26, జులై 2023, బుధవారం

పండితుని తెలివి*

 *పండితుని తెలివి*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏


చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు. ఆ పండితుడు రాజుకు  ఒక "ఘనపనస" చదివి ఆశీర్వదించాడు.


అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.


అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.


రాజు గారు “ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం!” అన్నాడు.  కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగాచెప్పుకోవచ్చు"  అంటూ సున్నితంగా తిరస్కరించాడు.


"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేరుస్తాను. చెప్పు!" అన్నాడు రాజుగారు.


“మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -

.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.


రాజు “సరే !” అని ఆ పని మంత్రికి పురమాయించాడు. ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.


తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా.. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..

‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి.. ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..” అన్నాడు


“అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. “


“ఎందుచేత..” అన్నాడు రాజుగారు.


“లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!”


“ఎందుకు..” ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు.


“ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా !  అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.”


“అలాగా.. ఏమిటా పద్యం..”


“ఇదుగో.. వినండి మహారాజా !”


“శర శశి షట్క చంద్ర శర సాయక

రంధ్ర వియత్ నగాగ్ని భూ

ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి

పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు

నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు

రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్”


పద్యం విన్న మహారాజు “దీన్లో తేలిన లెక్కెక్కడుంది.. అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం,అంబుధి, కొండలు తప్ప..”


“అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..”


“సరే… సరే.. విప్పి చెప్పు..”


 “ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..”


ఈ పద్యంలో…


శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని .(మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి. 


గగన, వియత్ - 0

(ఆకాశం గగనం శూన్యం)


శశి, చంద్ర, తుహినాంశు -1 

(చంద్రుడొకడే భూమికి )


షట్కము - 6 


రంధ్ర - 9  

(నవరంధ్రాలు)


నగ, గిరి, భూధర - 7 


అగ్ని - 3 

(మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)


అబ్ధి, పయోనిధి - 4 


వేద -4

(చతుర్వేదములు)


తర్క - 6

( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)


పద్మజాస్య - 4 

(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)


కుంజర - 8

(అష్ట దిగ్గజములు)


ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’


శర శశి షట్క  చంద్ర శర

5     1     6         1    5

 సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ

        5       9        0         7       3

ధర గగనాబ్ధి  వేద  గిరి

  7     0  4      4    7

తర్క పయోనిధి పద్మజాస్య 

  6           4           4     

కుంజర తుహినాంశు 

  8          1

సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి

స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


అంకెలు లెక్కించేటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -

కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..


అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.


1,84,46,74,40,73,70,95,51,615


ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615.


ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే, ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘన కిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..


పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్న దూరానికి రెట్టింపు.


పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సంవత్సరాలు..

అదీ సంగతి…!


వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…


నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు, ధారణ శక్తికి సంబంధించినదే ! 

ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘనాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం, మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .


అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరూ కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు. ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవాలో ఆ పండితుణ్ణే అడుగుదాము. అని ఆ పండితుని పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు.


ఆ పండితుడు "రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా ఆవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.


*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏

కామెంట్‌లు లేవు: