17, జులై 2020, శుక్రవారం

రామాయణమ్.2

ఎవరు గుణవంతుడు? 
ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?
ఎవరు ధర్మము తెలిసినవాడు?
ఎవరు కృతజ్ఞుడు?
ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?
ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?
ఎవరు మంచి నడవడి కలవాడు?
ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు?
ఎవరు విద్వాంసుడు?
ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?
ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?
ఎవరు ధైర్యము గలవాడు?
ఎవరు కోపము జయించిన వాడు?
ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?
ఎవరు అసూయలేనివాడు?
ఎవరు కాంతి కలవాడు?
ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ! ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?
అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యేపనేనా? అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా? 
ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షిమనసులో ఉదయించాయి!
.
ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి!
సమాధానం ఇవ్వగల సమర్ధుడెవ్వరు?
ఆలోచించారు మహర్షి వాల్మీకి! ఆయన మనోఫలకం మీద అప్పుడు త్రిలోకసంచారి నారద మహర్షి కనపడ్డారు! అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానమీయగలడు!
అన్నిలోకాలు తిరుగుతూ ఉంటారుకదా! నారదులవారు!
నా మనస్సు లో ఉన్నవ్యక్తి ఆయనకు ఎప్పుడయినా, ఎక్కడయినా తారసపడి ఉండవచ్చు!
.
మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు!
.
నారద మహర్షి ప్రత్యక్షమయినారు ,ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు!
.
తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంఙ్గవమ్
.
మహాతపఃశాలి ,నిరంతర వేదాధ్యయనమునందు అసక్తి కలవాడు ,వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు,మునులలో గొప్పవాడయిన  వాల్మీకి మహర్షి  ,నారదుని ప్రశ్నించెను!
.
ముని ప్రశ్నకు నారదులవారు ఈవిధంగా సమాధానం చెపుతున్నారు!
......,.............
 
తపః ...అనగా జ్ఞానము ! దేనిని గురించి జ్ఞానము ? బ్రహ్మము ను గురించిన జ్ఞానము ! బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది! అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్ధము!
.
స్వాధ్యాయము.... అనగా వేదాధ్యయనం,  
 ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు! మహర్షి ?  
పూర్తి అర్ధ జ్ఞానం కలిగేవరకు చదువుతూ ఉండటమే ! 
అంటే PHILOSOPHY OF SUBJECT తెలిసేవరకు అన్నమాట!
.
( మన చదువులు పరీక్ష పాస్ అయ్యి డిగ్రీలు చేతికి వచ్చేవరకే ! ఆ తరువాత Subject మరచిపోతాం! 
కేవలం Visiting cards లో మన పేరు ప్రక్కన వేయించుకునేందుకు తప్ప, మన డిగ్రీలుఎందుకూ పనికి రాని విధంగా మనలను మనం తీర్చిదిద్దుకుంటున్నాం).
.
వాగ్విదాంవర ..వాక్కు అనగా శబ్దము 
 అసలు శబ్దము ఎలా పుట్టింది? దాని లక్షణమేమిటి? వాక్కును ఎలా ప్రయోగించాలి? అన్నీ తెలవాలంటే  ,ఒక వ్యక్తి శిక్ష,వ్యాకరణము,ఛందస్సు,నిరుక్తము,జ్యోతిషము,కల్పము అనే వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి !
..(మనం చేసే లొడ లొడ శబ్దం కాదు ,మనం వాక్కు యొక్క స్వరూపమేమిటో తెలియకుండా నోటికి వచ్చింది అడ్డంగా మాట్లాడతాం).
.
అలా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు! వాల్మీకి మునిపుంగవుడు! 

అంతటి గొప్పవ్యక్తికి కలిగిన సందేహమది!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: