సాధనకు సమయం
చాలామంది సాధకులు చెప్పేది ఏమిటంటే నాకు సాధనకు సమయం దొరకటం లేదు. నిజంగా ఇది వినటానికి వింతగా వున్నా ఇది నిజం. మీకు ఎందుకు సమయం దొరకడంలేదు అని అడిగితె వాళ్ళు చెప్పే సమాదానాలు. నాకు ఆఫీసులో పని వత్తిడిగా వుంది. ఇంట్లో నాభార్య నాకు అనుకూలంగా లేదు కాబట్టి నా మనస్సు ఎప్పుడు చికాగుగా వుంటున్నది. దేనిమీద మనస్సు నిలవటం లేదు. నిజానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు మరి ఎలా సాధన చేయాలి. అని అనేక సాకులు చెపుతువుంటారు. యదార్ధానికి ఇవి ఏవి కూడా సాధనకు అవాంతరాలు కావు వారికి సాధన చేయాలని ఉంటే సమయం అదే దొరుకుతుంది.
మీరు రోజు టీ కాఫీ తాగుతున్నారా అయ్యో టీ తాగకుంటే నాకు వెంటనే తలకాయ నొప్పి పుడుతుంది. కాబట్టి సమయానికి నాకు టీ కావలసిందే. మీరు రోజు ఫలహారాలు తింటున్నారా అంటే నాకు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. రోజు ఒకటే తినాలంటే నాకు ఇష్టముండదు. అంటారు. మరి భోజనం సంగతి అంటే ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుగా అని హాస్యం చేస్తాడు. సమయానికి భోజనం చేస్తాను అందుకే ఇంతమాత్రం ఆరోగ్యంగా వున్నాను అని అంటారు. నీ దైనందిక జీవితంలో ప్రతిదానికి నీకు సమయం దొరుకుతుంది మరి సాధనకు ఎందుకు సమయం కేటాయించలేక పోతున్నావు? నీ దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. చాలా సంతోషం మరి నీకు ఈ దేహాన్ని ఇచ్చిన ఆ భగవంతునికి సాధన చేయటానికి సమయాన్ని ఎందుకు కేటాయించలేక పోతున్నావు?
నిజానికి నీకు చిత్త శుద్ధి ఉంటే నీ దైనందిక జీవితంలో సాధనను కూడా ఒకటిగా చేసుకుంటావు. ఆలా చేసుకొని చూసుకో. తప్పకుండ నీకు సాధనకు సమయం చేకూరుతుంది. ప్రతి సాధకుడు తన దైనందిక జీవితంలో సాదనను కూడా ఒక భాగంగా చేసుకోవాలి, అప్పుడే సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తెలివిగా ప్రతి వక్కరు వారి దైనందిక జీవితాన్ని ఒక ప్రణాళికా బద్దంగా రూపుదిద్దుకుంటే తప్పకుండ సాధన నిరంతరాయంగా కొనసాగుతుంది.
84 లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషునితో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయి. వారి శరీరం సున్నితము, సుకుమారంగా వుండి వుంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞ్యానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీలకన్నా పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యంతో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) మానవ జీవితం అశాశ్వితం అంటే ఏ క్షణంలోనయినా పిలుపు రావచ్చు. మీరు నేను అనుకునేది ఈ దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య ఏ క్షణంలో నయినా అది రాలిపోవచ్చు అది కేవలం ఆ ఈశ్వరునికే ఎరుక. మనం మన అజ్ఞానానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తా అని ఐహికమైన వాంఛలమీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాం. జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మసార్ధకం చేసుకోవాలని యోచించాలి . అదే మనకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సువర్ణావకాశం. ఈ అవకాశం కనుక సరిగా వినియోగించుకోక పొతే మరల ఎన్ని జన్మలకు తిరిగి ఈ అవకాశం వస్తుంది. తిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలలో ఒకటి అంటే మీరే ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగవిలాసాలతో ఈ అపురూపమైన మానవ జన్మను వృధాచేస్తే చివరకు మనకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూవుండటమే. కాబట్టి సాధకుడు మేల్కొని నిత్యము శాశ్వితము అయిన మోక్షపదాన్ని చేరుకోవటానికి అహర్నిశలు కృషిచేయాలి.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ ఒక్కటి మాత్రం సంపూర్ణంగా నిజము దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది ముమ్మాటికీ నిజం మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడిమీదకు వెళ్ళదు. అందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారు. నిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుంది. కానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి ఆ దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం.
దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే మొదటిది భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోవది నేను సదా నీ సేవ చేయటానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు ఇవ్వు. మీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరు. మోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే ఈ జ్ఞ్యాన మార్గాన్ని ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞానమే జ్ఞానం అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి