5, ఆగస్టు 2020, బుధవారం

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

సంగీతవిద్వాన్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
(9 జనవరి 1948).
ప్రముఖ సంగీత విద్వాంసులు. తిరుమలతిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలితసంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందారు.ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రిలో జన్మించారం. కర్ణాటకసంగీతంలొ డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీతకళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్యసంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించారు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీతస్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నారు. 1978లో అన్నమాచార్యప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరారు. అన్నమయ్యసంగీత, సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరకు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ప్రధానసభ్యుడిగా ఉన్నారు. వివిధస్థాయిలలో ఈ సంస్థను గొప్పసాంసృతికసంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశారు. నాలుగుదశాబ్దాల నాదోపాసనలో సంపూర్ణవిశ్వాసంతో, అంకితభావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించారు. 6000లకు పైగా కచేరీలు చేశారు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశారు. తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశారు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించారు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించారు.సంకీర్తనయజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుడు ఒకరోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్టణంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించారు.వీటిలో కొన్ని భాగాలు మాటీవీ, భక్తిటీవి ప్రసారం అయ్యాయి.
భక్తిటీవీ "హరి సంకీర్తనం" కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్యసంకీర్తనలను సామాన్యులకు నేర్పాడు. ఈయన రెండవ కుమారుడు జి.వి.యన్. అనిలకుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనటం గుర్తించదగ్గది. ఎంతో మంది సంగీత ప్రియులు ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణప్రసాద్ నుండి నేరుగా నేర్చుకొనగలిగారు.
లక్షగళార్చన: 2008 మే 10లో సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షమందికి పైగా గాయకులు బాలకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ఆంధ్ర (అమెరికా తెలుగు సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సం యుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలోని అనేక చానెల్స్ లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.
600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన అసాధారణ సేవలకు గాను వెండిపతకం, ప్రశంసా పత్రంతో సత్కరించింది.
స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై, ఇతర దేవతలపై కృతులు రచించారు. ఆయన స్వంతకృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీతస్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
వ్యక్తిగత జీవితం :-
ఆయన జి.రాధను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని యస్.జానకి మేనల్లుడు

కామెంట్‌లు లేవు: