అవస్థా త్రయం --- తురీయావస్తా 🙏
మొదటి భాగం
ముందుగా మనస్సు స్థితి ఎల్లావుంటుంది చూద్దాము
ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ధ్యానం చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా మరొక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాకుండా ఉందంటే అది నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది.
మనసు చాలా చంచలమైంది. దానిని నిశ్చలం చేయుటకు ఎన్ని పాట్లు పడాలి. ఆలోచనల పరంపరలో సంచారిస్తూ ఉంటుంది.
మనసు, బుద్ది, అహంకారం, చిత్తం ఇది అంతరంగ చతుష్టయం
శ్రీచక్రార్చనలో మనో బుద్ది చిత్త అహంకారాత్మక అని చతుర్ధావరణలో వస్తుంది. అసలు ఏది మనస్సు? ఏది బుద్ది? ఏది చిత్తం? ఏది అహంకారం తెలుసుకోవాలి
అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.
ఒకే వ్యక్తి ఆఫీస్లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీఅంటాము , ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీఅంటాము , ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ అంటాము , ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది
మనసు, బుద్ధి, అహంకారంo, చిత్తం-ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం!
మనసు అన్నది ఇక్కడ చేతన మనసును సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.
మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి అనబడుతుంది. "ఇటుగా వచ్చేది ఎవరు?రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి.
ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం అంటారు. మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది.
మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, గాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము
ఇక విషయంలోకి వద్దాము
శ్రీం బీజాక్షరానికి ఉన్న అనేక అర్ధములలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్తా చతుష్టయం అని అర్ధం కూడా ఉంది. త్రిపుటి అనేక అర్ధములలో చెప్పబడిన వాటిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి కూడా ఒకటి.జాగ్రత్, స్వప్న, సుషుప్తి జీవకోటికి సర్వ సాధారణము. తమో గుణానికి ప్రతీక నిద్ర. ఇదే మాయా స్వరూపము.అసలు మాయ అంటే అర్ధం ఏమిటి? " మా " అంటే కాదు అని అర్ధం "యా " అంటే ఏది అని అర్ధం.
ఇప్పుడు తాత్పర్యం చూస్తే..ఏది సత్యం కాదో అది మాయ.
మెలకువలో ఉండడం , కలలుకనడం , గాఢనిద్ర ఈ మూడు స్థితులనూ జాగ్రత్, స్వప్న, సుషుప్తి అంటారు . వీటినే అవస్థాత్రయం అంటారు. మెలకువ స్థితిలో బాహ్యప్రపంచ జ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం. ఇది జాగృతావస్థ.
ఇక స్వప్నా వస్థలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు , క్రమపద్ధతిలోనో లేకపోతే మరొక విధంగానో కనిపిస్తాయి. స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.మనస్సు పనిచేస్తూ ఉంటుంది.ఇక సుషుప్తిలో.. అంటే గాఢ నిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.
జాగృత్ (మెలకువ) స్థితిలో ఆత్మతత్వం అనేది కన్నులయందు.., స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తిలో ప్రాణమునందు ఉంటుంది. సుషుప్తిలో ఆత్మ శరీరాన్ని ప్రాణాలకు అప్పగించి తాను అంతర్యామితో (జీవాత్మ ) కలిసి సుఖిస్తుంది. అందుకే గాఢనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ‘నేను సుఖంగా నిద్రపోయాను’ అంటాం. ఇది మనందరికీ అనుభవంలోని విషయమే.
అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము.. యోగం ద్వారా పొందవలసింది.మనకు అనుభవంలో ఉండదు.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి