10, ఏప్రిల్ 2025, గురువారం

పోతన భాగవత పద్యం

 🙏పోతన భాగవత పద్యం🙏

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే

సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.

ఈ పద్యం గురించి కొంత వివాదం ఉన్నమాట నిజమే. ఎందుకంటే బమ్మెర పోతరాజొకఁడు అని ప్రథమ పురుషలో ఉన్నది. పోతన గారు ఈ విధంగా ప్రథమ పురుషలో వ్రాసిన పద్యం అసలు లేదు. పోతన గారు నిజంగా ఈ పద్యం వ్రాస్తే ఉత్తమ పురుషలో చెప్పుకుంటాడు గాని ప్రథమ పురుషలో చెప్పడు అలా చెప్పడం పోతన స్వభావం కాదు పద్యలో అహంకారం కనబడుతోంది పోతన గారు వినయ సంపన్నుడు ఆయనే ఈ పద్యం వ్రాసి ఉంటే బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్ అని అనడు. తరువాత కవులు ఎవరో వ్రాసి ఆయన భాగవతలో చేర్చి ఉంటారు అని కొంతమంది విమర్శల అభిప్రాయం.

టీక:- ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = మేలు సమకూరునట్లుగా.

భావము:- విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: