10, జులై 2020, శుక్రవారం

*త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయుడు.*

*బ్రహ్మదేవుని సంకల్పంతో సృష్టించబడిన సప్త ఋషులే బ్రహ్మర్షులు.* 
సృష్టి రచనలో బ్రహ్మదేవునికి సహాయపడటానికి ఆవిర్భవించిన బ్రహ్మమానస పుత్రులువారు. 
వారిలో ప్రథముడు అత్రి మహాముని. జ్యోతిష పరంగా ఆకాశంలో చూసినట్లైతే నక్షత్ర మండలంలో ఎలుగుబంటి ఆకారంలో నక్షత్రాలు తేజోవంతమై నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ కనిపిస్తాయి అదే సప్తర్షి మండలం. 
ఆ సప్తఋషి మండలంలో ఏడుగురు ఋషులకు దేవతలతో సమానమైన శక్తి కలిగి ఉందని చెబుతారు. వారు ధర్మనిష్టాపరులు అని పురాణాలు వర్ణిస్తున్నాయి. 
*ఋగ్వేదంలోని అయిదవ మండలాన్ని 'అత్రి మండలం' అని అంటారు.*  
త్రిమూర్తి స్వరూపునిగా పూజలందుకుంటున్న దత్తాత్రేయుడు మూర్తీభవించిన గురు స్వరూపం.
శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాలలో ఆరవది దత్తాత్రేయ అవతారమని శ్రీమద్భాగవతం చెబుతోంది. 
అనసూయకు బిడ్డలుగా పుడతామని త్రిమూర్తులు ఇచ్చిన వరం ప్రకారం విష్ణ్వంశతో మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు జన్మించాడు.  ఆయనది జ్ఞానావతారం.
అనసూయ, అత్రి మహర్షికి ముగ్గురు పుత్రులు. వారు, సోముడు, దత్తుడు, దుర్వాసుడు. 
వారిలో సోముడు బ్రహ్మ, దత్తుడు విష్ణువు, దుర్వాసుడు రుద్రుడు. 
త్రిమూర్తుల సమిష్టిరూపమే దత్తాత్రేయుడని, ఆయనకు మూడు ముఖాలు ఆరు చేతులు ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ దత్తాత్రేయస్వామి వెనుక ఒక ఆవు, ఎద్దు, నాలుగుకుక్కలు ఉంటాయి. *"గురుచరిత్ర"* గ్రంథంలో సరస్వతీ గంగాధరుడు ఈ స్వరూపాన్ని గురించి వర్ణించాడు.
*దత్తాత్రేయ భగవానుడు ఔదుంబర వృక్షం "మేడిచెట్టు" దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది*  ఈస్వరూపం ద్వారా దత్తాత్రేయుని పరబ్రహ్మ స్వరూపం వ్యక్తమౌతుంది. 
 *దత్తాత్రేయుని ఆవిర్భావకాలం* 
సహ్యాద్రి శిఖరంపై దత్త భగవానుని స్తానం ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం యవమాల్ జిల్లాలోని అర్ణీ గ్రామానికి 16 మైళ్ళ దూరంలో రేణుకా పురం అనే గ్రామం ఉంది. దీనినే మాలాపుర గ్రామం అని అంటారు. అక్కడే అత్రి ఆశ్రమం ఉంది. ఇప్పుడు దానిని మాహూర్ గఢ్ గా పిలుస్తున్నారు. దత్త భగవానుడు ఆవిర్భవించిన స్థానం ఇదే. స్వయంభూగా మన్వంతరానికి పూర్వమే భగవాన్ దత్తాత్రేయుడు ఉద్భవించాడు. లోకంలోని జీవుల దుఖ: తాపాలను దూరం చేయటానికి దత్తుడు తన ఇష్ట ప్రకారమే అవతరించాడు అని తెలుస్తుంది. 
ఆధ్యాత్మిక సిద్ధి, యోగవిద్య, నిష్కామబుద్ధి, త్రిపురసుందరీ సాధన - ఇవన్నీ దత్తాత్రేయుని ఉపదేశాల్లో ప్రధానమైనవి. 
దత్తాత్రేయ స్వామి యొక్క *"వజ్రకవచం"* పఠించడం వలన మానవాళికి, రక్షణ కొరకు ఉపయోగ పడుతుంది.
*దత్తాత్రేయుడి మూడు ముఖాలనూ త్రిమూర్తులకు ప్రతీకలుగా, ఆయనను అంటిపెట్టుకొని ఉండే నాలుగు శునకాలనూ చతుర్వేదాలుగా పురాణాలు చెబుతున్నాయి*
ఉన్మత్త వేషధారిగా కొన్నిసార్లు దర్శనమివ్వడంలోని రహస్యం - జ్ఞానార్జనలో భౌతికరూపానికి ప్రాధాన్యం ఇవ్వరాదనే సందేశమేనని చెబుతారు పెద్దలు.
కృత యుగంలో ప్రహ్లాదుడికి జ్ఞానబోధతో మార్గనిర్దేశం చేసిన దత్తాత్రేయ స్వామి కలియుగంలో వివిధ అవతారాలతో భక్తులను అనుగ్రహిస్తానని ప్రకటించాడు. 
గురుత్వం లేదా గురుపరంపర అనేది ఆయనతోనే ప్రారంభమైంది. పంచభూతాత్మకమైన ప్రకృతి, జంతువులు, వివిధ వృత్తులతో సహా 24 అంశాలను దత్తాత్రేయుడు గురువులుగా భావించి, వాటి నుంచి జ్ఞానాన్ని పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఎంతటివారికైనా గురువు యొక్క మార్గదర్శనం తప్పనిసరి అనడానికి ప్రతిదానినుండి నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉంటుందనే సత్యానికి దత్తాత్రేయుడి ఈ గురుస్వీకారం తార్కాణం.
ఉత్తరాదిలో నాథ సంప్రదాయంలోని ఆదినాథ్‌ సంప్రదాయానికి ఆది గురువుగా దత్తాత్రేయుడిని కొలుస్తారు. తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో కురువపురంలో తన అవతార సమాప్తికి ముందు ఆయన నివసించారని ప్రతీతి.
*ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో శ్రీపాదవల్లభ స్వామిని దత్తాత్రేయుడి తొలి అవతారంగా చెబుతారు.*  
యోగసాధకులు దత్తమార్గాన్ని అత్యుత్తమ అనుసరణీయ మార్గంగా పరిగణిస్తారు. మనిషిని మహనీయుడిగా మార్చే మహత్తరమైన శక్తి మనస్సుకు ఉంటుంది, ఆ మనసును ఆధీనపరచుట కేవలం మనిషికే ఉంటుంది. ధర్మార్ధ కామ మోక్షాల, జీవిత పరమార్ధం గురించి వాటిని విలువల గురించి మనం గురువు ద్వారానే తెలుసుకో గలుగుతాం. జీవితంలో ఏ ఇబ్బందులు పడకుండా శిష్యులను గురువు తన శక్తితో రక్షిస్తూ ,శిష్యులకు మార్గనిర్దేశం చేస్తూ రక్షణగా ఉంటాడు, 
*జై గురుదేవా*
సేకరణ: శ్రీ  భళ్లమూడి హనుమద్ రామకృష్ణ,  వాడపల్లి

కామెంట్‌లు లేవు: