10, సెప్టెంబర్ 2020, గురువారం

*కవిసమ్రాట్ గా విశ్వనాథ

ఈరోజు (10-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *కవిసమ్రాట్ గా విశ్వనాథ*// మాట్లాడే వెన్నెముక -పాటపాడే సుషుమ్న, అంటూ విశ్వనాథ సత్యనారాయణను మహాకవి శ్రీశ్రీ అభివర్ణించాడు. శ్రీశ్రీ వంటి విప్లవభావ కవితామూర్తులను కూడా వెంటాడిన కవితావతారుడు విశ్వనాథ. సెప్టెంబర్ 10వ తేది విశ్వనాథ జయంతి. ఈ మహాకవి పుట్టి 125 పూర్తయ్యాయి.తెలుగుదనాన్ని, భారతీయతను ప్రేమించేవారంతా విశ్వనాథను ప్రేమిస్తారు. తెలుగుదనాన్ని ఆణువణువూ నింపుకొని కవిత్వం సృష్టించిన ఆంధ్రపౌరుషుడు. విశ్వనాథ పట్టుకోని సాహిత్యప్రక్రియ లేదు. ప్రతి క్షేత్రంలోనూ అద్భుతమైన పంటలు పండించాడు. కల్పవృక్షాలు వేశాడు. కావ్యాలు, శతకాలు, నవలలు, నాటకాలు, పీఠికలు, విమర్శనా వ్యాసాలు, కథలు, గాథలు ఆన్నీ రాశాడు. రాసిన ప్రతి చోటా, బంగారుబాటలు వేశాడు. భారతదేశ సాహిత్యలోకంలో తెలుగుభాషా గౌరవాన్ని చాటి చెప్పాడు.తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠం పురస్కారం పొందిన ఘనుడు విశ్వనాథ. ఆ కాలంలో తెలుగు ఉపాధ్యాయుడు లేదా ఉపన్యాసకుడు ఎవరూ ప్రిన్సిపాల్ పదవిని అలంకరించలేదు. అది కూడా సాధించిన ఘటికుడు. సారస్వత ప్రభ -లౌకిక ప్రతిభ రెండూ సమానంగా ఉన్న సవ్యసాచి.తదనంతర జీవితంలో మహానటుడుగా అవతరించిన ఎన్టీఆర్ లో, నటుడు దాగి ఉన్నాడని గుర్తించి, మొట్టమొదటిసారిగా నాగమ్మ పాత్ర వేయించి, ప్రోత్సహించినవాడు విశ్వనాథ.ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వీరి శిష్యుడు.ఎన్టీఆర్ లో ఆంధ్రపౌరుషాన్ని, భాషాభినివేశాన్ని రగిల్చినవాడు విశ్వనాథ. ఎందరికో ఫీజులు కట్టి, ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి విద్యాదానం చేసిన మహనీయుడు విశ్వనాథ సత్యనారాయణ. ఇంగ్లీష్ కు వ్యతిరేకి అనే ముద్ర విశ్వనాథకు ఉంది. కానీ, ఆయన బాగా ఇంగ్లీష్ చదువుకున్నాడు. సుప్రసిధ్ధ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి జర్నలిజం విద్యార్థిగా ఉన్నప్పుడు డెక్కన్ క్రానికల్ పత్రిక కోసం విశ్వనాథను ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది.నేను అడిగే ప్రశ్నలకు మీరు తెలుగులో సమాధానం చెప్పవచ్చు, నేను ఇంగ్లీష్ లోకి మార్చుకుంటానని, మూర్తి విశ్వనాథకు వివరించారు.అవసరం లేదు. నువ్వు ఇంగ్లీష్ లో అడుగు, నేను నాకు వచ్చిన ఇంగ్లీష్ లో సమాధానాలు చెబుతానని విశ్వనాథ బదులిచ్చాడు.ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఒక్క అక్షరం, ఒక్క పదం కూడా మార్చకుండా డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించింది. మంచి ఇంగ్లీష్ భాషాజ్ఞానం కలిగినవాడు విశ్వనాథ.పైకి కోపంగా, గర్వంగా కనిపించినా, లోపల మెత్తని మనిషి ఉన్నాడని విశ్వనాథతో బాగా పరిచయం ఉన్నవాళ్లు తరచూ చెబుతుంటారు. బహుభాషావేత్త పివి నరసింహారావుకు కూడా విశ్వనాథ నవలాశిల్పం అంటే చాలా ఇష్టం. అందుకే, వేయిపడగలు నవలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి ఆయనే స్వయంగా అనువదించారు. విశ్వనాథకు సంగీతమంటే కూడా చాలా ఇష్టమేకాక, బాగా పాడుతారు కూడా. విశ్వనాథ పద్యగానంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని విన్నవాళ్ళు చెబుతారు. విశ్వనాథ ప్రతిభ అసామాన్యమైంది. గొప్ప జ్ఞాపకశక్తి. మేధాశ్రమ కూడా చాలా ఎక్కువ. బాగా చదవడం, రాయడం, జీవితాంతం అక్షర సేద్యంలోనే గడిపాడు. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు వంటి అసాధారణమైన సాహిత్య సృష్టి చేశాడు. విశ్వనాథ హృదయం, మెదడే ఒక జ్ఞానపీఠం, సారస్వత జలపాతం. అలవోకగా సాహిత్య సృష్టి చేస్తాడు. ఈ ప్రతిభ అనన్య సామాన్యం. గొప్ప ఉపాధ్యాయుడు. మహాకవి. మహా చతురుడు. విశ్వనాథను చూడడం, వినడం ఆ కాలంలో పెద్ద మోజు. ఒంటిచేత్తో అంతటి సాహిత్య సృష్టి చేసిన ఆధునిక కవి విశ్వనాథ తప్ప ఇంకొకడు లేడు. వారి ప్రతి రచనా సుప్రసిద్ధమే. రసగుళికలు వంటి రచనలు చేశాడు.భారతీయ చరిత్రను బ్రిటీష్ వాళ్లు తప్పుల తడకగా రాయించారనే కోపం ఉండేది. మన విద్యావిధానం, సంస్కృతి భ్రష్టు పట్టడానికి ఇంగ్లిష్ వాళ్లే కారణమంటూ, జీవితాంతం వారిని ద్వేషించాడు.ఏ రచనా ప్రక్రియ చేపట్టినా, ఏ వస్తువు ఎంచుకున్నా, తెలుగుదనం, భారతీయత వైపే దాన్ని తీసుకెళ్ళేవాడు. సముద్రంపై పక్షి ఎంత ఎగిరినా రాత్రికి గూటికి ఎలా చేరుతుందో, మనం ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి భారతీయత దగ్గరికి రావాల్సిందే, రావాలి అని వ్యాఖ్య చేశాడు. అంతగా, తన రచనల ద్వారా భారతీయతను అడుగడుగునా నింపేవాడు. అదే ఆయన శ్వాస.ఛాందసుడని కొందరు తిట్టుకున్నా ఆయన లెక్క చేయలేదు. సంప్రదాయం, సనాతన మార్గంలోనే జీవితమంతా నడిచాడు. పదునైన, రసవంతమైన రచనా శిల్పం, వర్ణనా నైపుణ్యం విశ్వనాథను ఆధునిక కాలంలో అగ్రపీఠంలో నిలబెట్టాయి.విశ్వనాథ సిగలో ఎన్నో కీర్తి కిరీటాలు చేరాయి. పద్మభూషణ్, కళాప్రపూర్ణ, డి లిట్ వంటి గౌరవాలు,జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడెమి వంటి పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవి వంటి పదవులు, గజారోహణాది ఘన సత్కారాలు పొందిన వైభవమూర్తి విశ్వనాథ. ఇటువంటి మహాకవుల పుట్టుక అరుదైన వేడుక. వీరి పుట్టుకతో తెలుగుపుడమి పులకించింది. విశ్వనాథ జీవితం ఎక్కువగా విజయవాడతోనే పెనవేసుకుని సాగింది. తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లోనూ విశ్వనాథకు వీరాభిమానులు ఉన్నారు. తెలుగుదనాన్ని ప్రేమించే వారంతా విశ్వనాథను పూజిస్తారు. తెలుగు వెలుగు విశ్వనాథ మనకు నిత్య స్మరణీయుడు.వారి సాహిత్యం నిత్య పఠనీయం.ఈ తేజోమూర్తికి జోతలు సమర్పిద్దాం.-మాశర్మ🙏

కామెంట్‌లు లేవు: