🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🪷గురువారం 10 ఏప్రిల్ 2025🪷*
*రామాయణం*
ఒకసారి చదివినంత మాత్రాన
మన సమస్త పాపాలని తీసేస్తుంది.
*వాల్మీకి రామాయణం*
*4 వ భాగం*
అలా కొంత కాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.... “అయ్యా! నేను సంతానహీనుడిని, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో, ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేథ యాగాన్ని మీరు నాతో చేయించాలి” అని కాళ్ళు పట్టి ప్రార్ధించాడు.
అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు... “యాగం చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు, లోకముచేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు.
చైత్ర మాసంలో చిత్తా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి, దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది, దాని వెనకాల మహా శూరులైన వాళ్ళు వెళతారు. ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను,విద్వాంసులను ఆహ్వానించాడు.
“వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. పల్లెటూర్లనుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి” అని వశిష్ఠుడు చెప్పాడు.
*సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః ।*
*న చ అవజ్ఞా ప్రయోక్తవ్యా కామ క్రోధ వశాత్ అపి॥*```
“పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనరాని మాటలు మాట్లాడితే, మీరు నవ్వి వచ్చెయ్యండి, పట్టించుకోకండి. భోజనం చెయ్యడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిధి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు, కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు” అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు.
అలాగే జనక మహారాజు, కాశీ రాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి, “అందరికి విడిది ఏర్పాటుచెయ్యండి” అని ఆదేశించాడు.
అలా వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెడుతున్నారు...```
*వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ ।*
*అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే ॥*```
అక్కడికి వచ్చినవాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు,స్త్రీలు,చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా, “ఆహా! భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి” అని అంటున్నారు. “ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో” అని అనుకుంటున్నారు.
దశరథ మహారాజు వాళ్ళందరిని చూసి, “ఇంకా తినండి, ఇంకా తినండి” అంటున్నాడు.
వచ్చిన వాళ్ళందరికి ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథుడు.
వచ్చినవాళ్ళందరూ “ఆహా! ఎంతచక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి, నీకు సుపుత్రులు కలిగి, నీ వంశము ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు.
ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు, ఆ యాగశాలలొ 21 యూప స్తంభాలని పాతారు, మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, ఛండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక, దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతోంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య మూడు కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి.
మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి, రాజు 4 భార్యలని దానం చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని(ధనం) దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలోనుంచి వప(జంతువుల కడుపులో బొడ్డు కింద వుండే ఉల్లిపొర వంటి కొవ్వు) ని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి, దీనినే అశ్వమేథయాగం అంటారు. అలా పీలిస్తే, తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో, ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు.
దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేథయాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు,
అప్పుడు వాళ్ళు “మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి” అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు.
దక్షిణలేని యాగం జరగకూడదు కనుక, దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానం చేశాడు.
అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణాలని దానం చేశాడు.
ఋష్యశృంగ మహర్షి లేచి.... “ఓ రాజా! నీకు సంతానం కలగడం కోసం, నేను అధర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన యిష్టిని చేయిస్తాను. అదే
*పుత్రకామేష్టి యాగం* అని చెప్పి ఆ యిష్టి చెయ్యడం ప్రారంభించారు.```
*తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః ।*
*భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ॥*```
ఆ యిష్టి జరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్లి, “పితామహా! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు...```
*నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః ।*
*చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ॥*```
రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు.
అప్పుడు బ్రహ్మగారు “నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు” అని అన్నారు.
అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు.
ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు...```
*ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః ।*
*శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః ॥*```
ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో, అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖు చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు.
```
*హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం।*
*దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ॥*```
*వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం।*```
*ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్॥*```
“మీరెవరూ కంగారు పడొద్దు, రావణుడు చేసే అకృత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను” అని భగవానుడు అన్నాడు.```
*తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం ।*
*పితరం రోచయామాస తదా దశరథం నృపం ॥*```
“నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను” అని ప్రతిజ్ఞ చేశారు.
అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతోంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి “నేను మీకు ఏమిచెయ్యగలను?” అన్నాడు.
అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు… “నాయనా దశరథా! నన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు.
యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు.
కొంత కాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు.
*రేపు...5వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏ub*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి