3, నవంబర్ 2020, మంగళవారం

కార్తీక మాసంలో

 కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితోగానీ, గోధుమపిండితోగానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే… పసుపునుపూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు…


“సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం”

“దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ”-

అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే.. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.


“దీపదానం మహిమను గురించి వివరించే కథ”

పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్నఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ… తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేదికాదు. పరమలోభి.


శుచిశుభ్రత లేకుండా జీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.


అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

కామెంట్‌లు లేవు: