10, జనవరి 2021, ఆదివారం

త్వమేవాహమ్‌



*త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి, పుడమితల్లి కడుపులోకిచేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే *నేను*


ఈ *నేను* ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు


ఊపిరి ఉన్నంతదాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది


 జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది


*ఈ *నేను* లోంచే*నాది* అనే భావన పుడుతుంది!


ఈ *నాది* లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా

ప్రజ్వరిల్లుతుంది

 *అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుందిపంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీసిద్ధపడుతుంది


బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్ప కూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచినవిగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*


**నేనే* శాసన కర్తను, *నేనే* ఈభూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.


ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్త మవుతుంది.


అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత!

కామెంట్‌లు లేవు: