంకను చిందరవందర చేసి ,

అందరూ అటూ ఇటూ గందరగోళముగా  భీతితో పరుగెత్తునట్లు చేసెను .🙏


చక్కగా సీతమ్మ వారి వద్దకు చేరి , బుద్ధి కుశలతతో పరిస్థితిని అంతా చక్కగా చెప్పి ,

ఆమెలో నిబ్బరము సడలకుండా ,తనపై నమ్మకము కలుగు రీతిన , తన మేనును విశ్వమంతా వ్యాపింప చేసి , చివరకు ధ్రువ మండలాన్ని కూడా తాకునట్లు చేసెను ఈ *పెద్ద హనుమంతుడు .*🙏


🌹🌹


స్థిరముగా తన మహిమలను ఎన్నో చూపి ,

దివ్యమైన ప్రకాశముతో , శౌర్య పరాక్రమములతో ఉన్నవాడై  ,

తనకు తానే విచారించి మరీ భగవద్భక్తులకు సదా అండగా ఉంటూ రక్షించి కాపాడుకొనుచున్నాడు ఈ *హనుమంతుడు.*🙏


అంతటా వ్యాపించి ఇదిగో ఈ తిరుమల గిరిపై *శ్రీ వేంకటేశ్వరునకు* దాసుడై సదా అతని సేవలోనే నిలిచి యున్నాడు .

అట్టి *పొడవైన  హనుమంతుడు* భక్తులకందరికీ వరములను   ప్రసాదించుచున్నాడు .🙏


🌹🙏🌹


*ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏


తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏

దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏


*(  అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 356)*


✍️ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏


    🌹🌹 *సంకీర్తన* 🌹🌹


అందరిలోనా ఎక్కుడు హనుమంతుఁడు

కందువ మతంగగిరి కాడి హనుమంతుఁడు 


*|| పల్లవి ॥*


కనక కుండలాలతో కౌపీనముతోడ

జనియించినాఁడు యీ హనుమంతుఁడు

ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాల తోడ

పెనుతోఁక యెత్తినాఁడు పెద్ద హనుమంతుఁడు 


*|| చరణం ॥*


తివిరి జలధి దాఁటి దీపించి లంక యెల్లా

అవల యివల సేసె హనుమంతుఁడు

వివరించి సీతకు విశ్వరూపము చూపుతా

ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుఁడు 


*|| చరణం ॥*


తిరమైన మహిమతో దివ్య తేజముతోడ

అరసి దాసులఁ గాచీ హనుమంతుఁడు

పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు

వరములిచ్చీఁ బొడవాటి హనుమంతుఁడు


*|| చరణం ॥*


            🌹🙏🌹🙏🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ అమావాస్య - అనూరాధ -‌ భౌమ వాసరే* (12.12.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/pQ2qOb_olAY?si=CTyAhx8HkhidYG2K



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*