14, ఆగస్టు 2020, శుక్రవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదకొండవ అధ్యాయము*

*దేవాసుర సంగ్రామము సమాప్తమగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తదాపతద్గగనతలే మహాజవం   విచిచ్ఛిదే హరిరిషుభిః సహస్రధా|*

*తమాహనన్నృప కులిశేన కంధరే రుషాన్వితస్త్రిదశపతిః శిరో హరన్॥6648॥*

ఆ శూలము మిక్కిలి వేగముగా వచ్చుచుండుటను ఇంద్రుడు గమనించెను. అప్పుడు అతడు దానిని ఆకాశమునందు ఉండగనే వేయి ముక్కలు గావించెను. అనంతరము ఇంద్రుడు క్రుద్ధుడై, వజ్రాయుధముతో అసురుని శిరస్సును ఖండించుటకై అతని కంఠముపై కొట్టెను.

*11.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*న తస్య హి త్వచమపి వజ్ర ఊర్జితో బిభేద యః సురపతినౌజసేరితః|*

*తదద్భుతం పరమతివీర్యవృత్రభిత్తిరస్కృతో నముచిశిరోధరత్వచా॥6649॥*

ఇంద్రుడు బలముగా నముచిపై తన వజ్రాయుధమును ప్రయోగించెను. కాని శక్తిమంతమైన ఆ వజ్రాయుధము ఆ అసురుని చర్మమును గూడ భేదింపలేకపోయెను. మహాబలవంతుడైన వృత్రాసురుని శరీరమును ముక్కలుగ జేసిన వజ్రాయుధము నముచి యొక్క కంఠమునందలి చర్మమును భేదింపలేక పోవుట మిగుల ఆశ్చర్యకరము అయ్యెను.

*11.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*తస్మాదింద్రోఽబిభేచ్ఛత్రోర్వజ్రః ప్రతిహతో యతః|*

*కిమిదం దైవయోగేన భూతం లోకవిమోహనమ్॥6650॥*

వజ్రాయుధము నముచిని ఏమియు చేయలేక పోవుటచే ఇంద్రుడు కలవరపడి ఇట్లు అనుకొనసాగెను- "జగత్తును అంతయును మోహములో పడవేయునట్టి ఈ సంఘటన ఎట్లు జరిగినది. ఇది దైవయోగము తప్ప మరేమియును గాదు.

*11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*యేన మే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే|*

*కృతో నివిశతాం భారైః పతత్త్రైః పతతాం భువి॥6651॥*

పూర్వము పర్వతములు రెక్కలు గలిగి యుండెను. అవి ఆకాశమున తిరుగుచు బరువు కారణముగా భూమిపై పడుచుండెను. పర్వతములు భూమిపై పడుచుండుటవలన ప్రజలు నశించుచుండిరి. దానిని జూచి, ప్రజారక్షణకై వజ్రాయుధముచే పర్వతముల రెక్కలను నేను ఖండించితిని.

*11.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*తపఃసారమయం త్వాష్ట్రం వృత్రో యేన విపాటితః|*

*అన్యే చాపి బలోపేతాః సర్వాస్త్రైరక్షతత్వచః॥6652॥*

*11.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*సోఽయం ప్రతిహతో వజ్రో మయా ముక్తోఽసురేఽల్పకే|*

*నాహం తదాదదే దండం బ్రహ్మతేజోఽప్యకారణమ్॥6653॥*

త్వష్ట అనువాడు తన తపఃప్రభావమున వృత్రాసుర రూపములో ప్రకటితుడాయెను. అతనిని గూడ నేను ఈ వజ్రాయుధముతోనే ఖండించితిని. ఇంకను మహాబలశాలులు. ఏ అస్త్రశస్త్రములకు లొంగని జంభాసురుడు, బలాసురుడు మొదలగు రాక్షసులను ఈ వజ్రాయుధము తోనే హతమార్చితిని. అట్టి అప్రతిహతమైన ఈ వజ్రాయుధము నేను తుచ్ఛుడైన ఈ అల్పునిపై ప్రయోగించితిని. కాని, అది ఇతనిని ఏమియు చేయలేకపోయెను. బ్రహ్మతేజస్సుచే నిర్మితమైన ఈ వజ్రాయుధము శక్తిహీనము అగుటకు గల కారణము నాకు బోధపడుట లేదు.

*11.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*ఇతి శక్రం విషీదంతమాహ వాగశరీరిణీ|*

*నాయం శుష్కైరథో నార్ద్రైర్వధమర్హతి దానవః॥6654॥*

*11.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*మయాస్మై యద్వరో దత్తో మృత్యుర్నైవార్ద్రశుష్కయోః|*

*అతోఽన్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్ రిపోః॥6655॥*

ఇట్లు అనుకొనుచు ఇంద్రుడు మనస్తాపము చెందెను. అప్పుడు ఆకాశవాణి ఇట్లు పలికెను_ "ఇంద్రా! ఈ దానవుడు ఎండు వస్తువులతోగాని, తడివస్తువులతోగాని మరణింపడు. 'ఎండిన లేక తడిసిన వస్తువులతో నీకు మృత్యువు సంభవింపదు' అని నేను ఇతనికి వరమిచ్చితిని. కనుక, ఈ శత్రువును సంహరించుటకు నీవు మరియొక ఉపాయమును ఆలోచింపుము"

*11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహితః|*

*ధ్యాయన్ ఫేనమథాపశ్యదుపాయముభయాత్మకమ్॥6656॥*

ఆకాశవాణి పలుకులను విని దేవరాజైన ఇంద్రుడు ఏకాగ్రచిత్తముతో ఇట్లు ఆలోచింపదొడంగెను.. అప్పుడు సముద్రపునురుగు  ఎండినదికాదు, తడిసినదికాదు అని అతనికి తోచెను.

*11.40 (నలుబదియవ శ్లోకము)*

*న శుష్కేణ న చార్ద్రేణ జహార నముచేః శిరః|*

*తం తుష్టువుర్మునిగణా మాల్యైశ్చావాకిరన్ విభుమ్॥4657॥*

కనుక, అతడు తడిగాని, పొడిగాని కానట్టి సముద్రపు నురుగులతో నముచి యొక్క శిరస్సును ఖండించెను. అప్పుడు మహర్షులు, మునులు ఇంద్రునిపై పుష్పములను  వర్షించి, ఆయనను ప్రస్తుతించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**********************

కామెంట్‌లు లేవు: