21, జులై 2020, మంగళవారం

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము

గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము

ఓం నమో భగవతే వాసుదేవాయ


15.71 (డెబ్బది ఒకటవ శ్లోకము)

ఏకదా దేవసత్రే తు గంధర్వాప్సరసాం గణాః|

ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే॥6316॥

ఒకసారి దేవతల జ్ఞానయజ్ఞము జరుగుచుండెను. అప్పుడు ప్రజాపతులు అందరు వచ్చియుండిరి. శ్రీహరి లీలలను గానము చేయుటకై గంధర్వులు, అప్సరసలు ఆహ్వానింపబడిరి.

15.72 (డెబ్బది రెండవ శ్లోకము)

అహం చ గాయంస్తద్విద్వాన్ స్త్రీభిః పరివృతో గతః|

జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా|

యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః॥6317॥

అది మహాపురుషుల సమాజము. శ్రీహరిలీలలను గూర్చియే అందరును కీర్తించుచుండిరి. ఐనను స్త్రీలతో గూడి నేను లౌకిక గీతములనే గానము చేయుచు ఉన్మత్తుని వలె అచటికి చేరితిని. నేను దేవతలను అవమానపరచు చున్నానని వారు అనుకొనిరి. అంతట శక్తిమంతులైన ఆ దేవతలు 'నీవు మమ్ములను హేళన చేసితివి. కనుక, నీ సౌందర్యమును, సంపదను కోల్పోయి వెంటనే శూద్రుడవు కమ్ము' అని శపించిరి.

15.73 (డెబ్బది మూడవ శ్లోకము)

తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినామ్|

శుశ్రూషయానుషంగేణ ప్రాప్తోఽహం బ్రహ్మపుత్రతామ్॥6318॥

వారిశాపప్రభావమున నేను ఒక దాసికి పుత్రుడనై జన్మించితిని. శూద్రుడనైనప్పటికిని మహాత్ముల సత్సాంగత్యము, సేవాభాగ్యము నాకు కలిగెను. అందువలన నేను మరల జన్మమున బ్రహ్మదేవుని కుమారుడను ఐతిని.

15.74 (డెబ్బది నాలుగవ శ్లోకము)

ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః|

గృహస్థో యేన పదవీమంజసా న్యాసినామియాత్॥6319॥

సత్పురుషుల హేళన ఫలితమును, నేను ప్రత్యక్షముగా అనుభవించితిని. సాధువులను సేవించుట వలననే భగవంతుడు ప్రసన్నుడగును. నేను మీకు గృహస్థధర్మములను వర్ణించితిని. వాటిని ఆచరించుట వలన గృహస్థుల పాపములు నశించి వారు అనాయాసముగా సన్న్యాసులకు లభించు పరమ పదమును పొందుదురు.

15.75 (డెబ్బది ఐదవ శ్లోకము)

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోఽభియంతి|

యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలింగమ్॥6320॥

ధర్మరాజా! మానవలోకమున మీరు గొప్పభాగ్యవంతులు. ఏలయన, మీ యింటియందు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ మనుష్యుడై, గుప్తరూపమున నివసించుచున్నాడు. అందువల్లనే లోకములను పవిత్ర మొనర్చు ఋషులను, మునులను ఆ పరమాత్మ దర్శనముకొరకై పదే పదే నీ యొద్దకు వచ్చుచుందురు.

15.76 (డెబ్బది యారవ శ్లోకము)

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్యం కైవల్యనిర్వాణసుఖానుభూతిః|

ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ॥6321॥

ఇదుగో! మీకు ఎదురుగానున్న వ్యక్తి ఎవరోకాదు సుమా! ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ, పరమాత్ముడు. ఇతని గూర్చియే గొప్ప గొప్ప మహాపురుషులు ఎందరో అన్వేషించుచుందురు. ఇతడు పరమానంద స్వరూపుడు. మాయాతీతుడు, మోక్షమును ప్రసాదించువాడు. అట్టి పరమాత్మ మీకు పరమప్రియుడు. అత్యంత ఆత్మీయుడు. ఇంతేగాక, మీకు మేనబావ, ఆత్మ, పూజ్యుడు, ఆజ్ఞాకారియగు సేవకుడు, గురువుకూడా.

15.77 (డెబ్బది ఏడవ శ్లోకము)

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ  రూపం ధియా వస్తుతయోపవర్ణితం|

మౌనేన భక్త్యోపశమేన పూజితః  ప్రసీదతామేష స సాత్త్వతాం పతిః॥6322॥

శివుడు, బ్రహ్మాదిదేవతలు గూడ తమ బుద్ధితో ఆయన ఇట్టివాడు - అని అతని వాస్తవిక స్వరూపమును  వర్ణింపజాలరు. మేము మౌనమును వహించి ఆయనను భక్తిప్రపత్తులతో అయ్యా! నమో నమః అని నమస్కరించుటతోడనే, అతడు ప్రసన్నుడై దానినే పూజగా భావించి స్వీకరించును. ఆ భక్తవత్సలుడు అగు ప్రభువు మా పూజలను స్వీకరించి మాకు ప్రసన్నుడగుగాక!

శ్రీశుక ఉవాచ

15.78 (డెబ్బది ఎనిమిదవ శ్లోకము)

ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః|

పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమవిహ్వలః॥6323॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! దేవర్షియైన నారదుని వచనములను విని ధర్మరాజు మిగుల సంతోషించెను. అతడు ప్రేమ విహ్వలుడై ఆ మహర్షిని మరియు శ్రీకృష్ణభగవానుని పూజించెను.

15.79 (డెబ్బది తొమ్మిదవ శ్లోకము)

కృష్ణపార్థావుపామంత్ర్య పూజితః ప్రయయౌ మునిః|

శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః॥6324॥

దేవర్షి అతని సత్కారములను అందుకొని శ్రీకృష్ణుని, ధర్మరాజును వీడ్కొని వెళ్ళిపోయెను. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని, మహత్త్వమును విని ధర్మరాజు పరమాశ్చర్యమును పొందెను.

15.80 (ఎనబదియవ శ్లోకము)

ఇతి దాక్షాయిణీనాం తే పృథగ్వంశా ప్రకీర్తితాః|

దేవాసురమనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః॥6325॥

పరిక్షిన్మహారాజా! ఈ విధముగా నేను దక్షపుత్రికల వంశములను గూర్చి మీకు వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. వారి వంశమునందే దేవతల, అసురుల, మానవుల సకల చరాచర జీవుల సృష్టి జరిగినది.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశోఽధ్యాయః (15)

ఇది భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధమునందు పదునైదవ అధ్యాయము (15)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: