5, ఆగస్టు 2020, బుధవారం

శ్రీ మహమ్మద్ - హిందువులు

 శ్రీ మహమ్మద్ గారికి హిందువులు అంతా రుణపడి వుంటారు. తమ వర్గ మత పెద్దల నుండి, తీవ్రవాదుల నుండి హెచ్చరికలు వచ్చినా లక్ష్య పెట్టకుండా
తనకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా లోకానికి చెప్పి
అందరికి ఆదర్శంగా నిలిచారు..🙏🙏🙏

ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డా||కరింగమన్ను కుజ్హియిళ్‌ మహమ్మద్‌ (కె.కె.మహ్మద్‌) గారు అయోధ్యపై రాసిన ఓ ఆర్టికల్...

డా|| కె.కె.మహ్మద్‌ :–

”ఈ అయోద్య విషయాన్ని వివరించ కుండా నా జీవిత కథ పూర్తికాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏవిధంగానూ ఉపయోగించవద్దు. "

1990లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కాని అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది.

దిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, అయోధ్య వద్ద విస్తృత పరిశీలన (సర్వే) జరుపుతున్న ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యునిగా ఉన్నాను. అంతకు ముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాము. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణను ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం.

బాబ్రి మసీదు గోడలపై పొందుపరచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల్లని సాలగ్రామం వంటి శిలతో (బ్లాక్‌ బసల్ట్‌) తయారయ్యాయి. 11-12 శతాబ్దిలలోని ఆచరణకు అనుగుణంగా స్తంభాల దిగువ భాగంలో ‘పూర్ణ కలశాలు’ చెక్కబడి ఉన్నాయి. ఆలయ కళలో పూర్ణ కలశాలు సంపదను సూచించే ఎనిమిది పవిత్ర చిహ్నాలలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1992లో మసీదు కూల్చిన సమయంలో అటువంటి పధ్నాలుగు స్తంభాలు అక్కడ బయటపడ్డాయి. మసీదు పోలీసు వారి రక్షణలో ఉంటూ, లోపలికి ఎవరినీ రానీయక పోయినప్పటికీ, మేము పరిశోధక బృంద సభ్యుల కావడంతో మమ్మల్ని ఎవరూ నిరోధించలేదు. అందువలన నేను స్తంభాలను చాలా దగ్గర నుండి చూడగలిగాను. ప్రొఫెసర్‌ బి.బి.లాల్‌ నేతృత్వంలోని బృందంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం (ఆర్కియాలజి సర్వే ఆఫ్‌ – ఎఎస్‌ఐ) అధికారులతో పాటు పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థులం మేము పన్నెండు మందిమి ఉన్నాము. అయోధ్యలో వివిధ అన్వేషణల్లో రెండు నెలలు గడిపాం.

బాబర్‌ సేనాధి పతి మీర్‌, అంతకు ముందు తామే కూల్చివేసిన ఆలయ శిథిలాలను ఉపయోగించి ఈ మసీదును నిర్మించాడు. మసీదు వెనుక వైపున, ప్రక్కవైపునా త్రవ్వకాలు జరిపేటప్పుడు బ్లాక్‌ బసల్ట్‌ స్తంభాలతో నిలిచి ఉన్న ఇటుక వేదికలను మేము కనుగొన్నాము. ఈ వాస్తవాల ఆధారంగానే బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందని 1990లో నేను ప్రకటించాను.

అయోధ్యలో కట్టడం కూల్చివేత సమయంలో దొరికిన విలక్షణమైన శిల్పం ‘విష్ణుహరి శిల’ అనే రాతి ఫలకం. బలినీ, దశ కంఠుని (రావణ) హతమార్చిన విష్ణువుకు (రాముడు విష్ణుమూర్తి అవతారం) ఈ దేవాలయం అంకితం చేయబడినదని – ఈ ఫలకంపై సంస్కృతంలో 11-12 శతాబ్ది నాటి నాగరి లిపిలో, వ్రాయబడి ఉంది.

1992లో డా||వైడి శర్మ, డా||కెఎమ్‌ శ్రీ వాత్సవలు ఈ స్థలం గురించి అధ్యయనం చేసినప్పుడు మట్టితో చేసిన విష్ణు అవతారాలు, శివ, పార్వతుల చిన్న విగ్రహాలను కనుగొన్నారు. ఇవి కుషాణుల కాలానికి చెందినవి (100-300 ఎడి). 2003లో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై మరల త్రవ్వకాలు జరిపినప్పుడు, ఒకప్పుడు ఆలయ స్తంభాలకు ఆధారంగా నిలచిన 50కి మించిన ఇటుక పునాదులను కనుగొన్నారు. సాధారణంగా దేవాలయాల పై భాగంలో కనబడే ‘అమలక’, ‘అభిషేక’ జలం ప్రవహించే ‘మకర ప్రణాళి’ కూడా త్రవ్వకాలలో ఉన్నాయి. బాబ్రి మసీదు ముందు ప్రాంగణం చదును చేసే సమయంలో 263 ఆలయ సంబంధిత కళాకృతులు కనుగొన్నట్లు ఉత్తరప్రదేశ్‌ ఆర్కియాలజి సంచాలకులు డా||రాగేశ్‌ తివారి ఒక నివేదిక సమర్పించారు.

త్రవ్వకాలలో లభించిన సాక్ష్యాలు, తరువాత ఆవిష్కరించిన చారిత్రక కళాకృతుల సమగ్ర విశ్లేషణ తరువాత, బాబ్రి మసీదు దిగువన ఆలయం ఉందనే నిర్ణయానికి భారత పురావస్తు సర్వేక్షణ (ఎఎస్‌ఐ) వచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు, లక్నో బెంచ్‌ కూడా అదే నిర్ణయానికి వచ్చింది.

త్రవ్వకాలను నిస్పాక్షికంగా నిర్వహించడానికి 131 మంది బృందంలో 52 మంది ముస్లింలను త్రవ్వకాలలో చేర్చారు. అంతేకాక, బిఎంఎసి బృందానికి చెందిన పురావస్తు, చారిత్రక ప్రతినిధులు – సూరజ్‌ భాన్‌, మండల్‌, సుప్రియ వర్మ, జయమీనన్‌ల సమక్షంలో త్రవ్వకాలు జరిగాయి.

వామపక్ష చరిత్రకారులకు వార్తా పత్రికలు, ఇతర పత్రికలలో చాలా పలుకుబడి ఉండడంతో, అయోధ్యకు సంబంధించిన యదార్థాలను ప్రశ్నిస్తూ వారు ప్రచురించిన వ్యాసాలు సాధారణ ప్రజలను గందరగోళానికి గురి చేసాయి. ఈ రకమైన వాతావరణం వలన ఒకానొక సమయంలో తమ వాదనను పక్కనపెట్టి హిందువుల వాదనను ఒప్పుకోవచ్చునేమో అని ఆలోచించిన కొందరు సాధారణ ముస్లిములు సైతం నెమ్మదిగా తమ వైఖరిని మార్చుకోవడం ప్రారంభించారు. దాంతో మితవాదులు కూడా బాబ్రి మసీదును వదులుకోజాలమనే వైఖరికి కట్టుబడవలసి వచ్చింది.

కమ్యూనిస్టు చరిత్రకారుల జోక్యం వారి మానసిక పరిస్థితిని మార్చివేసింది. ఈ రెండు గ్రూపులు కలసి సంయుక్తంగా చేసిన అల్లరితో పరిష్కారానికి ఉన్న అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

జర్మనీకి చెందిన అంతర్జాతీయ త్రవ్వకాల బృందంతో ఒకసారి నేను ఒమన్‌ దేశంలోని సలాలా వెళ్ళాను. భూగర్భ నగరం అల్‌ బాలిద్‌ త్రవ్వకం మా లక్ష్యం. అక్కడ నాకు కొందరు కేరళీయులతో పరిచయం కలిగింది. వారు కేరళలో కన్నూర్‌-తలస్సెరి ప్రాంతానికి చెందినవారు. వారందరు సిమి సానుభూతి పరులు కూడా. వారు నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిలో కొందరికి అయోధ్యపైనా అభిప్రాయాలు తెలుసు. కాని నేను వారికి కొన్ని నియమాలు విధించాను. నేను వచ్చి మాట్లాడతాను. నా అభిప్రాయాలను ప్రశ్నించవచ్చు. కాని నేను జర్మనీ వారి ఆహ్వానంపై అక్కడకు వెళ్ళాను కాబట్టి, అక్కడ ఎటువంటి అసహ్యమైన సంఘటన జరుగరాదు. క్రమశిక్షణ పాటించాలి. వ్యతిరేక అభిప్రాయాల పట్ల సహనం కలిగి ఉండాలి. వారు అంగీకరించిన మీదట నేను రామజన్మభూమి గురించి మాట్లాడాను. ప్రారంభంలో ఇస్లాం సహనంతో ఉన్న కాలంతో ప్రారంభించాను.  త్రవ్వకాలలో కళాఖండాల ఆవిష్కరణ గురించి నేను వివరంగా మాట్లాడాను. వారు అత్యంత శ్రద్ధగా విన్నారు. నా ఉపన్యాసాన్ని ఈ విధంగా ముగించాను.

‘ముస్లింలకు మక్కా, మదీనా ఎలాగో హిందువులకు అయోధ్య అదేవిధంగా ముఖ్యమైనది. మక్కా గాని, మదీనా గాని వేరొక మతం ఆధీనంలో ఉండడాన్ని ఏ ముస్లిమూ ఊహించలేడు. హిందువులు జనాధిక్యంగా ఉన్న దేశంలో కూడ, తమ దేవాలయం ముస్లిముల ఆధీనంలో ఉన్నదనే అవమానాన్ని ఎదుర్కొంటున్న  హిందువుల మొరను ముస్లిములు ఆలకించాలి. హిందువులు బాబ్రి మసీదును రామజన్మ భూమిగా నమ్ముతుండగా, ఆ ప్రాంతంలో ప్రవక్త మహమ్మదుకు ఏ సంబంధమూ లేదు. స్థలానికి సహబీస్‌తో కాని ఖులాఫర్‌ రన్విదిన్‌తో కాని ఏ సంబంధము లేదు; అలాగే, తాబియన్‌తో కాని, ఔలియ లేదా సలాఫ్‌ అజ్‌ – సలియాతో కాని ఏ సంబంధం లేదు. ఇది మొగల్‌ పాదుషా బాబర్‌కు మాత్రమే సంబంధించినది. అటువంటప్పుడు ఈ మసీదుకు అంతటి ప్రాముఖ్యం ఎందుకు?

నేను నా చిన్ననాటి సంఘటన వివరించాను. ‘జెరూసలేం కు చెందిన బైతుల్‌ ముక్దాస్‌ యూదుల వశమైనప్పుడు మేమందరం కొడువలి జుమా మసీదులో సమావేశమై, బైతుల్‌ ముక్దాసును తిరిగి పొందడానికి అల్లాకు మొరపెట్టుకున్నాము. మనం బైతుల్‌ ముక్దాస్‌ను కోల్పోయినప్పుడు పడిన క్షోభనే ఒక సాధారణ హిందువు ఈ రోజు అనుభవిస్తున్నాడు. నేను విద్యావంతుడైన ప్రగతి శీల హిందువు గురించి మాట్లాడటం లేదు. తీవ్రమైన చలి కాలంలో పైన చొక్కా లేకుండ, కాళ్ళకు చెప్పులు లేకుండ, కేవలం శ్రీరాముని దర్శనం కోసం ఎంతో దూరం నుండి నడచి వచ్చే ఉత్తర భారతదేశపు హిందువు గురించి మాట్లాడుతున్నాను. వారి బంధమూ, మతపరమైన వారి భావాలను మనం గౌరవించలేమా?

అక్కడున్న ప్రేక్షకులు అంతర్మథనానికి లోనయారు. నేను కొనసాగించాను. స్వాతంత్య్రానంతరం ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఏర్పడింది. భారతదేశం ఒక హిందూ రాజ్యంగా ప్రకటించుకోగలిగి ఉండేది. కాని ఆ విధంగా జరుగలేదు. ముస్లిం అల్పసంఖ్యాకులకు వారి స్వంత దేశాన్ని ఇచ్చిన తరువాత సైతం, భారతదేశాన్ని ఒక మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించారు. ఇటువంటి విశాల హృదయాన్ని ప్రపంచంలో మరెక్కడా చూడలేము.
ప్రేక్షకులకు కొంత ఆలోచించే అవకాశం ఇస్తూ కొద్దిసేపు ఆగిపోయాను. ఆ తరువాత కొనసాగించాను. ‘ముసిములే అధిక సంఖ్యలో ఉంటే భారతదేశం మతాతీత లౌకిక రాజ్యం అయ్యేదా?’. ప్రేక్షకుల నుండి సమాధానం లేదు. నేను చెప్పాను. ‘లేదు, భారతదేశం ముస్లిం జనాధిక్యత కల దేశమే అయి ఉంటే, అల్ప సంఖ్యా హిందువులకు ప్రత్యేక దేశాన్ని ఇచ్చిన తరువాత తనను తాను మతాతీత లౌకిక రాజ్యంగా ప్రకటించుకొని ఉండేది కాదు. హిందుత్వంలో నున్న విశాల దృక్పథం ఇదే. అదే హిందుత్వ సహనశీలత. ఈ ఉదార మనస్సును మనం అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.

భారతదేశంలో హిందువులు కాక వేరొక మతస్తులు అధిక సంఖ్యాకులయి ఉంటే, ముస్లిముల దుస్థితి ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఊహించడం మంచిది. అటువంటి చారిత్రక వాస్తవాన్ని అందరూ అంగీకరించి, రాజీ పడడానికి సిద్ధపడతారు. అప్పుడే మనం సరైన అర్థంలో మతాతీత లౌకిక రాజ్యం అవుతాము. ఈ ఆలోచనా విధానాన్ని నేను రివర్స్‌ థింకింగ్‌ అని పిలిచాను. మీరు హిందువు అయితే మీరు ముస్లింను అని ఊహించుకొని సమస్యను చేరుకోండి. ఒకవేళ మీరు ముస్లిం అయితే మీరే హిందువునని భావించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మనం వేర్వేరు మతాలకు చెందిన వారమవడం కేవలం యాదృచ్ఛికం.

Dr.K.K.మహమ్మద్

(ఒక ఇంగ్లీషు పత్రికలో వచ్చిన దానికి నా స్వేచ్చానువాదం)

కామెంట్‌లు లేవు: