21, ఆగస్టు 2020, శుక్రవారం

**దశిక రాము**

**నారాయణీయము**

 ప్రథమ స్కంధము - 1వ దశకము 

భగవన్మహిమానువర్ణనం
1-1-శ్లో.
సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం।
అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్||

భావం - పరిపూర్ణమయిన ఆనందాన్ని కలిగించేది, పోలికలేనిది, కాలాతీతమైనది, పరిమితిలేనిది, బంధములతో సంబంధము లేనిది, వేలకొలది వేదాలచే ప్రకాశవంతమైనది, భౌతికదృష్టికి అస్పష్టమైనది,
పురుషార్ధ ప్రధానమైన మోక్షాన్ని ప్రసాదించేది ఐన బ్రహ్మతత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుని రూపంలో భక్తజనులను అనుగ్రహించుటకు, గురవాయూరులో అవతరించినది.

1-2- శ్లో.
ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధిశమేవాశ్రయామః||

భావము - దుర్లభమయిన బ్రహ్మ తత్వము శ్రీకృష్ణుని రూపమున అతి చేరువలో గురవాయూరు పురమున అవతరించినది. త్రికరణశుద్ధిగా నిన్ను అర్చించి ఆనందమును పొందక ఇతర దేవతలను ఆశ్రయించుట నిష్ప్రయోజనము. కృష్ణా! ఇహపరమయిన సకలపీడలను నివారించుటకు, ఆత్మభూతుడవగు నిన్ను మాత్రమే ఆశ్రయించెదము.

వ్యాఖ్య -  త్రికరణశుద్ధుడు,   ఆత్మభూతుడు, పురుషార్ధము, బ్రహ్మతత్వం, కాలాతీతం, బంధాలు లేనిది ఇత్యాది గుణాలతో శ్రీకృష్ణ స్తుతిని  శ్లోకాలలో చూశాము.  ఇన్ని కళలు నింపుకున్న స్వామి కనకనే ఆయనని పెంచిన యశోద కూడా ఎదురుగా తన ముందే బాల రూపంలో తచ్చాడుతున్నా  అందీ అందనివాడు గానే కీర్తించింది.

కృష్ణ పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ, సందర్భాన్నిబట్టి పరమాత్మ అనేక నామరూపాల్లో అలరారుతుంటాడు. ఉన్నాడని నమ్మేవారికి ఉన్నట్లుండేవాడు, లేడనేవారి మనోభావాలకు విఘాతం కలగకుండా వారినీ కాపాడేవాడు. రెండూ ఆయనే కాబట్టే ద్వైదీభావాత్మకుడు.

సత్వ-రజస్‌-తమస్‌ అనే మూడు గుణాలున్నవారినీ వారికి తగినట్లు అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని చూపేవాడు. కాబట్టి త్రిగుణాత్మకుడు. నాలుగు దిక్కులా నిండి ఉన్నవాడు. నాలుగు వేదాలూ ప్రస్తుతించేవాడు. సమయాన్ని, భక్తుల మనోభావాల్ని బట్టి ప్రవర్తించేవాడు. అందువల్ల చతురుడు. పంచభూతాల్లో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రించేవాడు. కనుక, పంచభూతాత్మకుడు. అరిషడ్వర్గాలకు అతీతుడు. అవతారాన్ని బట్టి సప్తఋషుల మన్ననలు సైతం అందుకునేవాడు.

 ఇలా ఆ పరమాత్మ ఒక్కడే అయినా అనేక రూపుడు. ‘ఏకం సత్‌ బహవో వదంతి విప్రాః’ (బ్రహ్మపదార్థం ఒక్కటే అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది) అని వేదాంతులు చెప్పడానికి కారణం అదే. ఆయన జీవులందరి సంరక్షణార్థం అందరికీ చేరువలో, చెంతనే ఉంటాడు. కానీ ఎవరూ అంత సులభంగా గుర్తించలేరు. చేరుకోలేరు. యోగులైనా, భక్తులైనా పొందలేని ఆయన సాక్షాత్కారాన్ని అమాయకులు, అతి సామాన్యులు అత్యంత సులభంగా పొందగలుగు తున్నారు. దానికి కారణం వారి భక్తి తత్పరత.

పరమాత్మ గురించి, ఆయన అనుగ్రహం గురించి అంతగా తపన పడవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించేవారికి భాగవతం అతి సున్నితమైన సమాధానం ఇస్తుంది.

‘దాహార్తి తీర్చుకునేందుకు నీరు, క్షుద్బాధ తీరడానికి ఆహారం, శరీర తాపం తగ్గడానికి చల్లని గాలి... ఇలా సృష్టిలో ప్రతి అంశానికీ ఒక పరిష్కార మార్గం ఉన్నట్లే ఆధ్యాత్మిక (గత జన్మ వాసనా బలంతో సంక్రమించిన), ఆదిభౌతిక (ఈ జన్మలో చేసిన కర్మ ఫలితం), ఆదిదైవిక (దైవ సంబంధమైన) కష్టాలు తొలగిపోవాలంటే ఒక సరళమైన తరుణోపాయం ఉండాలి. ఆ మార్గమే భగవదన్వేషణ, ఆరాధన. ఇదే తప్ప అన్య మార్గం లేదు.

ఆ పరమాత్ముని మనసా (తలంపుతో), వాచా (వాగ్రూపంలో), కర్మణా (ఆయనకే చేస్తున్నాననే భావనతో తోటివారికి సేవ చేయడం రూపంలో) కొలిచిన వారిని వాటికి ప్రతిగా సదాచార వర్తనులు, మనోనిగ్రహపరులు, పరిశుద్ధాంతరంగులు అయ్యేటట్లు అనుగ్రహిస్తాడు. ఆ దైవానుగ్రహం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.

1..యోగాభ్యాసంతో ఆత్మదర్శనం చేసిన యోగులకు ఆత్మ స్వరూపుడు.

2. వేదాల్లో చెప్పినట్లు కర్మల చేత ఆరాధించినవారికి కామిత ఫలదాత.

3. స్మృతుల (పురాణాల)లో చెప్పిన విధంగా ధర్మాచరణ రూపంలో ఆరాధించినవారికి ధార్మిక ఫలప్రదాత.

4. ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా ఉపాసనాత్మక జ్ఞానం కలిగినవారికి ఆ రూపంగా మోక్షాన్ని ఒసగేవాడు.

ఇలా ఎవరు ఏ మార్గాన తలచినా అది మనస్ఫూర్తిగా చేసినదై ఉండాలి. అలా తమ తమ ధర్మాలు తప్పకుండా నడుచుకుంటూ, సమభావంతో ఉంటూ ఆయన్నే నమ్మి జీవించేవారు- సూర్యుడి రాకతో పెనుచీకటి అంతరించిన విధంగా అన్ని బంధాల నుంచీ విముక్తులు అవుతారు.

ఇంతాచేసి అందరికీ అందినట్లనిపించినా ఎవరికీ అందనంత దూరంలోనే ఉంటాడు. ఈ విషయాన్ని, దానికి కారణాన్ని గురించి ఆయనే స్వయంగా ఒక సందర్భంలో గోపికలతో ఇలా చెప్పాడు.

‘నన్ను సేవించే వారికందరికీ కావలసినవన్నీ ఇస్తాను. సేవించనివారినీ అలాగే ఆదరిస్తాను. అవసరాన్ని బట్టి అంశ, అనుప్రవేశ, ప్రవృత్తి-నివృత్తి రూపాల్లో దర్శనమిస్తాను. అంతేకానీ, నా పూర్ణ
రూపాన్ని ప్రత్యక్షంగా చూపను. అందుకే అందరికీ అందినవాడిలా అనిపించినా ఎవరికీ అందనివాణ్ని’ అని. ఆ మాటలకు తగినట్లే విష్ణురూపుడైన ఆ పరమాత్మతో ఎవరూ పొందలేని సాన్నిహిత్యాన్ని సాధారణ గోపాలకులు పొందారు. కల్మషం లేనివారి స్వచ్ఛమైన మనోభావాలు, ప్రేమానురాగాలే భగవానుడి కృపావర్షానికి కారణాలు.

అదే భావాన్ని ఈ శ్లోకంలో భట్తతిరి వారు చిలికించారు.

  స్వస్తి.సేకరణ

*ధర్మము-సంస్కృతి*
****************

కామెంట్‌లు లేవు: