25, అక్టోబర్ 2023, బుధవారం

పరనింద

 *పరనింద..!*

                                ఇతరుల్ని కించపరిస్తే కలిగే నష్టాన్ని ఒక సంస్కృత కవి  ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి…*


*ఒకరోజు లక్ష్మిదేవి వైకుంఠం నుంచి బయలుదేరి     కైలాసంలో   ఉన్న  పార్వతి దేవి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.* 


*లక్ష్మికి  అనుకోకుండా  పార్వతిని                  ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.     "భిక్షార్థీ స క్వ యాతః?” అని చిన్న ప్రశ్న వేసింది. *


*మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది..  కాని లక్ష్మి అలా అనలేదు.   ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. *


*శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి     ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.*


*పార్వతికి    ఈ ప్రశ్న చాలా బాధ కల్గించింది.     ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని    తన భర్తను నిందిస్తే    ఏమాత్రం  సహించలేదు కదా!   కాని ఏంచేస్తుంది.   ఇంటికి వచ్చిన అతిథిని  మందలిస్తే  బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు.  ఏదో సమాధానం చెప్పాలి.  ఏంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది…*

*"సుతను బలిమఖే !"  అంది.*

*'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.*


*ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు.*


*వామనావతారంలో   ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.   'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.*


*లక్ష్మి  కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది.   మళ్లీ   ఏదోవిధంగా పార్వతిని  ఉడికించాలని సమాయత్తమయింది.  రెండో ప్రశ్న వేసింది.*

*’తాండవం క్వాద్య భద్రే!’ అనడిగింది.* 


*అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.*   


*మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం.*


*అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది…*

*మన్యే బృందావనాంతే అంది.* 

*బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని    ఆ మాటలకర్థం.*


*బృందావనంలో  నాట్యం  చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు,  శివుడు కాదు.*  


*'మా  ఆయనే కాదు   మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు'  అని సమాధానం.* 


*పార్వతి సమాధానం ఇంత పదునుగా  ఉంటుందని  లక్ష్మి ఊహించలేదు.  ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది…*


*ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది…*

*’క్వను చ  మృగ శిశుః’ ? అని మరో ప్రశ్న వేసింది.*  


*మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా?  అని అర్థం.* 


*లక్ష్మి  కొడుకు  మన్మథుడు  చాల అందగాడు.   పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు  మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని  అభిప్రాయం.*  


*పార్వతి  చాలా  నొచ్చుకుంది.  కాకిపిల్ల  కాకికి  ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు.*

*పార్వతి  మెదడులో  ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది.   వెంటనే అంది…*

*'నైవ జానే వరాహం' అంది.*

*“ఇక్కడేదో పంది  తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు!" అంది.* 


*’మా  అబ్బాయిది   ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!’  అని పార్వతి  సమాధానం  లోని చమత్కారం.* 


*ఇది  లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది…*


*ఈసారి  జాగ్రత్తగా  తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది…*

*’బాలే!  కచ్చిన్న  దృష్టః  జరఠ వృషపతిః ?’ అనడిగింది.*  


*'మీ వాహనం  అదే   ఆ ముసలి ఎద్దు  ఎక్కడా  కనబడడం లేదేమిటమ్మా?’ అని ప్రశ్న.* 


*'మాది గరుడ వాహనం!  విమానాల్లో  వలే  ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం  ముసలి ఎద్దు.  అది కదల్లేదు మెదల్లేదు'  అని ఆక్షేపం.     మేం పై స్థాయి వాళ్లం,  మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు.*


*ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే  వెంటనే అందుకుంది…*

*"గోప  ఏవాస్య  వేత్తా " అంది.* *'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని  కాసేవాణ్ణి  అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి,  మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.* 


*మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు.  మీకంటే మేమే  ఎక్కువ  అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.*


*నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ.* 


*ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే    ఒక కవి  లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు.*


*ఇందులో నీతి ముఖ్యం గాని,  ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. ‘వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన  సంభాషణ మనందరిని రక్షించుగాక!’ అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి…*


*భిక్షార్థీ స క్వ యాతః? సుతను బలిమఖే తాండవం క్వాద్య భద్రే ?*

*మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశుః? నైవ జానే వరాహం* 

*బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతిః? గోప ఏవాస్య వేత్తా*

*లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయోః త్రాయతాం నః*.

కామెంట్‌లు లేవు: