10, అక్టోబర్ 2023, మంగళవారం

అమ్మ ఆశ్వీర్వదించి

 *అమ్మ ఆశ్వీర్వదించి పిలిచింది.*




లలితా సహస్రనామ భావార్ధాలు రాస్తున్న వేళ తన ఆలయం విషయాలను తెలిపినట్టి ఆ లలితాపరాభట్టారిక తన దర్శనభాగ్యం కలిపించింది. తమిళనాట చిదంబరం నుంచి సుమారు 60 కి.మి దూరంలో, మైలదుత్తురై నగరానికి 19 కి.మి దూరంలో గల పేరలం గ్రామ సమీపంలో తిరుమెయిచూర్ లో ఈ లలితాదేవి ఆలయం ఉంది. 

*సెప్టెంబర్ 28వ తేదీ, 29వ తేదీ రెండు రోజులు ఆ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేసుకున్న అదృష్టం నాకు కలిగింది.* ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం గురించి పూర్తి వివరాలు అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను. 


*లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమెయచ్చూర్‌...*

 లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్‌ హోమాలతో, అరవై, ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో అలరారుతుంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాళన గావిస్తుందంటారు. అంతేకాదు, ఇక్కడి స్వామిని ప్రార్థిస్తే పెళ్లికాని యువతులకు వెంటనే కళ్యాణప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్యరథసారధి అయిన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల నమ్మకం. 

సకల భువనేశ్వరుడు, మేఘనాథుడు మొదలైన నామాలతో ఇక్కడ విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక సందర్భాలలో విశేష పూజలు జరుగుతుంటాయి.ఎంతోమంది తమ షష్ఠిపూర్తి ఉత్సవాలను, సహస్ర పూర్ణ చంద్రదర్శన పండుగ సమయాలు, ఆయుష్‌ హోమాలు, మృత్యుంజయ హోమాలు తిరుమెయచ్చూరులోని పరమేశ్వరుని సన్నిధిలో నిర్వహించి ఆ దేవదేవుని ఆశీస్సులనందుకుంటారు. ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56వ శివాలయంగా ఎంపిక కాబడింది. భక్తగ్రేసరుడైన జ్ఞానసంబందర్‌ తన ‘తేవరమ్‌’ స్తోత్రాలతో ఇక్కడి పరమేశ్వరుని స్తుతించారు. తిరుమెయచ్చూర్‌ దేవాలయంలో శివ పూజలు, అభిషేకాలు, లలితాంబికకు అర్చనలు జరగడంతో పాటు ప్రత్యేకంగా ‘రథసప్తమి’ పండుగ గొప్పగా నిర్వహించబడుతుంది. తమిళ మాసమైన చితిరాయ్‌ (ఏప్రిల్‌-మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయి.

ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలను చూడొచ్చు. ఇక్కడి కాళికాదేవి మందిరం కూడా దర్శించదగింది. ఎనిమిది చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవిగా శుకమహర్షి స్తోత్రం గావించాడు. వేదవ్యాసుని కుమారుడైన శుకమహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబికకు తెలియజేస్తుందని, అందుకే ప్రతి నిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపైన ఎగురుతుందని ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ.

తిరుమెయచ్చూరు మరో ప్రత్యేకత ఏమంటే, ఈ దేవాలయంలో రెండు శివమూర్తులు, రెండు పార్వతీమూర్తులు పూజలందుకోవడం. ఈ విశేషం తమిళనాట తిరుమెయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన  సూర్యుడు శాపం నుంచి విముక్తి పొందాడని అంటారు. దాని గుర్తుగా గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు.

*దర్శన వేళలు ఇవీ..*

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.

*దేవాలయ విశేషాలు:*

తిరుమెయచ్చూర్‌ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాంగణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.


*ఆలయ ప్రాశస్త్యం:*


తిరుమెయచూర్‌ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసులు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె భండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమె ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు. హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమెయచ్చూర్‌ వచ్చి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని ప్రాంతీయ కథనం. 

*12 నాగమూర్తులు...*

ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమెయచ్చూర్‌ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమెయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై, తిరుమెయచ్చూరు లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.


ఇదిలా ఉంటె ఈ మధ్యకాలంలో అంటే సుమారు 1999లో అమ్మవారు ఓ భక్తుడి కలలో తన కాలిపట్టీలు పడిపోయాయని తనకు అవి ఇవ్వమని కోరిందిటా. ఆ భక్తుడు ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకొని బంగారు కాలిపట్టీలు చేయించి ఇవ్వాలని సంకల్పించారు. కనీసం విగ్రహం వివరాలు లేని అతను చేయించాలనుకున్న క్షణం నుంచి అమ్మవారి పాదాలకు అలంకరణ వరకు స్వయంగా చూసినట్టుగా సరైన సైజులో రూపోందాయి. వాటిని తీసుకువచ్చి ఆలయపురోహితుడికి ఇచ్చి అలంకరించమంటే వాటిని పెట్టడం అసాధ్యం ఎందుకంటే కాలిభాగంలో ఎటువంటి ఖాళీస్ధలం లేదు అన్నారు. కాదు ఉంది చూడండి అంటే మీరు చూడండి అన్నారుట. అమ్మవారి కాళ్ళు పరిశీలించగా అంతకుముందు వరకు లేని ఖాళీస్ధలం కనపడటం అందులో సరిగ్గా అమరినట్టు పట్టీలు పట్టడం నిజంగా మహిమే కదా. ఈ అమ్మవారు శ్రీయంత్రంపై అధిష్టానమై ఉండటం విశేషం. ఇక్కడ అమ్మవారికి నేయి సమర్పించడం వలన భార్యభర్తల మధ్య స్పర్ధలు తొలగి అనోన్య దాంపత్యంతో ఉంటారని ప్రతీతి. 

ఈ ఆలయం గ్రామీణ ప్రాంతంలో ఉండటంవల్ల మనం సమీపంలోని మాయవరం(మైలదుత్తురై) గాని కుంభకోణం లో గాని ఉండి దర్శించవచ్చు.

కామెంట్‌లు లేవు: