25, డిసెంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 119*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                            *ధార్మికగీత  - 119*

                                       *****

             *శ్లో:- పితృభి స్తాడితో పుత్రః ౹*

                    *శిష్య స్తు  గురు శిక్షితః  ౹*     

                     *ఘనాహతం సువర్ణం చ ౹*

                     *జాయతే జనమండనమ్౹౹*

                                       *****

*భా:-లోకంలో శిక్ష తోను,శిక్షణ తోను,రాపిడి తోను రాణించేవి మూడు అంశాలు పరిశీలిద్దాం. 1. "పుత్రుడు":-తల్లి దండ్రుల ఆలనా పాలనలో బాల్యము నుండి సామ దాన భేద దండో పాయాల నిబద్ధత, క్రమశిక్షణల తో క్రమంగా ఉన్నతంగా ఎదిగి, విద్యావినయ సంస్కార సుగుణగణ శోభితుడైన కుమారుడు;  2. "శిష్యుడు":-  విద్యా, జ్ఞాన సంపత్తితో పాటు మానవీయ, సామాజిక, సాంస్కృతిక  విలువలలో గురువు గారి శిష్యరికంలో సుశిక్షితుడై, కమనీయ శిల్పంగా మలచ బడిన శిష్య పరమాణువు; 3. "బంగారము":- ఎంత ఖరీదు గల, అపురూప లోహమైనా, అగ్నిలో సలసల  కాల్చబడి, స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తినడం చేత మిరుమిట్లు కొలిపే  కాంతు లీనుతూ, నగల రూపంలో రూపుదిద్దబడిన బంగారము; 4.  పుత్రుడు, ఛాత్రుడు, పుత్తడి  అనబడే యీ మూడును జనబాహుళ్యంలో నిరంతరం ప్రశంసాపాత్రమై, వేనోళ్ళ కొనియాడబడుతూ, చెక్కు చెదరని కీర్తి ప్రతిష్ఠలతో ఇనుమడిస్తాయి. విశ్వవ్యాప్తంగా అందరి హృదయాలలో శాశ్వత సుప్రతిష్ఠమై గారవింప బడతాయి. ఇలా "పుత్రుని" , "శిష్యుని", "పసిడి" ల యొక్క ఉజ్జ్వలమైన  భవిత తల్లిదండ్రులు, గురువు, స్వర్ణకారుని చేతుల్లో ఉందని సారాంశము.*

                                 *****

                  *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: