26, జులై 2020, ఆదివారం

పోత‌న త‌ల‌పులో.....1


మ‌హాక‌వి బొమ్మెర పోత‌నా  మాత్యులు (1410-1470) శ్రీ మ‌హాభాగ‌వ‌తాన్ని తెలుగులో అందించి తెలుగుజాతికి మ‌హోప‌కారం చేశారు. ఆ భాగ‌వ‌తంలోని కొన్ని ప‌ద్యాలు మ‌రోసారి ....
శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారమ్భకు భక్తపాలన కళా సంరభకున్ దానవో
ద్రేక స్తంభకు గేళిలోల విలసద్ద్రుగ్జాలసంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగానా డింభకున్ 
                             **
లో్క‌ర‌క్షా ప‌రాయ‌ణుడు, భ‌క్త‌పాల‌న‌మే ఒక క‌ళ‌గా ఆచ‌రించేవాడు,దాన‌వుల ఉధృతాన్ని అరిక‌ట్టేవాడు, లీలావ‌లోక‌న మాత్రంచేత అనేక బ్ర‌హ్మాండాల‌ను ఉద్బ‌వింప‌చేసేవాడు అయిన మ‌హానందున‌(నంద‌రాజు) ఇల్లాల (య‌శోద‌) ముద్దుల బిడ్డడైన (బాల‌కృష్ణుని) శ్రీ కైవ‌ల్య ప‌దం పొంద‌డానికి నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. 
ఒక్క ప‌ద్యంలో కృష్ణ‌య్య జీవితాన్ని, ద‌శావ‌తార‌లాను స్ఫుర‌ణ‌కు వ‌చ్చేట్టు చేశాడు.
ఇది శ్రీమదాంద్ర మహా భాగవతము లోని మొదటిపద్యము. 
భాగవత రచన ఆరంభానికి  ముందు పోతన గారు చేసిన ప్రార్ధనఇది.
శ్రీ‌కైవ‌ల్య ప‌దం చేర‌డానికే మ‌హాభాగ‌వ‌త ర‌చ‌న అని ఆదిలోనే నివేదించాడు.
రామభద్రుడు కృతి కర్త , క‌థానాయ‌కుడు కృష్ణుడు.
 కావ్యం ఎందుకు రాస్తున్నాడో అందులో ఏముందో, ఏమి ఆసించాడో,అన్ని ఒక్క పద్యంలో ప్రార్ధనలోనే చెప్పిన ఘనత పోతనదే.
ఇది చ‌దివిన వారికి , నేర్చుకున్న వారికి, మ‌న‌నం చేసుకునే వారికి శ్రీ కైవ‌ల్య‌ప‌దం త‌ప్ప‌క సిద్ధిస్తుంది.
*పోత‌న‌ ప‌ద్యాలు-మాన‌వాళి ఉన్నంత వ‌ర‌కూ నిలిచే ప‌ద్యాలు, జాతికి వెలుగు చూపే దివిటీలు.*

కామెంట్‌లు లేవు: