18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మధురాంతేశ్వర సిద్ధి* *వినాయక ఆలయం, మధూరు

 *.* 



కాణిపాకం వినాయకుడి గురించి తెలుసు..కానీ అలాగే రోజు రోజుకూ పెరిగే గణేశుడు ఎక్కడ వున్నాడో తెలుసా..



జగన్మాత కుమారుడైన విఘ్నేశ్వరుడి విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని మధూరు మధురాంతేశ్వర సిద్ది వినాయక ఆలయం ఒకటి.


 మధురవాహినీ నదీతీరంలో ప్రకృతి రమణీయత మధ్య కొలువు దీరిన ఆ విఘ్నరాజు దర్శనానికి దేశం నలుమూలల నుంచీ భక్తులు బారులు తీరతారు.



మధూరు ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఇక్కడ కొలువైన వినాయకుడు మధురాంతేశ్వర స్వామిగా పూజలందు కుంటాడు. గర్భగుడిలో ఆ గజముఖుడి పక్కనే జగన్మాత పార్వతీదేవి కూడా కొలువై కుమారుడితో 

సమానంగా నిత్యపూజలూ అభిషేకాలూ అందుకుంటుంది. 


అలానే ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి, వీరభద్రుడితోపాటు గణపతి సోదరులైన అయ్యప్ప, సుబ్రమణ్య స్వామి కూడా కొలువు దీరి ఉన్నారు


మధుర్ మహాగణపతి ఆలయం మిగతా ఆలయాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. మూడు చుట్టలుగా ఉన్న ప్రాకారాల రూపంలో ఇది ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలాగా కనిపించే ఇలాంటి నిర్మాణాలని ‘గజప్రిస్త’ గోపురాలని అంటారు. ఆలయంలోని చెక్క మీద రామాయణ, మహాభారత ఘట్టాలని తలపించే శిల్పాలని చెక్కడం చూడవచ్చు.



ఈ ఆలయానికి ముందు భాగంలో నదీ, మిగతా మూడు వైపులా కొబ్బరి తోటలూ, వరి పొలాలూ... ఉండి పచ్చదనంతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. 


స్థల పురాణం ...


ఒకానొకప్పుడు మధురవాహినీ నదీతీరంలో మధూరు అనే మహిళ నీటికోసం వెళ్లినప్పుడు గణపతి ఆమె ఎదుట సాక్షాత్కారించి విగ్రహంగా మారిపోతాడు. వెంటనే ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియ జేసి వారి సాయంతో ఆ ఉద్భవమూర్తిని నది ఒడ్డునే ఉన్న శివాలయంలోకి చేర్చు తుంది మధూరు. అందుకనే ఆమె పేరు పైనే మధూరు ఆలయంగా ప్రసిద్ది చెందింది.


 అలానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని టిప్పు సుల్తాన్ దండెత్తి వస్తాడు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోని బావి 

నీళ్లను తాగిన తరవాత మనసు మార్చుకుని దాడిని విరమించుకుని... స్వామిని భక్తితో కొలిచి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థల పురాణం చెబుతోంది.


 బ్రహ్మాండపురాణంలో సాక్షాత్తూ భార్గవ రాముడే ఈ గుడిని నిర్మించి 

వినాయకుడికి పూజలు జరిపించినట్టుగా ఉంది. అయితే 10వ, 15వ శతాబ్దాల్లో ఈ గుడిని పునర్నిర్మించినట్టూ, పలువురు రాజవంశీయులు ఈ గుడికి ధర్మకర్తలుగా ఉన్నట్టూ చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 



కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్నే ఇక్కడ మహాగణపతికి నైవేద్యంగా పెడతారు. అదే భక్తులకు ప్రసాదంగానూ ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాస్తమాన సేవలను ఘనంగా నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి 

అప్పాలతో ప్రతిరోజూ పూజలు జరిపించడం విశేషం. మూడ అప్పం పేరుతో మరో పూజా కార్యక్రమం కూడా జరుపుతారు. 


అందులో

భాగంగా స్వామి వారికి ఏ అలంకారం లేకుండా విగ్రహాన్ని అప్పాలతో కప్పేసి పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. 


వినాయక చవితికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 


🍁🍁🍁

కామెంట్‌లు లేవు: