19, డిసెంబర్ 2023, మంగళవారం

కృష్ణార్పణం

 💐🌾❤️ కృష్ణార్పణం❤️🌾💐


ఒక పేద,అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ కృష్ణార్పణ మనడం మొదలుపెట్టింది.


ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం, పడుకొనే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత..కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ కృష్ణార్పణం అనటమే


ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.


ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీ రోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్ధంకాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడి పై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆ దేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.


రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ కృష్ణార్పణమంది.


మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ...ఆమె కటిక నేల పై పడుకొనే ముందు కృష్ణార్పణమనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.


ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.


అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు.


“మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వ ట్లేదు” అని వాపోయారు.


రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని.


“నాకు తెలియదు” అంది...


“సరే ఏదో మంత్రం చదివావట కదా ?” అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.


సభలోని వారందరూ హతాశులయ్యారు.


ఆమెని “నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?” అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.


సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు.


ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్త పోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టా ను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.


చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.


సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండా రాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.


ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటా రా?!


ఎందుకు ఇంక ఆలస్యం ఒకసారి 'కృష్ణార్పణం' అని అనుకోండి...


*సేకరణ:- శ్రీ ఎ.వి. రామారావు గారి పోస్టు.*

కామెంట్‌లు లేవు: