30, జూన్ 2025, సోమవారం

నారాయణావతార వైభవమ్!!

 శు భో ద యం 🙏


నారాయణావతార వైభవమ్!!


వామనారతార ఘట్టంలోనియీపద్యరాజం వెలగట్టలేని మాణిక్యం! ఈభూమియే సంహాసనమట! ఆకాశమే ఛత్రమట! దేవతలంతా సేవకులట! వేదాలు వంది మాగధులట! చరాచరమైన యీబ్రహ్మాండమే ఆకారమట! కలుములతల్లి లక్ష్మియే భార్యయట! చరాచర సృష్టి కర్త బ్రహ్మ కొడుకట! పరమపావని గంగ కూతురట!ఆహా యేమి యా నారాయణుని వైభవం! అలాంటి వైభవంతో వర్ధిల్లమని ఆశీర్వాదం! యెవరీయగలరండీ యింతటి మహదాశీర్వాదం!! ఆనారాయణుని చేతనే యిప్పించాడు పోతన! అందుకే భాగవతం చదవమని చెప్పటం: కొంతైనా సుకృతం కోసం!


"ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమమ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మండమాగారమై

సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రియై

వరసన్నీ ఘనరాజసంబ నిజమై వర్థిల్లు నారాయణా!!


ఈ పద్యం పోతనగారి నారాయణశతకం లోనిది.


మా చిన్నతనంలో దసరా శెలవల్లో బడి పంతుళ్ళు 

బడి పిల్లలను అందరి ఇళ్ళకు ఈపద్యం చెబుతూ

తీసుకవెళ్ళేవారు. శ్రీమన్నాయణుని వైభవం తెలిపే పద్యం.

ముందుగనే ఎవరింటికి వెళ్తామో చెప్పేవారు. ఆ గృహస్థు 

సాదరంగా ఎదురొచ్చి పంతులు గారికి కుర్చీ వేసి కూర్చోమని మర్యాద

చేసేవారు. అప్పుడు పిల్లలంతా ఈ పద్యం అందుకునేవారు.

మగపిల్లల చేతిలో విల్లంబులు

ఆడపిల్లల చేతిలో అట్టతో చేసిన హనుమంతుడు వుండేది


ఏమయా మీదయా మామీదలేదు.

దసరాకు వస్తిమని విసవిసలు పడక

చేతిలో లేదని, అప్పివ్వరనక

పావలా అయితేను పట్టేది లేదు

అర్ధరూపాయి అయితేను అంటేది లేదు

ముప్పావలా అయితేను ముట్టేది లేదు

ఇచ్చ రూపాయి అయితేను పుచ్చుకుంటాము

అయ్యవారికి చాలు ఐదు వరహాలు

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు.


జయీ భవ దిగ్విజయీ భవ .............


తల్లితండ్రులు పంతులుగారికి పళ్ళెంలో

బట్టలు తాంబూలం కొంత డబ్బు పెట్టి ఇచ్చేవారు

అటుకులు బెల్లం మరుమరాలు పిల్లలకు పంచేవారు

అమ్మానాన్నలో తాతలో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో

అడిగి తెలుసు కునేవారు.గురువు అంటే అంత మర్యాదా గౌరవము..

అప్పుడు ఎక్కువగా మునిసిపల్ గ్రాంటు స్కూళ్ళే.🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: