25, ఆగస్టు 2020, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*పూజాం చ మహతీం కుర్యాద్విత్తశాఠ్యవివర్జితః|*

*చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే॥6946॥*

ఆనాడు ధనమునకు వెనుకాడక భగవంతునకు భక్తి శ్రద్ధలతో మహాపూజను చేయవలెను. పాలతో పాయసమును వండి శ్రీమహావిష్ణువునకు నివేదన చేయవలెను.

*16.52 (ఏబది రెండవ శ్లోకము)*

*శృతేన తేన పురుషం యజేత సుసమాహితః|*

*నైవేద్యం చాతిగుణవద్దద్యాత్పురుషతుష్టిదం॥6947॥*

ఏకాగ్రచిత్తముతో అట్లు వండిన పాయసముతో భగవంతునకు హోమముల ద్వారా పురుషసూక్త విధానముతో అర్చింవలెను. సత్త్వగుణయుక్తమైన, రుచికరమైన నైవేద్యమును సమర్పింపవలెను.

*16.53 (ఏబది మూడవ శ్లోకము)*

*ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః|*

*తోషయేదృత్విజశ్చైవ తద్విద్ధ్యారాధనం హరేః॥6948॥*

జ్ఞానసంపన్నుడైన ఆచార్యుని మరియు బ్రాహ్మణుని వస్త్రాభరణములతో గోదానముతో సంతుష్టులను గావింపవలెను. దీనిని గూడ భగవదారాధనయే అని  తెలిసికొనుము.

*16.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*భోజయేత్తాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే|*

*అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా యే చ తత్ర సమాగతాః॥6949॥*

సాధ్వీ! ఆచార్యుని, ఋత్విజులను పవిత్రమైన సాత్త్విక గుణయుక్తమైన   భోజన పదార్ధములతో సంతుష్టిపరచవలెను. తదితర బ్రాహ్మణులను,అచటకు విచ్చేసిన అతిథులను గూడ శక్త్యనుసారము భోజనముతో సంతృప్తిపరచవలెను.

*16.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*దక్షిణాం గురవే దద్యాదృత్విగ్భ్యశ్చ యథార్హతః|*

*అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్సముపాగతాన్॥6950॥*

*16.56 (ఏబది ఆరవ శ్లోకము)*

*భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ|*

*విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః॥6951॥*

గురువునకు, ఋత్విజులకు, యథాయోగ్యముగా దక్షిణలను ఇయ్యవలెను. అచట చేరిన చండాలురు మొదలగు వారిని, దీనులను, అంధులను! బుద్ధిహీనులను గూడ అన్నదానములతో సంతోషపెట్టవలెను. అందరును భుజించిన పిదప వారిని సత్కరించవలెను. ఈ విధముగా అందరిని సత్కరించుటవలన  శ్రీమహావిష్ణువు ప్రీతి చెందునని సాధకుడు భావించవలెను. తదుపరి తమ బంధుమిత్రులతో గూడి తాము కూడా భుజింపవలెను.

*16.57 (ఏబది ఏడవ శ్లోకము)*

*నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిః స్వస్తివాచకైః|*

*కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోఽన్వహమ్॥6953॥*

పాడ్యమి మొదలుకొని, శని త్రయోదశి వరకు నృత్యగానములతో, వాద్య గోష్ఠులతో, స్తుతులతో, స్వస్తి వాచనములతో, భగవత్కథలతో శ్రీహరి పూజలను జరుపవలెను.

*16.58 (ఏబది ఎనిమిదవ శ్లోకము)*

*ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరమ్|*

*పితామహేనాభిహితం మయా తే సముదాహృతమ్॥6953॥*

దేవీ! *పయోవ్రతము* అని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరాధించే సర్వోత్కృష్టమైన విధానము గలది. దీనిని బ్రహ్మదేవుడు నాకు తెలిపినవిధముగా నీకు వివరించితిని.

*16.59 (ఏబది తొమ్మిదవ శ్లోకము)*

*త్వం చానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవమ్|*

*ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయమ్॥6954॥*

నీవు మిక్కిలి భాగ్యశాలినివి. ఇంద్రియములను వశమలో నుంచుకొని పవిత్రభావముతో శ్రద్ధగా ఈ వ్రటతమును ఆచరింపుము. దీని ద్వారా శ్రీమహావిష్ణువును ఆరాధింపుము.

*16.60 (అరువదియవ శ్లోకము)*

*అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతమ్|*

*తపఃసారమిదం భద్రే దానం చేశ్వరతర్పణమ్॥6955॥*

కల్యాణీ! ఈ వ్రతము వలన భగవంతుడు సంతష్టుడు అగును. అందువలన దీనిని సర్వయజ్ఞము, సర్వవ్రతము అనియందురు. ఇది సమగ్రతపశ్చర్యల సారము. ఇదియే గొప్ప దానము.

*16.61 (అరువది ఒకటవ శ్లోకము)*

*త ఏవ నియమాః సాక్షాత్త ఏవ చ యమోత్తమాః|*

*తపో దానం వ్రతం యజ్ఞో యేన తుష్యత్యధోక్షజః॥6956॥*

అధోక్షజుని ప్రసన్నునిగా చేయు కార్యములే ఉత్తమమైన యమ నియమములు. అవియే వాస్తవమైన తపస్సులు, దానములు , వ్రతములు, యజ్ఞములు.

*16.62 (అరువది రెండవ శ్లోకము)*

*తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయా చర|*

*భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి॥6957॥*

దేవీ! అందువలన సంయమముతో, శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపుము. భగవంతుడు శీఘ్రముగా నీ యెడల ప్రసన్నుడై నీ అభిలాషను పూర్తి చేయును.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశోఽధ్యాయః (16)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు పదునారవ అధ్యాయము (16)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

కామెంట్‌లు లేవు: