28, ఆగస్టు 2025, గురువారం

జగన్నాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1217


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం



💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.



💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.



🔆 స్థలపురాణo 


💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.

అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.

అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. 

అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.

అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.


💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. 

కానీ అలా నదీతీరంలో 

లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. 


💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. 

కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. 


💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. 

అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.


💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం


💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . 

ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.


🔆 రథయాత్ర


💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. 

ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. 


💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... 

పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. 


💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!


💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. 


💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. 

అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.


💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.

ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.


💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 

బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. 

సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.


💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు. 

ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.


💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు. 

అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.

పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. 



రచన

©️ Santosh kumar

కామెంట్‌లు లేవు: