5, సెప్టెంబర్ 2020, శనివారం

మనస్తత్వం


ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు. సంతోషంతో ఇంటికి చేరాడు. పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు. వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు. ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు. మనలో చాలా మంది ఈ తరహానే. లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు. లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.
           *🌷 స్వస్తి! 🌷*

కామెంట్‌లు లేవు: