10, సెప్టెంబర్ 2020, గురువారం

పాండవోద్యోగం-6


ఉత్పలమాల
నంద కుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య! మ/
ధ్యందినభానుమండల విధంబున నీదగుకల్మిఁజేసి నా/
స్యందన మొప్పుగాక! రిపు సంతతి తేజము దప్పు గాక నీ/
వెందును నా యుధ్ధమ్ము దరి
కేగమి కొప్పుదుఁగాక కేశవా!

*ప్రతిపదార్థం*
నందకుమారా= ఓ!శ్రీకృష్దా
యుద్ధమున = యుద్ధం జరిగే సమయంలో,

నా రథమందు= నాయొక్కరథములో,

వసింపుమయ్య! = ఆసీనుడవుకమ్ము.

మధ్యందిన=
మధ్యాహ్నసమయంలో
భానుమండల విధంబున= సూర్య మండలము వలె

 నీదగుకల్మిఁజేసి= నీ యొక్కచేరిక, సహాయము,వల్ల

నా స్యందనము= నా యొక్క రథము

ఒప్పు గాక= తేజోవంతమగుగాక!

రిపుసంతతి= శత్రు సమూహము యొక్క

తేజము= తేజస్సు

 తప్పుగాక= తగ్గిపోవుగాక! శక్తివిహీనులవుతారు.

  నీ వెందును
(నీవు +ఎందును) =
నీవు ఎప్పుడూ ఎక్కడా కూడా,

ఆయుధమ్ముదరికి= ఆయుధము చెంతకు,వద్దకు

ఏగమికి= వెళ్ళకుండా ఉండటానికి

ఒప్పదుగాక= అంగీకరిస్తున్నాను.

కేశవా= ఓ శ్రీకృష్ణా !

*తాత్పర్యం*
శ్రీకృష్ణ !
నీ సైన్య విభజనప్రకారమే, నేను నిన్ను కోరుకుంటున్నాను. యుద్ధసమయంలో నీవు నా రథములో ఆసీనుడవై ఉండు చాలు.
 మధ్యాహ్న కాల సూర్యమండలం వలె మీ సాయం చేత, నువ్వు నాతో కలిసి ఉండటంవల్ల,
నారథంధగధగ లాడుతూ
ప్రకాశిస్తుంది. శత్రువుల తేజస్సు
నీతేజస్సు ముందు వెలవెలబోతుంది. ప్రకాశం తగ్గిపోతుంది. *యుద్ధంలో నేను ఆయుధమును ధరించను* అన్న నీ మాటకు నేను ఒప్పుకుంటున్నాను. నీవు ఎప్పుడూ, ఎక్కడా ఆయుధము ధరించవలసిన అవసరంలేదు కృష్ణా.
.......... విశేషాంశాం....
శ్రీకృష్ణుడు రథం లో కూర్చుంటే చాలు..,,
మధ్యాహ్నపు
సమయంలో సూర్యుడునడినెత్తికి వచ్చినప్పుడు
ఆసూర్యుని మనం చూడలేము. ఆవిధంగానే
శ్రీకృష్ణుడు వచ్చితన రధంలో కూర్చుంటే, ఆ రథాన్ని శత్రువులు కనీసం తేరిపారా చూడనుకూడా
చూడలేరు.
 అంతా తేజస్సుతో ప్రకాశిస్తుంది
నా రథం.
దీనినే మధ్యందిన భానుమండల అని పోలికతెచ్చారు తిరుపతి వేంకట కవులు. . 💐🙏🏻💐

కామెంట్‌లు లేవు: