3, నవంబర్ 2020, మంగళవారం

త్రిపురారహస్య

 **దశిక రాము**


**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**


అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 


PART-11


తనతండ్రినొక్కరిని కొందఱు రాజుపుత్రులు సంహరించి రని భార్గవుఁడు లక్షలకొలఁది క్షత్రియులను వధించుట తగునా? శ్రీరాముఁడు సైతము దానిని ఆక్షేపింపక పోఁగా అంగీకరించుచున్నా నని చెప్పుట గమనింపఁదగియున్నది. అనఁగా అది ధర్మమే యన్నమాట. తక్షకుఁడు పరీక్షిత్తును ఒక్కనిని వధించినప్పుడు కూడ జనమేజయుఁడు సర్పయాగమునుజేసి అసంఖ్యాకములైన పాములను అగ్నికి ఆహుతిఁగావించెను. ఆసందర్బమున ఉదంకుఁడు ''ప్రల్లదుఁడైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులంబెల్లను దూషితంబగుట యేటియపూర్వము...'' అని జనమేజయునకు బోధించెను. ఇట్లే సీతవిషయమునందును తప్పుచేసినవాఁడు రావణుఁ డొక్కఁడే. అయినను శ్రీరాముఁడు రాక్షసకులము నంతను సంహరింపక తప్పలేదు. ఒకఁడు తప్పుచేయుచున్నప్పుడు వానిని అదుపులో పెట్టవలసినబాధ్యత కులములో ఎల్లరకును ఉండును. అపరాధి బలవంతుఁడైనచో ధర్మజ్ఞులైనవారు వానిదోషమును నిరసించి తొలఁగిపోవలెను. విభీషణుఁడు అట్లు తొలఁగివచ్చి రక్షింపఁబడెను. మఱి కార్తవీర్యుఁడు ఆతని పుత్రులు కావించినయకృత్యములను ఆకాలమున శ్రీరామునివలె ఒక్క క్షత్రియుఁడైనను ఖండింపలేదు. వారందఱును ''ఒకబ్రాహ్మణుఁడు మహారాజులైన క్షత్రియులపై తిరుగఁబడుటయా! ఇది సిహింపరాదు'' అను భావముతో క్షత్రియప్రతిష్ఠను కాపాడవలయు నను నుద్రేకముతో శమంతపంచకమునకు సన్నద్ధులై చనిరి. ఆపరాధిని ఎవరు సమర్థింతురో వారును అపరాధులే అగుదురు. కావుననే భార్గవుఁడు కావించిన క్షత్రియ సంహారమును శ్రీరాముఁ డామోదించెను.

భార్గవుఁడు నైష్ఠికబ్రహ్మచారి. అయినను ఆయన పట్టాభిషిక్తుఁడై ప్రజాపాలనము గావించి షోడశమహారాజులలో ఒకఁడుగా ప్రసిద్ధుఁడయ్యెను. అంతేకాదు. ఆయన పెక్కుయజ్ఞములను గావించి భూమి యంతయు కశ్యపాదిమహర్షులకు యజ్ఞదక్షిణగా నొసంగెను. మఱి బ్రహ్మచారికి పట్టాభిషేకమునకుఁ గాని యజ్ఞములు చేయుటకుఁ గాని అధికార మున్నదా? ధర్మపత్నీసమేతునకే పట్టాభిషేకము చేయుదురు. వానికే యజ్ఞము చేయుటకును అధికారముండును. అట్లయినచో భార్గవునిచే యజ్ఞమును చేయించిన కశ్యపాదిమహర్షులకు ధర్మము తెలియదా? శ్రౌతస్మార్తకర్మలయందు యజమానుఁడు పత్నీసమేతుఁడైయుండవలయు ననుటకు కర్మసమృద్ధిని చెప్పటయందే తాత్పర్యము కాని పత్నీరహితునకు బ్రహ్మచారికి యజ్ఞాధికారము లేదని చెప్పుట యందు తాత్పర్యము కాదు. ఆపస్తంబశ్రౌత సూత్రమున సూ|| యోవా కశ్చి దవిద్యమానాయామ్‌||

(ప్రథమప్రశ్నే-వింశఖండే-త్రయోదశసూత్రమ్‌) అనుసూత్రమును వ్యాఖ్యానించుచు భట్టరుద్రదత్తుఁడు ఇట్లు నిష్కర్ష గావించెను. ''భార్య లేకున్నను ఒకానొకఁడు అగ్నులను సంపాదించుకొనవచ్చును; అనఁగా యజ్ఞ మొనరింపవచ్చును. వయస్సు ఆజ్యము మొదలగు వానివలె యజమానునకు యజ్ఞకర్మయందు భార్యయు ఒకయంగము మాత్రమే అగును. ఏవేని కొన్ని యంగములు లోపించినప్పుడు ప్రతినిధిద్రవ్యములతో యజ్ఞమును కొనసాగింపవలసియే యుండును. అట్లే భార్య లోపించినప్పుడును యజ్ఞాధికారము లోపింపదు. ధర్మవిగ్రహుఁడైన శ్రీరామచంద్రుఁడు సీత లోకాంతరమునకు చేరినతరువాత కూడ పెక్కు అశ్వమేధములను గావించెను. అంతే కాదు శిష్టులలో శ్రేష్ఠులైన భీష్ముఁడు, కణ్వుఁడు మొదలగువారు యజ్ఞములు చేసినట్లు ప్రసిద్ధముగా నున్నది. కావున అపత్నీకునకు యజ్ఞాధికారము లోపింపదు''.

 PART-11

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: