3, జులై 2020, శుక్రవారం

నా అనుభవాలు

పీఠం జయేంద్రసరస్వతీ స్వామి వారికి ఇచ్చివేసి, తాము ఒంటరిగా పాదచారియై ఎఱ్ఱనిఎగాని లేకుండా యాత్ర ఆరంభించారు. ఎనభై ఎళ్ళ వయస్సులో, దాంట్లో ఎన్ని నియమాలు. ఎవరివద్దా డబ్బుగా పుచ్చుకో రాదు. బియ్యం, పప్పు, కూరలు వంటివి పరివారనికై పుచ్చుకోవచ్చు. స్వామివారికి కావలసిన పేలపిండో, అరటిపళ్ల పొడో నిత్యం సమర్పించే భక్తులే ఇస్తారు. ఒక ఊరినుండి బయలుదేరితే మిగిలిన సామన్లు అన్నీ అక్కడే వదిలివేయాలి. స్వామివారు ఏ పాడుపడిన గుడిలోనో, మోటారు షెడ్డులోనో చెట్టుకిందో కూర్చుంటారు. ఈ రకంగా సాగిపోతూ ఎన్ని మహత్కార్యాలు చేయించారో.

సతారాలో ఉత్తర చిదంబరం అనే పేరుతో నటరాజస్వామిదో పెద్ద గుడి ఉంది. మదరాసులో కామక్షికో గుడి, వేద పరిపాలనా సంస్థ.... ఒకటేమిటి పెద్ద పెద్ద కర్యక్రమాలెన్నో చేయించారు. మరి దీనికంతటికీ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? తాతాచార్యులవారితో స్వామివారన్నారట - "డబ్బుకోసం మన పని కాదు. కార్యక్రమం ఎలా నడపాల అన్నదే ఇప్పటి ప్రశ్న. దానిని మనం నిర్ణయిస్తే కావలసిన ద్రవ్యం గురించి చంద్రమౌళీశ్వరుడే చూసుకుంటాడు."

ఆర్ధికంగా అతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న కాలంలో కూడా ద్రవ్యం విషయంలో శుద్ధి, నైతికత, పారదర్శకత వారొక్కరి విషయంలోనే కాదు వారిని ఆశ్రయించిన వారందరి విషయములోనూ ఇటువంటి పట్టుదలని చూపేవారు. నాకు శ్రీవారు అనేక మంది భక్తుల విషయంలో చూపిన నిర్దుష్టత నేరుగానూ, ఖచ్చితమైన సాక్ష్యాలతోనూ తెలిసినప్పటికీ అటువంటి భక్తుల అనుమతి లేకుండా వ్రాయడం న్యాయం కాదు కాబట్టి నా విషయంలో నేరుగా జరిగిన అనుభవాలను మాత్రం ఒకటి రెండింటిని మనవి చేస్తాను. 

ఉద్యోగం చేసేకాలంలో... ఆ కాలంలో మలేషియా నుండి దిగుమతి చేసుకున్న రబ్బర్ వేల టన్నులు చెన్నై నుండి మా ఫ్యాక్టరీ ఉన్న స్థలానికి రవాణా చేయించే బాధ్యత కుడా నామీద ఉండేది. రోజుకు పది పదిహేను లారీలు వెళుతూ ఉండేవి. నాపై అధికారులే ధరలు, ఇంచుమించు ఏ శాతంలో సరుకు ఎవరెవరి ద్వారా పంపించాలో నిర్ణయించి నాకు తెలియజేసేవారు. నా పని కేవలం అది సజావుగా జరుగుతున్నదా అని పైఎత్తుగా చుడడమే!

ప్రతీ శనివారం సాయంకాలం మిత్రులతో కలిసి కంచికి వెళ్ళి ఆదివారం కూడా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగివచ్చే వారము. ఒకరోజు అలా బయలుదేరడానికి సిద్దమైనాను. మా కంపెనీ వలన లబ్ధి పొందే ఔత్సాహికుడైన ఒక లారీ కంపెనీ యజమాని చూడడానికి వచ్చాడు. మర్యాదలయిన తరువాత ఒక వందరూపాయల కట్ట నా చేతికిచ్చారు. "మీరు అనేక ధర్మ కార్యాలు నిర్వహిస్తారు. ఉపయోగించండి" అన్నారు. నేను ఆలోచించాను. నేనేమీ అడగలేదు, ఆయన ఇచ్చినందు వలన నేనాయనకు చేయగలిగిన ఉపకారమో, కంపెనీకి ద్రోహమో ఏదీ లేదు. సరే కానిమ్మని పుచ్చుకున్నాను. డబ్బు ఆఫీసు లాకరులోనే పెట్టి స్వామివారి దగ్గరకు వెళ్ళాను. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే స్వామివారు ఆ రోజు నా ముఖము వైపు చుడడం లేదు సరికదా నేను దృష్టిపథానికి నేరుగా నిలుచుంటే ముఖం తిప్పుకుంటున్నారు. డబ్బు పుచ్చుకుని వచ్చానుకదా. నాకు గుండెలో గుబులుగా ఉన్నది. రాత్రి ఎనిమిది అయిఉంటుంది. ఇంతలో సేల్స్ టాక్స్ లో పని చేసే ఒక అధికారి సాంప్రదాయకమైన వేషంతో స్వామివారి వద్దకు వచ్చారు. నమస్కారం చేసి "స్వామి, నన్ను చెక్ పోస్ట్ లో వేసారు. వచ్చిపొయే లారీల వారి వద్ద వసూలు చేసి క్రింది నుంచి పైదాకా పంచవలసి ఉంటుంది. దానిలో నా భాగం నాకు వస్తుంది. ఇది ఒప్పుకోకపోతే ఎదో ఒక ఇబ్బందిలో నన్ను ఇరికించవచ్చు ఎం చేయాలి?" అని ప్రశ్నిచారు.

స్వామివారిప్పుడు ఆయనను చూడటం లేదు. నన్ను చూస్తూ ఆయనను ప్రశ్నిస్తున్నారు.. "నీవేమీ అడగక్కర్లేదా? లారీలవారే స్వయంగా ఇస్తారా"
"పూర్వమే నిర్ణయించినందువలన నేను అడగవలసినదేమి ఉండదు. వారే స్వచ్చందంగా ఇస్తారు" అని అధికారి సమాధానమిచ్చారు.

ఇక స్వామివారు నావంక తిరిగి తీర్పు చెప్తున్నారు. "వారే స్వచ్చందంగా ఇస్తున్నా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించక ఊరికే ఈయరుకదా! వారి దగ్గర చెయ్యిజాచి డబ్బు పుచ్చుకున్నాయన ఎదో ఒక సందర్భంలో నిబంధనలకి వ్యతిరేకంగా వారికి మేలు చెయవలసి వస్తొంది. దానిమూలంగా నీవు ఎందుకు నియమించబడి, ఎందువలన ప్రభుత్వం నుండి జీతం పుచ్చుకుంటున్నావో ఆ ప్రయోజనానికి విఘాతం ఏర్పడుతుంది" ఇప్పుడు ఆయన వంక తిరిగి అంటున్నారు. "మీ కమిషనర్ ని కలువు. నేను కూడా బదిలీ కోసం సిఫారసు చేసాను అని చెప్పి బయటవారితో లావాదేవీలు లేని ఆడిట్ వంటి విభాగాలకు బదిలీ చేయించుకో” అని అన్నారు. 

ఆ అధికారికి ఇంకో సంశయం కలిగింది, "ఇప్పటికే పుచ్చుకున్న ద్రవ్యమేమి చేయాలి?" మళ్ళీ నా వంకకు తిరిగి నేరుగా నా కంట్లోకి చుస్తూ చెబుతున్నారు స్వామివారు. "వీలైతే ఎవరిచ్చారో వారికి తిరిగి ఇచ్చెయ్" అతని వంక చుస్తూ "లేకుంటే ఈ కామేశ్వరుని గుడి హుండీలో వెయ్యి” అన్నారు. 

అంటే మఠ యాజమన్యంలో నడుస్తున్న కామక్షీ దేవాలయానికి కూడా ఆ ద్రవ్యం వద్దన్నమాట. ఆదివారం ఆఫీసు తలుపులు తీయించి డబ్బు తీయించి నేరుగా లారీల యజమాని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి అతనిని తీసుకోమని చెప్పి ప్రాధేయపడాను. అతను ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కాంచీపురం చేరి స్వామివారికి సాస్టాంగంగా నమస్కరించాను. అప్పుడు స్వామివారు నన్ను చిరునవ్వుతో అనుగ్రహిస్తూ చూసారే! ఆ చిరునవ్వు..... అది ప్రసాదించిన తృప్తి వలన ప్రపంచంలోని డబ్బంతా పోగుచేసినా తూగుతుందా!

కుండలి కుమారి కుటిలే చండీ చరాచర సవిత్రి చాముండే
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: