9, డిసెంబర్ 2023, శనివారం

*కార్తిక పురాణము - 27*

 *కార్తిక పురాణము - 27*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము -ఇరవై ఏడవ అధ్యాయము*


ఓ అగస్త్య మునీంద్రా! భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిసహాయమును బ్రకటించుచు భగవంతుడిట్లు పల్కెను.


దుర్వాసా! అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును కలగ చేయుచున్నవి.ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టము లేదు.నీ వచనము వేదతుల్యము గనుక దానిని సత్యముగా చేయవలెను.అట్లుగాని యెడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును.అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగును గాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది.రాజు ప్రాయోపవిష్టుడు వలే బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు. అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు.కాబట్టి త్వరగా పొమ్ము.రాజు యీ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు.నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది.ఛీ!ఛీ! బ్రాహ్మణోపద్రపకారకుడయిన రాజు ఎందుకు?రాజు మనుష్యులను పాలించువాడు గనుకను, రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను, రాజు గోవుల నిమిత్తము కొరకును, బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను.రాజు స్వేదజ, అండజ, ఉద్బుజ, జరాయుజములను నాలుగు విధములగు జీవములను సర్మార్గమందుంచి పాలించవలెను.


అందులో అందరికి దండనము ఈయదగును.పాలించవలెను.బ్రాహ్మణులను విడువవలెను. బ్రాహ్మణుని సత్య ధర్మరతులును, లోభ దంభ శూన్యులును అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలెను.బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసికొనని పక్షమందు అతని తల గొరిగించుట, ధనమును హరించుట, స్థాన భ్రష్టత్వము మొదలయిన దండనముల చేత దండించవలెను.బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు.రాజు ధర్మార్ధ బుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శాస్త్ర ప్రయోగము ఆచరించదగదు.


బ్రాహ్మణేతరులందరూ భయములేక క్షాత్ర కీర్తిని చూపవలయును గాని బ్రాహ్మణ హింసమాత్రము చేయగూడదు. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినాను, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినాడు, అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది.బ్రాహ్మణుడు లాగబడిగాని, కొట్టబడి గాని, ధనహీనుడుగా చేయబడి గాని, ఎవని ఉద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మ హంతకుడగును.


దుర్వాసునకు ప్రాణ హానికరమైన కష్టము నామూలముగా గలిగెను గదా?కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలచుచున్నాడు.దుర్వాసా! అంబరీషుడీ ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో నున్నాడు.కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము. నీకును రాజునకును కుశలమగును.


ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను.ఇట్లు సూర్యకాంతితో వచ్చుచున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పల్కెను. ఓ చక్రమా! నన్ను మన్నించుము.ఆర్తుని సంహరించుట న్యాయము గాదు.గనుక బ్రాహ్మణుని రక్షించుము.అతి క్రౌర్యముతో హింసించుట తగదు.రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము.అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాసుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లనియెను.


ఇతి శ్రీస్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే సప్తవింశాధ్యాయసమాప్తః!

కామెంట్‌లు లేవు: