17, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్..80


.

చిత్రకూటానికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు వారివెంట భరద్వాజమహర్షికూడా దారిచూపడానికి వెంట కొంతదూరము ప్రయాణించాడు.
.
రామా ! ఈ మార్గములో నేను చాలా సార్లు చిత్రకూటమునకు వెళ్ళాను. ఇది ఏ విధమైన ఇబ్బందులు కలుగని మార్గము.
ఇక్కడ నుండి గంగాయమునల సంగమప్రదేశానికి వెళ్ళండి అక్కడనుండి పడమటిదిక్కుగా యముననే అనుసరిస్తూ వెళ్ళండి.
.
అలా ప్రయాణించిన తరువాత కాళిందిని తెప్పనిర్మించుకొని దాటండి .దాటినపిమ్మట మీకు శ్యామము అనే అతివిశాలమైన మర్రిచెట్టు కనపడుతుంది.ఆ వృక్షాన్ని ఆశ్రయించి అనేకమంది సిద్ధులుంటారు.అక్కడ సీత ఆ వృక్షానికి నమస్కరించి కావలసిన కోరికలు కోరవచ్చును .
.
ఆ పెద్ద మర్రిచెట్టు దాటి ముందుకు ఒక క్రోసు దూరము వెళ్ళండి అక్కడ చక్కటి నీలపురంగులో ఉండే అడవి కనపడుతుంది .
అది మోదుగుచెట్లతోనూ,రేగుచెట్లతోనూ,వెదురుడొంకలతోటి కూడి రమణీయంగా ఉంటుంది .
ఆ మార్గమే చిత్రకూటమునకు వెళ్ళే మార్గము.ఈ విధముగా మహర్షి మార్గనిర్దేశము చేసి తాను రామునికోరికమీద వెనుకకు మరలి నాడు.
.
మువ్వురూ యమునాతీరంచేరారు.యమున ప్రవాహం వేగం మంచి ఉధృతంగా ఉంది.దానిని ఎలా దాటాలా అని కాసేపు ఆలోచించి ,చకచకా కొన్ని ఎండిన కర్రలు,వెదురుకర్రలు సేకరించి వాటన్నిటినీ దగ్గరగా చేర్చి కట్టిఒకతెప్పతయారుచేసుకొన్నారు .
.
లక్ష్మణుడు రకరకాలచెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి సీత సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఒక ఉన్నతమైన ఆసనం సిద్ధం చేశాడు.
.
ఆ తెప్పమీదికి ఎక్కడానికి కాస్తసిగ్గుపడుతున్న సీతమ్మకు చేయూతనిచ్చి ఎక్కించాడు రామచంద్రుడు.
.
మూటకట్టినసీతఆభరణములు,గునపము,
మేకతోలుతోచేసినచిన్నపెట్టెను,
ఆయుధాలను సీతప్రక్కనే ఉంచాడు రాఘవుడు.
.
ఇరువురు అన్నదమ్ములూ తెడ్లేసుకుంటూ దానిని నడుపసాగారు సూర్యపుత్రిక అయిన ఆ నది మధ్యభాగంలోకి వెళ్ళగనే సీతమ్మ మరల మొక్కులు మొక్కుకుంది .
.
అమ్మా రాముడు క్షేమంగా తిరిగి అయోధ్యకు రాగానే నీకు వందకుండల కల్లు వేయి గోవులు సమర్పించుకుంటానమ్మా అని నదీమతల్లికి మొక్కులు మ్రొక్కింది.
.
ప్రయాణించి వచ్చిన తెప్పను అచటనే వదిలివేసి మరల నడకసాగించారు .వనములగుండా ప్రయాణం చేస్తూ శ్యామము అనే మర్రిచెట్టు వద్దకు వచ్చి చేరారు.
.
ఆ మర్రిచెట్టు చుట్టూ సీతమ్మ మరల ప్రదక్షిణం చేసి తన భర్త నిర్విఘ్నముగా వనవాస వ్రతము పూర్తిచేయాలని కోరికలు కోరింది.
.
మరల నడక మొదలు పెట్టారు . లక్ష్మణుడు ముందు తరువాత సీతమ్మ ఆవెనుక ధనుర్ధారియై రామయ్య.
దారిలో ఏదైనా అందమైన పొదగానీ ,పువ్వుగానీ కనపడినప్పుడు రామచంద్రుని దాని విశేషమడుగుతూ ఆయన చెపుతూ ఉంటే ఈవిడ చిన్నపిల్లలాగా ఆనందిస్తూ ముందుకు సాగుతున్నది.
వదినగారు ఏ పూవును పండును అయితే చూసి విశేషమడిగారో వాటిని సేకరించి మరిది లక్ష్మణుడు తీసుకొని వచ్చి ఆవిడకివ్వటం... ఇలా సాగుతున్నది వారి ప్రయాణం.

రామాయణమ్. 81
..
రాత్రి గడిచింది .అందరికన్న ముందుగా రాముడు నిద్దుర లేచాడు.ప్రక్కకు తిరిగి చూస్తే తమ్ముడు ఇంకా నిద్దురపోతూనే కనిపించాడు.
సోదరుడిని మెల్లగా తట్టి నిద్రలేపాడు .లక్ష్మణా ! వనంలో సంచరించే ప్రాణుల ధ్వనులు ఎంత మధురంగా ఉన్నాయో విను.ఇది మరల మనము బయలుదేరే సమయం త్వరగా ప్రయాణం సాగించాలి.
.
అన్నగారిచేత మేలుకొలుపబడ్డవాడయిన లక్ష్మణుడు నిద్రను,బద్ధకాన్ని వదిలించుకొని లేచి యమునలో స్నానంచేసి ప్రయాణ సన్నద్ధుడైనాడు.
.
భరద్వాజ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ చిత్రకూటం వైపు సాగిపోయారు.
.
మార్గంలో సీతకు వనశోభను చూపిస్తూ సీతా చూశావా ఈ కింశుకవృక్షాలు! వాటిపూలను అవే మాలలు గ్రుచ్చి వేసుకొన్నట్లుగా ఉంది.ఎర్రటిపూలతో మంటపెట్టినట్లుగా ఉంది.
.
శిశిరం వెళ్లిపోయింది. అందుకే అడవంతా విరగబూసింది .సీతా ఇటు చూడు ఈ భల్లాత(జీడి) వృక్షము పూలు పండ్లతో భారం మోయలేక వంగిపోయి ఉంది.ఇవి అందించే మధురఫలాలను తినడానికి నరులెవ్వరూ ఇచటలేరు కదా!
.
లక్ష్మణా ! అదుగో చూశావా ప్రతిచెట్టుమీదా తేనెపట్టు ఉంది.ప్రతి తేనేపట్టు ఎంతో పెద్దగా ఉండి నేలను తాకుతున్నట్లుగా ఉన్నాయి.
.
ఎక్కడ చూసినా పూలే ! నేల అంతా పరుచుకొని రహదారిని కప్పివేసి సున్నితమైన సీతమ్మపాదాలకు రక్షణగా ఉన్నాయవి..
.
వానకోయిలకూస్తుంటే దానికి సమాధానంగా నెమలి క్రేంకారం మనోహరంగా శ్రవణానందకరంగా ఉన్నది.వనమంతా పక్షుల కూజితాలతో సందడిసందడిగా ఆహ్లదకరంగా ఉంది.
.
ఎదురుగా ఎత్తైన శిఖరాలతో చిత్రకూటం కనపడుతున్నది .దానిమీద గుంపులుగుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.
.
లక్ష్మణా మనోహరమైన ఈ గిరిశిఖరాలమీద ఉండాలనే ఉత్సాహం ఊరిస్తున్నదయ్యా! అందాలుచిందించే ఈ చోటు చోడు కంటికి బహుపసందయిన విందుగావిస్తున్నది.
ఈ తరులు,ఈ గిరులు ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రదేశం .
ఇక్కడే మనం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించవచ్చు.
.
ఆ ప్రదేశంలో ఎందరో మునులు స్థిరనివాసం ఏర్పరచుకొని తాపసవృత్తిలో జీవిస్తున్నారు.వారందరినీ చూశారు వారు.
.
ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరుకొని ఆ మహానుభావుడికి నమస్కరించి వినయంగా నిలుచున్నారు మువ్వురు.వారి ఆగమనానికి మహర్షి ఆనందించి వారిని తగురీతిగా సత్కరించి కూర్చోమని ఉచితాసనాలిచ్చినాడు.
.
రాముడు తమను తాము మహర్షికి పరిచయం చేసుకొని తమ రాకకు గల కారణాన్ని మహర్షికి తెలిపి,లక్ష్మణుని వైపు తిరిగి లక్ష్మణా మనం ఇక్కడ నివసించటానికి యోగ్యమైన ఒక గృహాన్ని నిర్మించవలె అందుకు కావలసిన సామాగ్రిని సేకరించమని కోరాడు.

కామెంట్‌లు లేవు: