5, సెప్టెంబర్ 2020, శనివారం

రామాయణమ్. 52


...
రామా! నీవు నాకు పుట్టకపోయినా బాగుండేదిరా
నాయనా ఈ శోకం తప్పేది! నాకు దుఃఖము కలిగించటానికే పుట్టావు నాయనా నీవు .గొడ్రాలికి ఒకటే శోకం ! పిల్లలులేరే అని ! .
.
మీ తండ్రి గారి ఏలుబడిలో నేను ఏ మంగళముగానీ ,సుఖముగానీ ఎరుగను నీ అధికారములో అవి అనుభవించవచ్చులే అని నా ఆశ!.
.
నా కేం తక్కువ? అయినా సవతులచేత మాటలుపడ్డాను.కైక పెట్టిన అవమానములు భరించాను ,ఆవిడ మాటలు విని నీ తండ్రి నన్ను చిన్న చూపు చూసినా అన్నీ నీవున్నావులే అనే ఆశతో సహించాను ! ఓపిక పట్టాను ! ఇక ముందు నా గతి ఏమి కాను ? భరతుని చూసి భయముతో అందరూ నన్ను కనీసం పలకరించనైనా పలకరించరు!
.
రామా ఈ వార్త విని నా గుండె బ్రద్దలవటం లేదేమిరా,ఇంత రాయి అయినదేమిరా నాయనా ఇది!.నాకు యమలోకములో కూడా చోటులేదు!అని అంటూ కొడుకుకు కలిగిన కష్టాన్ని తలుచుకుంటూ పరిపరి విధాలుగా రోదించి రోదించి కంట కన్నీరు కూడా ఇంకిపోయిందామెకు!.
.
పెత్తల్లి రోదనలు వింటున్న లక్ష్మణుడు దీనంగా ,అన్నా ! ఒక ఆడుదాని మాటకు గౌరవమిచ్చి నీవు అడవులకు వెళ్ళటమెందుకు?.
.
ముసలివాడైన రాజుకు ఇంకా కోరిక చావక కామంతో కళ్ళుమూసుకుపోయి అనాలోచితంగా అనుచితమైన కోరిక కోరాడు.
.
బుద్ధిగలవాడెవెడయినా సద్గుణాలప్రోవు అయిన కుమారుడిని పోగొట్టుకుంటాడా! మతిభ్రమించిన రాజాజ్ఞ ను నీవు పాటించనక్కరలేదు!.
.
అన్నా పద ! ఇప్పుడే ఈ క్షణమే ఈ రాజ్యాన్ని మనము చేజిక్కించుకుందాము!
.
రాజా! బూజా! తరాజా! ఎవడైననేమి? వాడి అంతు చూద్దాము! అవసరమయితేబుద్ధిలేనిరాజునువధించనయినావధిస్తాను.
.
భరతుడి పక్షము వారెవరెవరయినా అడ్డువస్తే చీల్చి చెండాడతాను ! అనుజ్ఞ ఇవ్వన్నా!
.
ఏ బలం చూసుకొని రాజు నీతో వైరం పెట్టుకున్నాడు ఎదిరించి నిలువగలడనేనా?.
.
నా ధనుస్సుమీద,సత్యముమీద, నేను చేసిన దానయజ్ఞాలమీద అవిచ్చిన ఫలాల మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. రాముడు అగ్నిలో దూకాల్సివస్తే ఆయన కన్నా ముందే దూకుతాను.
.
రాముని కష్టాన్ని తొలగించలేని నా పరాక్రమము బూడిదలో పోయటానికా!
.
తీవ్రమైన ఆగ్రహావేశాలతో కన్నుల నుండి విస్ఫులింగాలు రాలుతున్నాయి. ముఖము కందగడ్డలా మారిపోయింది! క్రోధంతో ఊగిపోతున్నాడు లక్ష్మణుడు.
.
 కానీ ఆయన క్రోధ సముద్రము రాముడు అనే చెలియలికట్ట దాటలేకుంది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: