13, సెప్టెంబర్ 2023, బుధవారం

రామాయణమ్ 323

 రామాయణమ్ 323

...

జాంబవంతునకు ,అంగదునకు నమస్కరించి "చూశాను సీతమ్మను" అని పలికెను.

.

అప్పుడు అంగదుడు తనచేతిలో చేయి వేసుకొని తీసుకొని వెళ్ళి హనుమను ఒక రమణీయమైన ప్రదేశమున కూర్చుండబెట్టెను.

.

చూశాను సీతమ్మను ,     స్నాన సంధ్యాదులు లేక మలిన వస్త్రముతో తైలసంస్కారములు లేని కేశపాశములతో ఏకవేణియై రామదర్శనముకొరకు తహతహలాడు సీతమ్మను చూశాను .

.

ఘోర రక్కసుల కావలిలో 

చిక్కిశల్యమైన సీతమ్మను చూశాను.

.

చూశాను అని చెప్పగానే కొందరు వానరులు సింహనాదములు చేశారు ,మరికొందరు కిచకిచలాడారు ,

మరికొందరుచకచక ప్రతిగర్జనలు చేశారు.

.

మరికొందరు దగ్గరగా వచ్చిపర్వతాకారుడైన పావని శరీరాన్ని స్పృశించారు.

.

అప్పుడు జాంబవంతుడు వివరముగా చెప్పమని కోరగా జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు మారుతి ...ఒక్క విషయము తప్ప ...అది రామునకు సీతమ్మ పంపిన సందేశము...

.

తాతా ! 

ఇటనుండి పయనమై వెళ్ళు నాకు మైనాకుడు కనపడి కాసేపు సేదతీరి వెళ్ళమన్నాడు ! ఆతని కోరిక మన్నింపక ముందుకు సాగుతున్న నన్ను ...

నాగమాత సురస 

నాగమనాన్ని అడ్డుకొని విధాత ఇచ్చిన విందుభోజనము నీవు! నిన్ను మింగుతాను! అని ముందుకు రాగా ఉపాయముతో తప్పించుకొని ఆమెను మెప్పించి ముందుకు వెళుతుండగా !...

.

పట్టి లాగింది సింహిక, దానిని చంపి వేసి లంక కోట మీద అడుగుపెట్టిన నాకు లంకిణి అడ్డు వచ్చినది....దాని పీచమణచి లంకలో ప్రవేశించి లంక మొత్తము జల్లెడ పట్టినా ఫలితము లేకపోయె!

.

అప్పుడు ఇక మిగిలిన అశోకమునందు గాలించవలెనని అనుకొని అటు వెడలి చూడగా అట కనుగొంటినయ్యా తల్లి సీతను !

.

ఇంతలో రాక్షశేశ్వరుడు వచ్చి ఆమెతో పరుషముగా మాటలాడి రెండుమాసములు గడువొసంగినాడు....అని హనుమ జాంబవదాదులకు చెప్పసాగెను

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: