5, మార్చి 2023, ఆదివారం

అద్వైతశాఖ

 శైవంలో అద్వైతశాఖ ఒకటుంది


జపాన్ దేశం నుండి వచ్చిన ఒక యువసంస్కృత పండితుడు టోక్యో విశ్వ విద్యాలయంలో సంస్కృత భాషోపన్యాసకుడుగా ఉద్యోగం చేస్తున్న మినోరుహర అనే వారికి ఈ యేడు ఆగస్టు 12, సోమవారం రాత్రి స్వామివారు దర్శనమిచ్చారు. వారి సంభాషణ 90 నిమిషాలపాటు జరిగింది. వచ్చిన పండితుణ్ణి స్వామివారికి సరిచయంచేసి, డాక్టర్ వి. రాఘవన్ ఇరువురి ప్రశ్నోత్తరాలనూ వారివారి భాషల్లో వివరించి చెప్పారు. మినోరుహర హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ శైవశాఖలపై పరిశోధన సాగిస్తున్నారు. సాంస్కృతిక వినిమయ పథకం క్రింద భారత ప్రభుత్వానికి అతిథిగా భారతదేశాన్ని సందర్శించటానికి వచ్చారు. పలుప్రాంతాలు సందర్శించి కంచికి వచ్చి స్వామివారిని సందర్శించారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృతాచార్యులుగా పనిచేస్తున్న శ్రీ పి. తిరుజ్ఞాన సంబంధం కూడా మినోరుహర స్వామివారితో మాట్లాడినప్పుడక్కడే వున్నారు.


ముందు మినోరుహర మోకాళ్ల మీద వంగి చేతులు జోడించి జెపానీయుల పద్ధతిలో స్వామివారికి నమస్కారాలు తెలిపారు. 'హర' అనే పదం శివుని పేరంటూ స్వామివారే సంభాషణ ప్రారంభించారు.

శైవమతం దక్షిణాదికి ఎప్పుడెలా వచ్చిందో, అక్కడది వర్దిల్లటానికి కారణాలేమిటో చెప్పండని మినోరుహర కోరారు.


“శైవం దక్షిణ భారతంలో వర్ధిల్లనికాలమంటూ లేదు. అనాదిగా నాగరకత కళ్లు తెరిచినప్పటి నుండీ అదిక్కడుంది” అని స్వామివారన్నారు.


అద్వైతానికీ శైవానికీ వున్న సంబంధాన్ని వివరించండని మినోరుహర కోరారు.


"శైవశాఖలు చాలా వున్నాయి. అందులో ఏ శాఖను గురించి అడుగుతున్నా” రని స్వామివారడిగారు. “శైవంలోనే అద్వైత శైవం అనేది అంతర్భాగంగా వుంది. అలాగే ద్వైత శైవాలూ అనేకాలున్నాయి. ఈ రెండు రకాల శైవాలూ కాశ్మీరులోనూ దక్షిణ భారతంలోనూ బాగా వృద్ధి చెందాయి. దక్షిణాది శైవ శాఖల్లో ప్రసిద్ధమైనవి సిద్ధాంత శైవం, వీరశైవం అనేవి. సిద్ధాంత శైవం తమిళ ప్రాంతంలోనూ, వీర శైవం కన్నడ, తెలుగు సీమలలోనూ వ్యాపించాయి. “దక్షిణ భారతంలో వల్లాలారేశాస్త్రం అని అద్వైత సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని వర్ధిల్లిన రచనలు కొందరు శైవసిద్ధాంతులు చేశారు. సిద్ధాంత శైవశాఖలో కూడా శివాగ్రయోగి లాంటి అద్వైతులు చేసిన రచనలెన్నో వున్నాయి. మోక్షావస్థలో జీవుడు శివునిలో (పరమాత్మలో) లీనమై అభేదస్థితిని పొందుతాడని చెప్పే అద్వైతశైవశాఖ ఒకటి, మోక్ష స్థితిలో కూడా శైవునికీ, శివునికి భేదస్థితే గాని అభేదస్థితి లేదని ప్రతిపాదించే ద్వైతశాఖ ఒకటి వున్నాయి. ఈ రెండో శాఖ శ్రీరామానుజుల విశిష్టాద్వైతం. అందులో జీవుడు ప్రాపంచిక బంధాలనుండి విముక్తి పొందిన తర్వాతకూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోడు. భగవంతుని అనంత కల్యాణ గుణాలవల్ల అపారమైన అనుగ్రహభాగ్యంవల్ల కలిగే ఆనందాన్ని అనుభవిస్తూనే వుంటాడు.


“కాని విశేష ప్రచారంలోవున్న శైవసిద్ధాంతం ప్రకారం జీవుని వ్యక్తిత్వం అనేది మాటవరసకు ప్రత్యేకంగా నిలిచివున్నప్పటికీ, అనుభవంలో మాత్రం పరమాత్ముని సర్వవ్యాపకమైన తేజస్సులో లీనమైపోతుంది. సూర్యోదయమయాక నక్షత్రాలు కనబడకపోవటం పాలకుండలో జారిన నీటి బొట్టు అదృశ్యం కావటం లాంటి స్థితి అది” అని స్వామివారు చెప్పారు.


స్వామివారడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ మినోరుహర "నే నధ్యయనం చేసినంత మట్టుకు పాశుపత సూత్రాలు మతసంబంధమైన విషయాలను గురించి చెప్పినంత తత్త్వ సంబంధమైన విషయాలను గురించి చెప్పలేదనుకుంటాను” అన్నారు.


ఆ మాటలు విని చిరునవ్వుతో "మత విషయాలు హృదయాన్ని కదిలిస్తాయి. వేదాంత విషయాలు బుద్ధికి వికాసం కలిగిస్తాయి” అన్నారు స్వామి.


తిరువాన్కూరు సంస్కృత గ్రంథమాలవారు కౌండిన్యభాష్యంతో కలిపి ప్రచురించిన పాశుపత సూత్రాలను ఆధారం చేసుకుని మినోరుహర మాట్లాడుతున్నారని డాక్టర్ రాఘవన్ స్వామివారికి విన్నవించారు.


అయితే పాశుపత సూత్రాలు భగవంతుణ్ణి ఉపాదానకారణంగా భావించాయా లేక నిమిత్తకారణంగా భావించాయా అని స్వామివారు ప్రశ్నించారు. దానికి రాఘవన్ “ఇలాంటి వేదాంత విషయాల్లో దేశంలో ప్రచారంలో వున్న నాలుగు శాస్త్రీయ శైవశాఖలూ న్యాయశాస్త్రాన్నే అనుసరించాయి. ఉద్దోతనకారుల వంటి నైయాయికులు పాశుపతాచార్యులుగానే పరిగణింపబడ్డారు. వారందరూ నిమిత్త కారణవాదులే” అని సమాధానం చెప్పారు. “ఈ విషయం గురించి మీ విద్యార్థుల్లో కొందరిని పరిశోధన చేయమనండి” అని స్వామివారు డాక్టర్ రాఘవ తో అన్నారు. 


మీరేనా మరెవరైనా జపాన్ దేశ పండితులు శైవాన్ని గురించి పరిశోధన చేసున్నారా? అని ఆచార్యులవారు మినోరుహర వైపు తిరిగి అడిగారు.


హర : నేనే ప్రస్తుతానికి.


స్వామివారు అప్పుడు 'షింటోయిజం' గురించి ప్రస్తావించారు. 


దానికి సమాధానం చెబుతూ మినోరుహర “షింటో మతం ప్రాచీనమైంది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచో, 3వ శతాబ్దం నుంచో వస్తోంది. కాని దానిమీద వ్యాఖ్యానాలు మాత్రం 15, 16 శతాబ్దాలనాటివి. షింటోమత గ్రంథం ఋగ్వేదంలాగా గేయమంత్రం. అందులోనుంచే వ్యాఖ్యాతలు మత సిద్ధాంతాలన్నీ రూపొందించారు. జపాన్ బౌద్ధమతం 7వ శతాబ్దంలోగాని రాలేదు. ప్రాచీనమైన బౌద్ధ గ్రంథాలు 8వ శతాబ్దంనాటివే అని చెప్పారు.


ప్రాచీన జపనీస్ గ్రంథాల్లో ఎక్కడైనా వేదాల ప్రసక్తి కనపడుతుందా అని అడిగిన ప్రశ్నకు "లే”దని సమాధానం చెప్పారు.


మరి సరస్వతి, గణేశుడు వంటి హిందూదేవతల విగ్రహాలు జపాన్ కెలా తరలివెళ్లాయని స్వామివారడిగినప్పుడు, అవి బౌద్ధమతంతో పాటు వచ్చాయని మినోరుహ సమాధానం చెప్పారు. తాను భారతదేశానికి రావటం ఈ రెండుదేశాల సాంస్కృతిక సంబంధాలు పెంపొందించటం కోసం కూడానని వారన్నారు. 


స్వామివారు : భారతదేశానికి రావటానికి ముందు ఈ దేశాన్ని గురించి మీకు మనస్సులో ఏదో ఒక బొమ్మ వుండి వుండాలి. ఆ బొమ్మ యిక్కడకొచ్చాక ఏమైనా మారిందా? 


మినోరుహర : భారతదేశం నేననుకున్న దానికన్నా ఆసక్తికరంగా వుందని మాత్రం చెప్పగలను. కొన్ని విషయాల్లో అది నా అంచనాలకు సరితూగలేదు. కాని మరికొన్ని విషయాల్లో అది నా అంచనాలు దాటిపోయింది. మొత్తం మీద ఈ దేశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. 


స్వామివారు : ఇంతవరకు మీరు ఏయే కేంద్రాలు సందర్శించారు? 


హర : ఢిల్లీ, లక్నో, వారాణసి, కలకత్తా, మద్రాసు చూశాను. బాంబే, పూనాలకు కూడా వెళ్లాలని వుంది. 


స్వామివారు : సంస్కృత భాషకూ, ఆభాషలో జరుగుతున్న పరిశోధనకూ సంబంధించి ఏకేంద్రం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది.?


హర : నేను చూచినంత మట్టుకు వారాణసి, కలకత్తా, మద్రాసు. వారాణసిలో హిందూ విశ్వవిద్యాలయాన్ని, సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించాను. 


స్వామివారు : ఆ రెంటిలో ఏది మంచిది?


హర : దేని ప్రత్యేకత దానిదే. రెండూ మంచివే.


మరొక ప్రశ్న సమాధానంగా మినోరుహర “జపాన్లోని చాలా కుటుంబాల్లో షింటోమతమూ, బౌద్ధమతమూ రెండూ కనబడతాయి. మా యింట్లో షింటో మందిరం, బుద్ధుని మందిరం రెండూ వున్నాయి. షింటో మతాన్ని అనుసరించేవారికీ, బౌద్ధమతాన్ని అనుసరించే వారికీ వివాహసంబంధాలున్నాయి. జపాన్ ప్రజలు ముఖ్యంగా షింటో మతస్తులు, షింటో మతం "జపనీస్ తనానికి” చిహ్నం. షింటో మతం తరువాతే బౌద్ధమతం వచ్చింది. దాని ప్రభావం షింటో మతం మీద కనబడుతుంది. జపనీయుల సంస్కృతి యావత్తూ షింటో మతంతో ముడిపడివుంది” అన్నారు.


హిందువుల్లోవున్న శ్రాద్ధ సంప్రదాయాలు దృష్టిలో వుంచుకుని “షింటోమతంలో పితృదేవతలకు జరిగే ప్రత్యాబ్దిక క్రతుకాండ ఏవిధంగా వుంటుం”దని స్వామివారు ప్రశ్నించారు.

హర : ప్రతి ఏడూ మార్చి 23, సెప్టెంబరు 23 మాకు శ్రాద్ధదినాలు. ఆ రెండు రోజుల్లో మాత్రమే పగటికాలమూ, రాత్రి కాలమూ సమానంగా వుంటాయి. 


మా దేశంలో చనిపోయినవారికి దహనసంస్కారమే జరుగుతుంది. వారి అస్థులు ఒక పేటికలో వుంచి దానిమీద సమాధి కడతారు. ఆ రెండు రోజులూ సమాధులకు వెళ్లి పుష్పగుచ్చాలుంచి పితృదేవతలను గౌరవించడం మా ఆచారం. ఇదికాక వేరే ప్రత్యాబ్దిక విధికూడా మాకుంది. ఆనాడు పురోహితుడు వచ్చి మంత్రాలు చదువుతాడు. బంధువులు వచ్చి విందారగిస్తారు. చాలా ముఖ్యమైనవి.


“ఇంచుమించు షింటోమతం మా హిందూమతమే అని అనుకోవచ్చా?” అని స్వామివారడిగిన ప్రశ్నకు, “ఈ రెంటికీ కొన్ని సామ్యాలున్నా అవి ఒకటే అనటానికి వీల్లేదు. అతి ప్రాచీనకాలంలో ఈ రెంటికీ ఏదో సంబంధం వుండి వుండవచ్చు" అని మినోరుహర సమాధానం చెప్పారు.


స్వామివారి దగ్గర సెలవు తీసుకునే ముందు "ధన్యోస్మి యన్మయా శ్రీ శంకరాచార్య దర్శనం లబ్దం. కృతార్థోస్మి, శ్రీ శంకరాచార్యులవారి దర్శనం లభించినందుకు నేనెంతో ధన్యుణ్ణి, కృతార్థుణ్ణి” అని మినోరుహర పునర్నమస్కారం చేశారు.


--- మినోరుహ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: