23, సెప్టెంబర్ 2025, మంగళవారం

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*

 *ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*



బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు

తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.

లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.

మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా

పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.

ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.

అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..

నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,

అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు

తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో

*నాన్నగారూ..నాన్నగారూ* అంటూ పిలిచాడు.

సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..

*మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది*

అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..

ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో

ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం

వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో

శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,

శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..


*మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా*

*నియమిస్తున్నాము* అని నియామక పత్రాన్ని

ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు

వాటి వంక చూశాయి..కళ్ళనుంచి

నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.

ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఏదీ అర్ధం కావడం లేదు.

ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..


*స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?*

అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..

అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.

స్వామి వారి కరుణ లభించింది.ఇక తన

జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో

పది నిముషాల తరువాత....

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు*

*అనంత వాయువుల్లో కలిసిపోయాయి!*

*అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!*


*ఎవరీ...రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*


శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు

30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు

అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై

చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో

నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ

నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.

ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..

"జో అచ్యుతానంద..జోజో ముకుందా"

అని మనం పాడుకోగలుగుతున్నామంటే..

ఆ కృషికి కారకులు.. *వేటూరి ప్రభాకర శాస్త్రి* 

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!*


ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..

అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్

కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..

*సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.*

*రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం*

*అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను*

*జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి*

*ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన*

*సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.*

*కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.*

*ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది!* అన్నారు.


పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి

ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..

*ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని*

*ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,*

*శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం*

*అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!*

డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.

*సర్! అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని* *నియమించి, ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే*

*బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. అవసరమైతే*

*మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు*

అన్నాడు..


అయినా ప్రసాద్ గారు వినలేదు.

*వెంటనే నేను చెప్పినట్లు చేయండి!* అన్నారు!

అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.

అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు

పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు

క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.

దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..

ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన

స్వర్గస్థులవడం జరిగిపోయాయి!


టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం

సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి

ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

*ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం. రూల్స్ కు విరుద్ధం* అన్నాడో సభ్యుడు.

*మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి ఇక బోర్డు ఎందుకు?* అన్నారు మరొకరు.

ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో

అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.

ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!

*స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ యాత్రికుడి వరకూ అందరూ *సమానం. ఆయన సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.*

*ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని*

*జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్*

*గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు*

*పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.*


*ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.*

*రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం*

*అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు*

*కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!*

*ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను!*

అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి

తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.


ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,

ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో

ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత

నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో

ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే

కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!


*(నాహం కర్తా హరిః కర్తా నుంచీ...వేంకటేశ్వరార్పణమ్)*

కామెంట్‌లు లేవు: