24, జులై 2020, శుక్రవారం

*మొసలి గజేంద్రుని పట్టుకొనుట*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - రెండవ అధ్యాయము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

*2.10 (పదియవ శ్లోకము)*

*సర్వతోఽలంకృతం దివ్యైర్నిత్యం పుష్పఫలద్రుమైః|*

*థమందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః॥6368॥*

*2.11 (పదకొండవ శ్లోకము)*

*చూతైః ప్రియాలైః పనసైరామ్రైరామ్రాతకైరపి|*

*క్రముకైర్నాలికేరైశ్చ ఖర్జూరైర్బీజపూరకైః॥6369॥*

*2.12 (పండ్రెండవ శ్లోకము)*

*మధూకైః శాలతాలైశ్చ తమాలైరసనార్జునైః|*

*అరిష్టోదుంబరప్లక్షైర్వటైః కింశుకచందనైః॥6377॥*

*2.13 (పదమూడవ శ్లోకము)*

*పిచుమందైః కోవిదారైః సరలైః సురదారుభిః|*

*ద్రాక్షేక్షురంభాజంబూభిర్బదర్యక్షాభయామలైః॥6371॥*

*2.14 (పదునాలుగవ శ్లోకము)*

*బిల్వైః కపిత్థైర్జంబీరైర్వృతో భల్లాతకాదిభిః|*

*తస్మిన్ సరః సువిపులం లసత్కాంచనపంకజమ్॥6372॥*

ఆ పర్వతముపై మందారములు, పారిజాతములు, కలిగొట్టుచెట్లు, అశోకవృక్షములు, సంపంగిచెట్లు, పలువిధములైన మామిడిచెట్లు, వివిధములగు ద్రాక్ష మొక్కలు, పనసచెట్లు, అంబాలపుచెట్లు, పోకచెట్లు, కొబ్బరిచెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీఫల వృక్షములు, ఇప్ప, మద్ది, తాటి, ఉలిమిరి, వేగిస, ఏఱుమద్ది, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మారేడు, గంధపు చెట్లు, వేము చెట్లు, రక్తకాంచన వృక్షములు, తెల్ల తెగడ, దేవదారు, చెరుకు మొక్కలు, అరటి, నేరేడు, రేగు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, మానేరు, వెలగ, నిమ్మ, జీడి, మామిడి మొదలగు చెట్లు గలవు. ఆ  ఉద్యానములో సువిశాలమైన సరస్సుగలదు. అందులో బంగారురంగులో ప్రకాశించెడు పద్మములు గలవు.

*2.15 (పదునైదవ శ్లోకము)*

*కుముదోత్పలకహ్లారశతపత్రశ్రియోర్జితమ్|*

*మత్తషట్పదనిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనైః॥6373॥*

*2.16 (పదహారవ శ్లోకము)*

*హంసకారండవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి|*

*జలకుక్కుటకోయష్టిదాత్యూహకులకూజితమ్॥6374॥*

*2.17 (పదిహేడవ శ్లోకము*

*మత్స్యకచ్ఛపసంచారచలత్పద్మరజఃపయః|*

*కదంబవేతసనలనీపవంజులకైర్వృతమ్॥6375॥*

ఆ సరస్సు తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగల్వలు, తామరపువ్వులు శోభతో కనువిందు గావించుచుండెను. అవి పక్షుల మధుర స్వనములతో మత్తెక్కిన తుమ్మెదల యొక్క ఝంకారములతో ప్రతిధ్వనించుచుండెను. ఆ సరస్సు హంసలు, కారండవ పక్షులు, జక్కవ, బెగ్గురు పక్షులతో నిండి చూడముచ్చట గొల్పుచుండెను. నీటికోళ్ళు, గ్రుడ్డి కొంగలు, భరత పక్షుల గుంపులు మొదలగు వాటి కూజితములు వినసొంపుగా ఉండెను. చేపలు, తాబేళ్ళు అటునిటు సంచరించుచుండెను. పద్మముల పుప్పొడులతో ఆ సరోవర జలములు దాని శోభలను ఇనుమడింప జేయు చుండెను. కడిమి చెట్లు, నీటి ప్రబ్బలిచెట్లు, కిక్కసిగడ్డి, మంకెనచెట్లు, పినాకచెట్లతో ఆ సరస్సు పరివృతమై యుండెను.

*2.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*కుందైః కురబకాశోకైః శిరీషైః కుటజేంగుదైః|*

*కుబ్జకైః స్వర్ణయూథీభిర్నాగపున్నాగజాతిభిః॥6376॥*

*2.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*మల్లికాశతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః|*

*శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః ॥6378॥*

ఆ సరస్సు తీరము నందు గన్నేరు, గోరంట, కంకేళి (అశోక), దిరిసెన, అవిసె, గార, ఉత్తరేణు, ఎర్ర టెంకాయ, అడవిమొల్ల, పొన్న, సురపొన్న, ఉసిరిక, గురువింద, అరటి మొదలగు చెట్లతో, మల్లెతీగలు, తామరమొక్కలతో అది శోభిల్లుచుండెను. ఆ చెట్లు అన్ని ఋతువులలో పూవులతో, ఫలములతో అలరారుచుండెను.

*2.20 (ఇరువదియవ శ్లోకము)*

*తత్రైకదా తద్గిరికాననాశ్రయః  కరేణుభిర్వారణయూథపశ్చరన్|*

*సకంటకాన్ కీచకవేణువేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్ వనస్పతీన్॥6378॥*

ఆ పర్వతమునందలి అడవులలో పెక్కు ఆడ ఏనుగులతో గూడి ఒక గజేంద్రుడు నివసించుచుండెను. అది గొప్ప శక్తిమంతములైన ఏనుగుల నాయకుడు. ఆ మత్తగజము ఒకనాడు ఆ పర్వతముపై ఆడ ఏనుగులతో విహరించు చుండెను. అది ముళ్ళ చెట్లను, సువిశాలమైన వెదురు, వేము డొంకలను ఛిన్నాభిన్న మొనర్చుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: