28, ఫిబ్రవరి 2024, బుధవారం

జాతీయ విజ్ఞాన దినోత్సవం

 *నేడు జాతీయ విజ్ఞాన దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)*


1986 లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC- National Council for Science and Technology Communication) ఫిబ్రవరి 28 ను జాతీయ విజ్ఞాన దినోత్సవం (National Science Day) గా ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. భారతదేశం 1986 లో ఈ రోజును జాతీయ విజ్ఞాన దినంగా అంగీకరించింది మరియు ప్రకటించింది.


 *ఫిబ్రవరి 28 నే ఎందుకు?* 


చంద్రశేఖర్ వెంకటరామన్ (CV Raman)  *'రామన్‌ ఎఫెక్ట్‌'*  కనుగొన్న (పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన) రోజైన ఫిబ్రవరి 28 (1928) జ్ఞాపకార్థం జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.


 *రామన్ ప్రభావం (Raman Effect):* 


సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ప్రభావం *(Raman scattering or Raman effect)* అంటారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుంది. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

కామెంట్‌లు లేవు: