26, జులై 2020, ఆదివారం

రామాయణమ్. 11

ఈ లోకములో ఏ ఏ అస్త్రములు అయితే వున్నవో అవి అన్నియు విశ్వామిత్రుని వద్ద ఉన్నవి .
.
అస్త్రములు అన్నీ కూడా భృశాస్వుని పుత్రులు .
భృశాస్వుడు ఒక ప్రజాపతి ,ఆయన దక్షప్రజాపతి కూతుళ్ళు జయ,సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు!
వీటిని విశ్వామిత్రుడు పొందుతాడు!
.
అంతేకాదు విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము (guided missiles).
ఈయన క్రొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడుకూడా  ! .
.
(శస్త్రము అంటే మామూలుగా గాయం చేసేది!
 అస్త్రము అంటే మంత్రపూర్వకముగా ప్రయోగించేది! .
bullet కు intercontinental ballistic missile కు ఉన్నంత తేడా అన్నమాట).
.
ఓ దశరధమహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధోసంపన్నుడు! అతులిత పరాక్రమవంతుడు! ,ఆయన తన యాగసంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్ధుడు! .
.
ఆయన అడుగుతున్నాడు నీ రాముడి ని పంపమని!
ఆయనవెంట వెళితే రామునకు మేలుకలుగుతుంది! మహర్షి ఉద్దేశ్యము అదే ! రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన!
.
నీవు మనసులోని భయసందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయనవెంట పంపు సకల శుభాలు ఒనగూరుతవి!.
.
కులగురువు మాటలు విని దశరధుడి శరీరం ఉప్పొంగింది!
రాముని మహర్షివెంట పంపటానికి సంతోషంగాఒప్పుకొన్నాడు!.
.
స్వయముగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుని శిరస్సుముద్దిడుకొని ,మహర్షి చేతిలో పెట్టాడు !  .
.
మూపున విల్లమ్ములు ధరించి రాముడు,లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు .
.
బ్రహ్మదేవుడు ముందువెడుతుండగా వెనుక ఇద్దరు అశ్వనీదేవతలనుసరించినట్లుగా కనపడుతున్నారు వారివురూ చూపరులకు!.
.
బాటలు నడిచారు,పేటలు గడిచారు నడుస్తూనే ఉన్నారు మహర్షి వెనుదిరిగి చూడలేదు.
ఆ విధంగా మొదటిసారి నగరువిడచి దుర్గమారణ్యాలలో కాలుమోపాడు కోదండపాణి సోదరసమేతుడై!.
.
అలా చాలా దూరం నడచిన తరువాత తనలోని ప్రేమంతా మాటరూపంలో బయలుపడేటట్లుగా "రామా" అని అత్యంత మధురంగా పిలిచాడు మహర్షి! .
.
అప్పటిదాకా ఆయన వెనుదిరిగిచూడలేదు, చూస్తే రాముని మధురమోహనరూపం కట్టిపడేస్తుంది, ముందుకు సాగనీయదు అనే భయం వల్లనేమో బహుశా!
.
సరయూనదీ దక్షిణతీరం చేరారు ! ఆ నది ఒడ్డున కాసేపు ఆగి నాయనలారా ఆచమనం చేయండి ! మీకు కొన్ని మంత్రములను ,"బల,""అతిబల "అను విద్యలను ఉపదేశిస్తాను! స్వీకరించండి!
.
ఈ విద్యలెటువంటివి అంటే! ఇవి తెలుసుకొన్న తరువాత నీకు శ్రమగానీ,జ్వరముగానీ,రూపములో మార్పుగానీ సంభవించదు!
నీవు నిద్రపోయినప్పుడుగానీ ,ఏమరపాటుగా ఉన్నప్పటికీ కూడా రాక్షసులు నిన్నేమీ చేయజాలరు!
.
రామా !బాహుబలములో నీతో సమానుడు
మూడులోకములలో ఎవడునూ లేడు ఇకముందు ఉండడు!
రామా! సౌందర్యము,సామర్ధ్యము, జ్ఞానము బుద్ధినైశిత్యములలో నీతో సరిసమానుడు ఈ లోకములో ఉండడు!.
.
ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు!
.
అంత శ్రీరాముడు శుచియై,శుద్ధాంతరంగుడై,ఆ మహర్షి నుండి విద్యలను ఆనందంగా స్వీకరించాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: