14, ఆగస్టు 2020, శుక్రవారం

పాత పద్యం క్రొత్త అర్ధం పరమార్ధం

ఓయమ్మ, నీకు, మారుడు,
మాయిండ్లను పాలు; పెరుగు; మన, నీడమ్మా,
పోయెద మెచ్చటి కైనను?
మాయన్నల, సురభు, లాన! మఞ్జులవాణీ!

పద విభాగంతో అర్థం ఎంతగా మారిందో ఒక పండితుడు  చెప్పాడు...(ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఉన్నది..)

ఆ కృష్ణ భక్తులకు భగవంతుని స్తుతించుటే గాని ఆయనను వదిలి ఎక్కడికి పోగలము? అంటున్నారు.

మారుడు అంటే మన్మధుడు. ఆ మహనీయుడు నీకు మన్మధుడు. విష్ణుమూర్తి కుమారుడే కదా మన్మధుడు! ఆత్మావై పుత్ర నామాసి అని కదా, అంత అందమైన మహావిష్ణువు నీకు మన్మధాకారంగా కనిపిస్తాడు కనుక మన్మధుడే. మాకు ఆయన మా ఇండ్లలో భాగం(పాలు). ఇండ్లు అంటే దేహాలు. ఆ పరమాత్మ మా దేహాలలో అంతర్యామి గా మా లోని భాగమే. ఆవిధంగా మా లోనే ఆయన పెరుగుచుండును.  అంటే భక్తి, ఏకత్వం పెరుగుతున్నది.
ఆయన మన, నీడయే నమ్మా!(మన,నీడమ్మా-- మననీడమ్మా). మన తోడునీడ అనే భావం.

ఆయనను వెతుక్కుంటూ ఎక్కడికైనా పోగలమా? భగవంతుడు మా అంతరాత్మ అయి మాలో భాగంగా ఉంటూ, మా లోనే పెరుగుతూ ఉంటే బాహ్యంగా భగవంతుని వెతుక్కుంటూ ఎక్కడికైనా  వెళ్ళగలమా?
ఈ మాటలు నిజం.  మా అన్నల మీద ఒట్టు, మా గోమాతల మీద ఒట్టు. అంటున్నారు.
మామూలు అర్థానికన్నా నిగూఢార్థమే సబబుగా ఉన్నట్లున్నది.
చూచే వాడి చూపును బట్టే ఉంటుంది ప్రతి వస్తువు.. ప్రతి శబ్దానికి భావం కూడా.. అని అనిపిస్తుంది...

నందనవనం కోటేశ్వరరావు.


కామెంట్‌లు లేవు: