10, సెప్టెంబర్ 2020, గురువారం

చెడును చూసి

*చెడును చూసి మంచి నేర్చుకో*

ఒక ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర అనేకమంది శిష్యులు పాఠాలు నేర్చుకొంటు ఉండే వారు.

 ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది.

ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు.

దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి ఫిర్యాదు చేశారు.

అయితే విషయం అంతా విన్న గురువు గారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు.

అలా కొన్నాళ్ళు గడిచాయి.మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు.

ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు.

అప్పుడు గురువు గారు శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.

*ఇంకా......*

ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు. విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ...

*అంతేగాకుండా.....*

తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

దొంగతనం చేసిన శిష్యుడుకి గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు ప్రశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు.

జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు.

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు.

మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మ మాట సరిగా వినలేదని
బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం.తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి
బుద్ధి రాదు, ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసినవాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.

వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు,
రామానచార్యులవారు,
రమణ మహర్షి మొదలైనవారు.

తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ.దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.

మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు. మన మాటలైనా మన ప్రవర్తన అయినా మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు.
కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.

అందుకే గురుకులంలో ని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు.
అందుకు మంచి ఉదాహరణ
పరమానందయ్య శిష్యులు.

మన శరీరంలో కూడా కోని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా
గోర్లు, వాటిని పెంచుకోవడం
ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వాటిని కత్తెరిస్తువుంటాం.
అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి అంతేకానీ

జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంతా
పెద్ద శిక్షలు మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని
ఎప్పుడు వెయ్యకూడదు.


ఆలోచించాలి ఆచరించాలి నేర్పించాలి అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం, కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారుగాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.

అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి.బోయవాడు వాల్మీకి గా మారినట్లు,గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచె గొప్ప మలుపు వున్న రోజును తీసుకోనివస్తుందని ఎదురు చూద్దాం.

కామెంట్‌లు లేవు: