17, సెప్టెంబర్ 2020, గురువారం

. పొగడ్తలో నిజాయితీ

అట్టు తిననివాడైనా దొరుకుతాడేమో కానీ తిట్టు తిననివాడు దొరకడు. పొగడ్తలో నిజాయితీ ఉండకపోవచ్చునేమో కానీ, తిట్టులో ఎంతో కొంత నిజాయితీ ఉండి తీరుతుంది. తిట్లలో చరిత్ర కూడా బయటపడుతుంది. తిట్టు కవిత్వమూ అంతే. ఎదుటివాడి సత్తాను నిగ్గుతీసి చెబుతుంది. అందుకే తెలుగు సాహిత్యంలో తిట్టు కవిత్వానికీ ఓ గట్టి స్థానం ఉంది.
‘ఆదికవి ఎవరు’ అంటే నన్నయ్య అని టక్కున చెబుతారు చాలామంది. నన్నయ్య కాదయ్యా అనేవాళ్లూ కొంతమంది ఉండి ఉంటారు. మరి తెలుగులో ‘తొలి తిట్టుకవి ఎవరయ్యా’ అంటే ‘వేములవాడ భీమకవి’ అని చెప్పి తీరాల్సిందే. దీన్ని ఎవరూ కాదనరు. కాదన్న మాదన్న ఎవరన్నా ఉన్నా స్వర్గంలో ఉన్న భీమకవి ఊరుకోడు. తర్వాతి పరిణామాలు ఊహించుకోవాల్సిందే. తిక్క రేగిందంటే డొక్క చీల్చే రకం! ఇది పదహారణాల తెలుగు ‘వాడి’ లక్షణం!

తెలుగు సంగతి అలా ఉంచితే, ‘సంస్కృతంలో తొలి తిట్టుకవి ఎవరు?’ అంటే వాల్మీకే. ఇదీ ఏకగీవ్రమే. ‘‘మానిషాద ప్రతిష్ఠాం త్వ మగమ/ శ్శాశ్వతీస్సమాః యత్క్రౌంచ మిథునా దేకం/ అవధీః కామ మోహితం’’ అని తిట్టిపోశాడాయన. కామమోహితమైన క్రౌంచపక్షుల జంటను తన బాణంతో విడదీసిన నిషాదుణ్ని చూసి వాల్మీకి నిప్పులు కక్కాడు. ఇదే రామాయణ రచనకు మూలకారణమైంది. అన్యాయాన్ని ఎదిరించడానికి ఉగ్రనరసింహావతారమెత్తిన వాల్మీకి, వ్యాసుడితో కలిసి తెలుగులో వేములవాడ భీమకవిగా అవతరించాడనిపిస్తుంది. అందుకే కవిసార్వభౌముడు శ్రీనాథుణ్ని కూడా ప్రభావితం చేయగలిగాడు. ‘‘వచియింతు వేములవాడ భీమన భంగి/ ఉద్దండ లీల నొక్కొక్కమాటు’’ అని శ్రీనాథుడు భీమకవిని ప్రశంసించాడు.
ఇద్దరూ ఇద్దరే
తిట్టినవారికి తిట్టున్నర అంటించడం భీమకవి శైలి. అన్నం దగ్గర తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఆయన ఓ తిట్టుపద్యం చెప్పాడు. తనను తల్లి పేరుతో తిడుతూ భోజనం చేయడానికి ఒప్పుకోని పెద్ద మీద భీమకవి ఇలా విరుచుకుపడ్డాడు..
గొప్పలు చెప్పుకొంచు నను కూటికి పంక్తి రాకుమంచు నీ
త్రిప్పుడు బాపలందరును తిట్టిరి కావున నొక్కమారు మీ
యప్పములన్ని కప్పలయి అన్నము సున్నముగాగ మారుచున్‌
పప్పును శాకముల్‌ పులుసు పచ్చడులున్‌ చిరురాలు గావుతన్‌
      భీమకవి ఇలా వీరంగమాడేసరికి తిట్లు తిన్నవాడు గడగడ వణికిపోయాడు. అప్పటికే ఆ పద్యం దెబ్బకు అప్పాలు కప్పలయ్యాయి. అన్నము సున్నమైంది. అన్నీ ఆయన చెప్పినట్టే అయిపోయాయి. భీమకవా? మజాకా!

కామెంట్‌లు లేవు: