*ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*
బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు
తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి
శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.
లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.
మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా
పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.
ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.
అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..
నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,
అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు
తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో
*నాన్నగారూ..నాన్నగారూ* అంటూ పిలిచాడు.
సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..
*మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది*
అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..
ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో
ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం
వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో
శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,
శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..
*మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా*
*నియమిస్తున్నాము* అని నియామక పత్రాన్ని
ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు
వాటి వంక చూశాయి..కళ్ళనుంచి
నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.
ఏవో మాటలు వినిపిస్తున్నాయి.
ఏదీ అర్ధం కావడం లేదు.
ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..
*స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?*
అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..
అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.
స్వామి వారి కరుణ లభించింది.ఇక తన
జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో
పది నిముషాల తరువాత....
*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు*
*అనంత వాయువుల్లో కలిసిపోయాయి!*
*అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!*
*ఎవరీ...రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*
శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు
30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు
అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై
చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో
నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ
నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.
ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..
"జో అచ్యుతానంద..జోజో ముకుందా"
అని మనం పాడుకోగలుగుతున్నామంటే..
ఆ కృషికి కారకులు.. *వేటూరి ప్రభాకర శాస్త్రి*
*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!*
ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..
అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్
కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..
*సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.*
*రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం*
*అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను*
*జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి*
*ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన*
*సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.*
*కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.*
*ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది!* అన్నారు.
పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి
ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..
*ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని*
*ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,*
*శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం*
*అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!*
డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.
*సర్! అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని* *నియమించి, ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే*
*బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. అవసరమైతే*
*మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు*
అన్నాడు..
అయినా ప్రసాద్ గారు వినలేదు.
*వెంటనే నేను చెప్పినట్లు చేయండి!* అన్నారు!
అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.
అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు
పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు
క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.
దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..
ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన
స్వర్గస్థులవడం జరిగిపోయాయి!
టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం
సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి
ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.
*ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం. రూల్స్ కు విరుద్ధం* అన్నాడో సభ్యుడు.
*మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి ఇక బోర్డు ఎందుకు?* అన్నారు మరొకరు.
ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో
అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.
ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!
*స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ యాత్రికుడి వరకూ అందరూ *సమానం. ఆయన సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.*
*ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని*
*జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్*
*గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు*
*పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.*
*ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.*
*రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం*
*అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు*
*కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!*
*ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను!*
అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి
తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,
ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో
ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత
నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో
ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే
కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!
*(నాహం కర్తా హరిః కర్తా నుంచీ...వేంకటేశ్వరార్పణమ్)*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి