24, నవంబర్ 2022, గురువారం

చండీశ్వరుడు

 🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:

🎻🌹🙏 శివుడు - చండీశ్వరుడు..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.


🌿ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు.


🌸గోవులు, దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.


🌿నీవు ఈ ఆవులను కొట్టవద్దు, 'తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.


🌸బ్రాహ్మణుడు, బ్రహ్మచారి.. వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా... అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.


🌿ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.


🌸వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.


🌿ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.


🌸ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేయదలచాడు.


🌿రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.


🌸అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి, ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.


🌿అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.


🌸చెప్తే..అది విన్న యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టిక్కి కూర్చున్నాడు.


🌿పూర్వకాలం కౄర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.కాసేపయింది,


🌸కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.


🌿తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.


🌸అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.


🌿ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.


🌸తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.


🌿ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయి, క్రిందపడిపోయాడు.


🌸నెత్తుటి ధారలు కారిపోతున్నాయి, కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు.


🌿ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.


🌸మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవవాడవు.


🌿నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే, నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.


🌸ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.


🌿భార్యకొక్క దానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించాడో చూడండి.


🌸పార్వతీ... నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.


🌿ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

కామెంట్‌లు లేవు: